NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలు గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న వార్డు సభ్యుల శిక్షణ తరగతులు శనివారంతో ముగిసాయి. ఈ సందర్భంగా ఎంపీవో గోవర్ధన్ మాట్లాడుతూ.. గత ఐదు రోజుల నుంచి నేర్చుకున్న అంశాలను వార్డు సభ్యులు ఆయా వార్డులలో ఆచరణలో పెట్టి గ్రామాభివృద్ధికి సహకరించాలని అన్నారు. అనంతరం శిక్షణ సర్టిఫికెట్లను వార్డు సభ్యులకు అందజేశారు.
MNCL: మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని ఊరు రామకృష్ణాపూర్, RK-1, సుభాష్ నగర్ ఏరియాల్లో గత 15 రోజులుగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన పైపులైన్లు పగిలిపోవడంతో మరమ్మతు పనుల్లో జాప్యం జరుగుతోందని మున్సిపల్ కమిషనర్ రాయలింగు శనివారం ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని, మరో వారం రోజుల పాటు నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
NZB: అక్రమంగా ఇసుకను తరలిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని బోధన్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ బాబు స్పష్టం చేశారు. శనివారం సాలూర పరివాహక ప్రాంతంలో అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ఒక టారస్ లారీని పోలీసులు పట్టుకున్నారు. ఆ వాహనాన్ని బోధన్ రూరల్ సర్కిల్ కార్యాలయానికి తరలించినట్లు సీఐ వెల్లడించారు.
KMM: విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల నుంచి కాపర్ వైర్లను దొంగిలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను కారేపల్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న శ్రీకాంత్, సురేష్, యాదగిరిలపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు CI సాగర్ తెలిపారు. నిందితుల నుంచి సుమారు 100 కేజీల కాపర్ వైరు స్వాధీనం చేసుకున్నారు.
WGL: నల్లబెల్లి మండలం మేడపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. వైద్యాధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్, సేవల్లో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. రోగులకు సమయానికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
ASF: జిల్లా రైతులకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రేపు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోతకు సిద్ధంగా ఉన్న పత్తిని రైతులు రాబోయే రెండు రోజుల్లోనే సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని అధికారులు సూచించారు. పంట నష్టం కలగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
KNR: బొమ్మకల్ సమీపంలోని రాజీవ్ రహదారిపై అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడుగురిని విజిలెన్స్ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో అధికారులపై దురుసుగా ప్రవర్తించిన నిందితులపై ఇన్స్పెక్టర్ వరుణ్ ప్రసాద్ ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి కేసు నమోదు చేశారు. 7 ట్రాక్టర్లను సీజ్ చేసి, నిందితులను కోర్టులో హాజరుపరిచారు.
VKB: దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని హరిత రిసార్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 140 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని స్ఫూర్తిగా తీసుకొని పార్టీ పటిష్ఠతకు పని చేయాలని సూచించారు.
HYD: సైబర్ నేరాలపై పోరాటంలో HYD సిటీ పోలీసులు సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చారు. ‘జాగృత్ హైదరాబాద్ – సురక్షిత్ హైదరాబాద్’ కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లతో కలిసి షార్ట్ వీడియోల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. లాటరీ, డిజిటల్ అరెస్ట్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ 1930 హెల్ప్ లైన్ను ఫిర్యాదు చేయాలని సిటీ పోలీసులు సూచిస్తున్నారు.
NRPT: మక్తల్ టౌన్ నుంచి అనుగొండ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతలతో నిండిన రోడ్డుపై ప్రయాణం కష్టంగా మారిందని అంటున్నారు. పలుమార్లు అధికారులకు చెప్పినా స్పందన లేదని మండిపడుతున్నారు. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రోడ్డును బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
వనపర్తి: సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అన్ని కుల సంఘాలు ఆర్థికంగా ఎదగాలని ప్రతి సంఘం సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్ద ముందడుగు మండలంలోని చిన్న మందడి గ్రామంలో నూతనంగా నిర్మించిన రెడ్డి సంఘం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి సంఘం ఆర్థిక అభివృద్ధి చెందేందుకు కృషి చేయాలన్నారు.
KMR: డోంగ్లీలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయం ఎంతో అండగా నిలుస్తుందన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
MHBD: తొర్రూరు డివిజన్ కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో శనివారం ఫ్రూట్స్ డే నిర్వహించారు. విద్యార్థులు 102 రకాల పండ్లను ప్రదర్శించారు. మున్సిపల్ ఛైర్మన్ తూనం శ్రావణ్, వైస్ ఛైర్మన్ సోమ రజిని రాజశేఖర్ మాట్లాడారు. పకృతి మనకు ప్రసాదించిన అపురూప వరం పండ్లు అని, నిత్యం పండ్లు తీసుకోవడం వలన జబ్బులు దారి చేరవని అన్నారు.
NZB: రాష్ట్రంలోని అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. పెండింగ్లో ఉన్న రైతు భరోసా నిధులను ఎకరానికి రూ.15 వేల చొప్పున వెంటనే జమ చేయాలని కోరారు.
నల్గొండ: సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి కానున్న నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో పిస్తా హౌస్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని హైదరాబాదు రోడ్డులో పిస్తా హౌస్ను మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి వెంకట్ రెడ్డి ప్రారంభించారు.