నంద్యాల: పట్టణం, రూరల్ పరిధిలోని రేషన్ డీలర్లతో ఇన్ఛార్జ్ తహసీల్దార్ సత్య శ్రీనివాసులు సమావేశమయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేషన్ పంపిణీ విషయంలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం ఉగ్రాణంపల్లి ప్రాథమిక పాఠశాల HM శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ డీఈవో రాజేంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని, అప్పుడప్పుడు మద్యం తాగి పాఠశాలకు వస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. డిప్యూటీ డీఈవో ఇందిర విచారణ చేపట్టారు. ఆరోపణలు వాస్తవమే అని రిపోర్ట్ ఇవ్వడంతో సస్పెండ్ చేశారు.
కాకినాడ జిల్లాలో త్వరలో చేపట్టనున్న జనగణనపై ఈనెల 6 నుంచి 8 వరకు జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ షాన్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధిత అధికారులు ల్యాప్ ట్యాప్లతో హాజరుకావాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జనగణనపై పలు అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.
ATP: రాయదుర్గం నియోజకవర్గ YCP పరిశీలకులుగా డాక్టర్ బత్తల హరిప్రసాద్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడిగా ఉన్న ఆయనకు ఈ అదనపు బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
సత్యసాయి: జిల్లాలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పబ్లిక్ పరీక్షల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపిస్తే చాలు.. ఎటువంటి ఛార్జీ లేకుండా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ప్రయాణించవచ్చు.
E.G: గృహ నిర్మాణ పనుల్లో క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, పనులు మరింత వేగవంతం చేయాలని రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. గురువారం కార్యాలయంలో వెలుగుబంద, కానవరం, నిడిగట్ల లేఅవుట్లలో నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా అధికారులు, గుత్తేదార్లు గృహాలను త్వరగా పూర్తి చేయాలన్నారు.
WG: ఇరగవరం మండలం తూర్పువిప్పర్రులో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచాను ఎస్సై జానా సతీష్ గురువారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామ శివారు నారాయణపురం గ్రామానికి చెందిన మామిడిశెట్టి శ్రీను తూర్పువిప్పర్రులో గోనెసంచుల ఫ్యాక్టరీలో బాణసంచా అక్రమంగా నిల్వ ఉంచినట్లు వచ్చిన సమాచారంతో ఈ దాడి చేశారు. ఈ మేరకు సుమారు రూ.30 వేలు విలువ చేసే బాణాసంచాను స్వాధీనం చేసుకున్నారు.
శ్రీకాకుళం ప్రభుత్వ ఐటీఐలో ఇవాళ ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అరవిందు ఫార్మా, అన్నపూర్ణ ఫైనాన్స్, డెక్కన్ ఫైన్ కెమికల్స్ వంటి పలు సంస్థలు పాల్గొని, 230 ఖాళీలను భర్తీ చేయనున్నాయి.18–35 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అవసరమైన పత్రాలతో హాజరుకావాలని కోరారు.
కడప: నగరంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించి నిధులు విడుదల చేయాలని CM చంద్రబాబును MLA మాధవి రెడ్డి కోరారు. అమరావతిలో TDP పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డితో కలిసి MLA మాధవరెడ్డి సీఎంను కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులపై వినతిపత్రం అందజేశారు. కడప అభివృద్ధికి సహకరించాలని సీఎం దృష్టికి తీసుకొని వెళ్లారు.
కర్నూలు: జిల్లాలో మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మహిళా దినోత్సవ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. మహిళా పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాల్లో విజయాలు సాధించిన మహిళలకు ప్రశంసా పత్రాలు అందచేసి సన్మానించాలని సూచించారు.
VZM: నియోజకవర్గాల్లో MLAలు గుర్తించిన పనులు, ప్రాజెక్టులపై శాఖల వారీగా నివేదికలు సమర్పించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఆయా పనులకయ్యే ఖర్చు, లబ్ధి పొందే ప్రజల వివరాలతో పాటు ఇప్పటికే మంజూరై నిధులు రాని పనుల వివరాలను కూడా సమర్పించాలని సూచించారు.
TPT: తడ మండలం చేనుగుంట కాలనీలో షార్ట్ సర్క్యూట్తో గిరిజనుడి ఈటిపాకుల నాగార్జున ఇల్లు పూర్తిగా కాలిపోయింది. కుటుంబ సభ్యులు కూలి పనికి వెళ్లి వచ్చేసరికి టీవీ, ఫ్రిజ్, బియ్యం సహా సామాన్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డ తమను ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.
ప్రకాశం: భారత కమ్యూనిస్టు పార్టీ ప్రకాశం కార్యదర్శిగా కొత్తపట్నంకు చెందిన ఆర్. వెంకట రావు ఎంపిక అయ్యారు. ప్రస్తుత కార్యదర్శి ఎం.ఎల్. నారాయణను మార్కాపురం జిల్లా కార్యదర్శిగా నియమించారు. నూతనంగా కార్యదర్శులుగా ఎంపికైన వీరికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. వెంకటరావు దాదాపు 35 సంవత్సరాలుగా సీపీఐలో వివిధ హోదాలలో పని చేస్తున్నారు.
NTR: వత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలోని సాయి శ్రీనివాస్ గోసాలను కలెక్టర్ లక్ష్మీశ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గోసాలను నిర్వహిస్తున్న కార్యకలాపాలను పరిశీలించారు. స్వదేశీ ఆవు జాతుల నుంచి ఉత్పత్తి అయ్యే A2 పాలు, నెయ్యి ద్వారా పాల రైతులు స్థిరమైన ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశుపోషకులు, అధికారులు పాల్గొన్నారు.
CTR: పేకాడుతున్న పదిమందిని అరెస్ట్ చేసినట్లు పలమనేరు సీఐ మోహన్ రెడ్డి తెలిపారు. పలమనేరు మున్సిపాలిటీ గొబ్బిళ్ల కోటూరు సమీపంలోని కొత్తచెరువు వద్ద ఓ చింత చెట్టు కింద పేకాడుతున్నారన్న సమాచారంతో దాడులు చేయగా పదిమంది పట్టుబడ్డారన్నారు. వీరి నుంచి రూ. 13200 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశామన్నారు.