వసంత పంచమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం 108 ప్రత్యేక బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పాటు చేసింది. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరకు 88 బస్సులు, సిద్దిపేట జిల్లాలోని వర్గల్కు 20 ప్రత్యేక బస్సులను నడపనుంది. బుధ,గురువారాల్లో ఈ బస్సులు తిరుగనున్నాయి. బాసరకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి 21, జేబీఎస్ నుంచి 12, నిజామాబాద్ నుంచి 45, హన్మకొండ నుంచి 5, కరీంనగర్ నుంచి 4, జగిత్యాల నుంచి ఒక బస్సును ఏర్పాటు చేసింది. వర్గల్కు సికింద్రాబాద్ గురుద్వారా నుంచి ప్రతి అరగంటకో బస్సు నడిచే విధంగా టీఎస్ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ గురుద్వారా నుంచి 10, జేబీఎస్ నుంచి 6, గజ్వేల్ నుంచి 2, సిద్దిపేట నుంచి 2 బస్సులను నడుపనుంది.ఈ నెల 26న వసంత పంచమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బాసర, వర్గల్కు 108 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.