ELR: నూరు శాతం పన్ను వసూలుచేసి ఉంగుటూరు గ్రామాన్ని జిల్లాలోని ఆదర్శంగా నిలుస్తామని గ్రామ సర్పంచి బండారు సింధు మధుబాబు అన్నారు. బుధవారం ఉంగుటూరు పంచాయతీ కార్యాలయంలో ఇంటి పన్ను కులాయి పన్ను వసూలపై సమీక్ష సమావేశం జరిగింది. డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు మాట్లాడుతూ.. పన్ను వసూళ్లలో గ్రామం ఆదర్శంగా నిలిచింది అన్నారు.
విజయనగరంలోని ఓ కళాశాలలో పాల ఉత్పత్తులలో కల్తీని గుర్తించడంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆహార భద్రత నియంత్రణాధికారిణి S.ఈశ్వరి పర్యవేక్షణలో జిల్లా ఆహార భద్రత అధికారి పి. వెంకటరమణ విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించారు. నిత్యం మనం వాడే పాలలో నీరు, యూరియా, స్టార్చ్, డిటర్జెంట్ వంటి హానికర పదార్థాలను ఎలా కలుపుతున్నారో వివరించారు.
CTR: జిల్లా తాలూకా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన ఏఎస్సై టీజీ మనోహరన్కు జిల్లా అడిషనల్ ఎస్పీ ఎస్ఆర్ రాజశేఖర రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ తూషార్ డూడి ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి ₹1 లక్ష తక్షణ సహాయం అందజేశారు. పోలీసు శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
GNTR:మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పోలీసులు విద్యార్థినులతో సమస్యలపై చర్చించారు. స్వీయరక్షణ శిక్షణ ఇచ్చారు. బాల్యవివాహం నేరమని, మహిళలపై మోసాలు, సైబర్ నేరాలపై వివరించారు. సోషల్ మీడియా మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరానికి 112కు కాల్ చేయాలని తెలిపారు.
PLD: బ్యాంకులకు నిర్దేశించిన అన్ని రకాల రుణాల లక్ష్యాలను ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఎస్.ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం సాయంత్రం జిల్లా డి.సి.సి, డి.ఎల్.ఆర్.సి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఇందులో ఎంపీ కృష్ణదేవరాయలు పాల్గొన్నారు.
PPM: సీతానగరం మండలంలోని కోట సీతారాంపురం గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి, ఒక సంపూర్ణ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. ఇందుకోసం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, వాటిపై తీసుకున్న చర్యలు వివరించాలని అధికారులను కోరారు. బుధవారం ఆయన ఛాంబరులో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
విశాఖలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలపై పోలీసుల నిర్బంధాన్ని ఖండిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. జీవీఎంసీ కార్యాలయం వద్ద నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ ఔట్గేట్ వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. మండుటెండలో రెండు గంటల పాటు కార్యకర్తలు బైఠాయించారు.
AKP: మాడుగులలో నిర్మాణంలో ఉన్న అన్న క్యాంటీన్ను పనులను టీడీపీ పట్టణ అధ్యక్షుడు పుప్పాల లక్ష్మీనారాయణ, మండల కార్యదర్శి పుప్పాల రమేష్ పరిశీలించారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కృషితో రూ.65 లక్షల వ్యయంతో నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఉగాది పండుగకు ముందే పనులు పూర్తి చేసి అదే రోజున ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.
ప్రకాశం: పెద్ద దోర్నాల మండలం బొమ్మలాపురంతుమ్మలపల్లి మూల మలుపు వద్ద చిన్న దోర్నాల నుంచి మిర్చి కూలీలతో వెళ్తున్న ఒక ఆటోను ఎదురుగా వస్తున్న మరో ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో రెండు ఆటోలలో మొత్తం సుమారు 35 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఘటనలో 8 మంది తీవ్రంగా గాయపడగా, మిగతా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KDP: గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య తెలిపారు. బుధవారం లింగాల మండలం పార్నపల్లెలో ఇంటింటా ఫీవర్ సర్వే, లార్వా సర్వే నిర్వహించారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాన్ని తప్పనిసరిగా పాటించాలన్నారు. నిల్వ ఉన్న నీటిలో అబేట్ పిచికారి చేశారు.
NDL: డోన్లో పదవీ విరమణ పొందిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని సీఐటీయూ కార్యదర్శి శివరాం, మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కుల్లాయప్ప డిమాండ్ చేశారు. బుధవారం కమిషనర్ ఎస్. ప్రసాద్ గౌడ్కు వినతిపత్రం అందజేసి ఐదుగురు రిటైర్డ్ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
CTR: వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ అయిన తర్వాత ఆలయంలో అపచారాలు పెరిగాయని ఆరోపించారు. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటనపై చేసిన వ్యాఖ్యలు అనుచితమని, భగవద్గీతపై మాట్లాడిన తీరు సరికాదన్నారు. ఆయన నియామకంతో తిరుమల పవిత్రతకు ముప్పు ఏర్పడిందని పేర్కొన్నారు.
గిద్దలూరు పట్టణంలోని ఎస్ఎస్ ప్లాజా డీలక్స్ లాడ్జిలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లాడ్జి రెండో అంతస్తులోని ఏసీ గదిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
NTR: కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో అభివృధి శూన్యం అని వైసీపీ మహిళ నేత సుభాషిణి బుధవారం ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లాలో భూ దందా, ఇసుక మైనింగ్ పేకాట దోపిడీలు పెరిగిపోయాయి అని ఎంపీ కేశినేని చిన్ని జిల్లాలో చేసిన అభివృద్ధి చెప్పుకోలేక తోక నాయకులతో అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారు.
SKLM: ఆదివాసి వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పనిచేయాలని దళిత ఆదివాసి జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక డా. బి.ఆర్. అంబేద్కర్ మందిరంలో సమావేశం నిర్వహించారు. అంబేద్కర్ ఆలోచనలను పల్లె పల్లెకు తీసుకెళ్లాలని, దళితుల సమస్యలు పరిష్కారానికి ప్రతి వారం గ్రీవెన్స్ నిర్వహించి సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు.