CTR: విజయపురం మండలంలో గత కొన్నేళ్లుగా గుంతలమయంగా ఉన్న ఈ రోడ్డుకు ఎమ్మెల్యే భానుప్రకాష్ చొరవతో మహర్దశ కలిగింది. విజయపురం మండలంలో ముత్యాలరెడ్డి కండ్రిగ, మంగళం మీదుగా విజయపురం వరకు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ. 1.5 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీని పట్ల మండల కూటమి నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
AKP: నర్సీపట్నంలో అంబేద్కర్ భవనానికి స్థలం కేటాయించాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నేతల నాగేశ్వరరావు కోరారు. దళితులకు శుభకార్యాలు, సమావేశాల కోసం ప్రత్యేక స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పందించి భూమి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
SS: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను పలువురు సందర్శకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు తమ ప్రాంతీయ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. మంత్రి వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ATP: గుంతకల్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మాఘమాసం మూడవ శుక్రవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారి మూలమూర్తికి పవిత్ర గంగాజలాలతో అభిషేకాలు నిర్వహించారు. మాఘమాస శుక్రవారాల్లో అమ్మవారిని ఆరాధించడం వల్ల కుటుంబంలో సుఖసంతోషాలు, ఆర్థికాభివృద్ధి కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని దర్శించుకున్నారు.
NLR: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ సమగ్ర మహోత్సవంలో భాగంగా సైన్స్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని 23వ తేదీ నుంచి నిర్వహించనున్నామని డీఈవో బాలాజీరావు తెలిపారు. ఇండియా, ఆసియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు సాధించే దిశగా కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రతి పాఠశాల నుంచి గరిష్టంగా పది టీంలు పాల్గొనవచ్చని చెప్పారు.
కృష్ణా: అవనిగడ్డలో నూతన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రతిష్ట ఈనెల 22వ తేదీ నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం అవనిగడ్డలోని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్వగృహంలో ఆయనను కమిటీ పెద్దలు ఘంటసాల రాజమోహనరావు (కన్నయ్య) కలిసి ఆహ్వాన పత్రిక అందచేశారు. ఆలయ ప్రతిష్టా మహోత్సవానికి కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానం పలికారు.
VZM: బొబ్బిలి మండలం చిత్రకోట బొడ్డవలస వద్ద ఉన్న బౌద్ధమత ఆనవాళ్లను వెలికి తీయాలని ఎమ్మెల్యే బేబినాయన ప్రభుత్వాన్ని కోరారు. చిత్రకోటబొడ్డవలస పేరు చిత్రకోటబౌద్ధవలస అని, ఆ ప్రాంతంలో పూర్వం బౌద్ధులు నివాసం ఉండేవారన్నారు. బౌద్ధులు ఆనవాళ్లను వెలికి తీసి భద్ర పరచాలని కోరగా మంత్రి దుర్గేశ్ సానుకూలంగా స్పందించారు.
E.G: ఈ నెల 22వ తేదీన రాజమండ్రి హ్యాపీ స్ట్రీట్ వద్ద 5కే రన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ ప్రముఖ టాలీవుడ్ నటులు భద్రం స్థానిక వెంకటేశ్వరనగర్ పార్క్, హ్యాపీ స్ట్రీట్, ఆర్ట్స్ కళాశాల మైదానంలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఫిట్నెస్ పెంచుకోవడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి 5కే రన్ ఉత్తమ మార్గం అన్నారు.
KDP: మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై కులవర్ధన్ హత్యాచారం చేయడం తెలిసిందే. ఆ కేసులో నిందితుడి తల్లి అంజలి A2గా మారింది. కాగా ఆమె వెంకటేశ్వరపురం స్కూల్లో ఆయాగా పనిచేసేది. నిందితురాలిగా ఉన్న ఆమెను ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో స్కూల్ హెచ్ఎం రమణమ్మ అంజలిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిపారు.
ELR: జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స గురువారం జరిగింది. బుట్టాయిగూడెం మండలానికి చెందిన ఓ మహిళ కడుపులో 8 కిలోల కణితి ఉన్నట్లు వైద్యుడు సంకు మురళి గుర్తించారు. ల్యాపరో స్కోప్ ద్వారా ఆపరేషన్ నిర్వహించి కణితి తొలగించామన్నారు. కడుపు నొప్పితో సదరు మహిళా ఆసుపత్రికి వచ్చిందని, ఆపరేషన్ అనంతరం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
GNTR: వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రి అంబటి రాంబాబు తాడేపల్లి లోని ఆయన నివాసంలో కలిశారు. తనపై ప్రభుత్వం నమోదు చేసిన కేసులు, ఇంటిపై జరిగిన దాడి, పోలీసుల నిర్లిప్త వైఖరి వంటి అంశాలను అంబటి రాంబాబు జగన్కు వివరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగన్ భరోసా ఇచ్చినట్లు సమాచారం.
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ B.Ed మొదటి సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారి డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. కాగా ఈ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా వేశారు. దీనితో కొత్త తేదీలను ప్రకటించారు. ఈనెల 24 నుంచి మార్చి 2వ తేదీ వరకు జరుగుతాయి.
ASR: పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిణి, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ వారం రోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు. ఇటీవల ఐఏఎస్ అధికారి ఆదిత్య వర్మను, పీవో శ్రీపూజ విశాఖ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 24న వివాహ వేడుక జరుపుకోనున్నారు. ఈ మేరకు ఈ నెల 21 నుంచి 28 వరకు పీవో సెలవుపై వెళ్లనున్నారు.
సత్యసాయి: సోమందేపల్లి మండలంలో పవిత్ర రంజాన్ మాసంలో రెండవ రోజు ఉపవాస దీక్షను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఆచరించారు. సోమందేపల్లిలోని జామియా మజీద్లో శుక్రవారం సహెరీ కార్యక్రమం నిర్వహించి అనంతరం ఉపవాస దీక్షను ప్రారంభించారు. రంజాన్ మాసంలో ఉపవాసం ద్వారా ఆత్మశుద్ధి, నియమ నిష్ఠలు పెంపొందించుకోవాలని మత పెద్దలు సూచించారు.
విశాఖపట్నం కాన్వెంట్ జంక్షన్ సమీప రైల్వే బ్రిడ్జ్ వద్ద భారీ లారీ బ్రిడ్జ్ను ఢీకొని ఇరుక్కుపోయింది. అధిక ఎత్తుతో లోడ్ తీసుకెళ్తూ డ్రైవర్ ఎత్తు పరిమితి గమనించకపోవడంతో లారీ పైభాగం గర్డర్ను తాకింది. దీంతో రెండు వైపులా ట్రాఫిక్ నిలిచిపోయి వాహనాలు కిలోమీటర్ల మేర క్యూలు కట్టాయి. పోలీసులు చొరవ తీసుకుని ట్రాఫిక్ను మళ్లించారు.