NLR: నగరంలోని కిసాన్ నగర్ చేపల మార్కెట్లో కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ దినేశ్ బుధవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు దుకాణాల్లో చెడిపోయిన చేపలను గుర్తించి స్వాధీనం చేసుకుని పినాయిల్ పోసి నిర్వీర్యం చేశారు. నాణ్యతలేని ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కొనుగోలు ముందు నాణ్యతను పరిశీలించాలని తెలిపారు.
TPT: ఎర్పేడు మండలంలోని దేశంలోనే అత్యంత ప్రాచీన శివాలయంగా గుర్తింపు పొందిన గుడిమల్లం శ్రీ పరశురామేశ్వరస్వామి ఆలయంలో ఏప్రిల్ 18 నుంచి 23 వరకు మహా కుంభాభిషేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయ జీర్ణోద్ధరణ పనుల నేపథ్యంలో ఈ నెల 8 నుంచి బాలాలయం నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
W.G: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అమర్నాథ్ నియామకం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
AKP: ప్రభుత్వ భూములపై కోర్టుల్లో కేసులు వేస్తుండడంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. బుధవారం శాసనసభలో మాట్లాడుతూ.. భూముల కేసుల కోసం నియమించిన లైజనింగ్ అధికారులు కుమ్మక్కవుతున్నారని పేర్కొన్నారు. బాధ్యతాయుతంగా రెవిన్యూ అధికారులు పనిచేయకపోతే భూములు అన్యాక్రాంతం అవుతాయన్నారు.
తూ.గో: క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ పడాల పుష్పావతి భర్త మరణం తర్వాత ఒంటరిగా జీవిస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె ఒకటో తేదీ రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి మంగళవారం సాయంత్రం అనపర్తి ఎర్ర కాలువలో మృతదేహం గుర్తించబడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాకినాడ: యు.కొత్తపల్లి ( M) పొన్నాడలో నిర్మిస్తున్న ఐఐఎస్టీకి కేంద్ర ప్రభుత్వం రూ.28.43 కోట్ల పెండింగ్ నిధులను విడుదల చేసిందని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. మొత్తం రూ.229.81 కోట్ల వ్యయంలో కేంద్ర, రాష్ట్రాలు సగం చొప్పున భరించాల్సి ఉందని, Dy. Cm పవన్ చొరవతోనే ఈ నిధులు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో సంస్థ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తికానున్నాయని పేర్కొన్నారు.
ASR: కొయ్యూరు మండలం బాలారంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాదిరాజు రమణ అనే వ్యక్తి కిరాణా దుకాణం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో దుకాణం, సరుకులు, మొత్తం సామాగ్రి కాలి పోవడంతో సుమారు రూ.4 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేకపోతే, ఎవరైనా నిప్పు పెట్టారో తెలియడం లేదని ఆవేదన చెందుతున్నాడు.
E.G: రాష్ట్ర వైసీపీ CEC మెంబర్గా రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావును నియమించారు. ఈ సందర్భంగా ఆయన, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్తో కలిసి బుధవారం తాడేపల్లి పార్టీ కార్యాలయం నందు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుర్రం గౌతం రామ్, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ పాల్గొన్నారు.
TPT: భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వైకుంఠం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం కల్పించారు. రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.
GNTR: పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు బుధవారం పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. జయభరత్ నగర్లో CC రోడ్లు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను కమిషనర్ దృష్టికి తీసుకురాగా, ఆయన స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. తక్షణమే రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
VSP: ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని అన్ని న్యాయ స్థానాలలో ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాదికార సంస్థ మంగళవారం ప్రకటనలో తెలిపింది. లోక్ అదాలత్లో న్యాయస్థానాల్లో పెండింగ్ ఉన్న సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్ట పరిహారాలు పరిష్కరించుకోవచ్చని సూచించింది.
TPT: ఎండలు భగ్గుమన్న వేళ నిమ్మకాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో డిమాండ్ భారీగా పెరగడంతో మన ప్రాంత నిమ్మకాయలకు మంచి మార్కెట్ దక్కుతోంది. ప్రస్తుతం కిలో నిమ్మకాయలు వంద వరకు పలుకుతుండటంతో బాలాయపల్లె రైతులకు లాభాలు చేకూరుతున్నాయి. ఎండల తీవ్రత పెరగడం, నిమ్మరసం వినియోగం అధికమవడం వల్లే ఈ ధరల పెరుగుదల చోటుచేసుకుందని వ్యాపారులు చెబుతున్నారు.
NDL: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ అయ్యారు. ‘కృతజ్ఞతకు, ఆశకు పోటీ పెడితే ఆశే గెలుస్తుంది. ఆ ఆశను కూటమి సృష్టించింది. ఆ ఆశతోనే ప్రజలు మోసపోయారు. చంద్రబాబును నమ్మి ప్రజలు మోసపోవడం ఇది మొదటిసారి కాదు. నాలుగోసారి. జగన్ చేస్తున్న సంక్షేమం అంతా అనవసరమైనదని ప్రచారం చేసి, ఎన్నికల సమయంలో జగన్ కంటే ఎక్కువ ఇస్తామని ఆశ’ పెట్టారన్నారు.
NDL: చాగలమర్రి మండలం కృష్ణంపల్లెలో వెలసిన ప్రసిద్ధ జమల్ వలి స్వామి ఉరుసు ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభించనున్నట్లు దర్గా నిర్వాహకులు వెన్నపూస పుల్లారెడ్డి తెలిపారు. బుధవారం ఉరుసు కార్యక్రమం వైభవంగా జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక ప్రార్థనలు పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
శ్రీకాకుళం పట్టణంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. డయేరియా నియంత్రణలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. పట్టణంలో 50 డివిజన్లు పరిధిలో పారిశుద్ధ్యం పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పనులను జాయింట్ కలెక్టర్, ఇంఛార్జ్ మున్సిపల్ కమిషనర్ పర్మాన్ అహ్మద్ ఖాన్ పర్యవేక్షిస్తున్నారు. ఇంటింటి చెత్త సేకరణ కొనసాగిస్తున్నారు.