SRPT: హుజూర్నగర్ పట్టణ యాదవ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా గెలుపొందిన జక్కుల మల్లయ్య, మోదాల కామేశ్వరి, కోడి జ్యోతి, కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన సుంకరి శివరామ్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి, యాదవ సంఘ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేయాలని తెలిపారు.
MDK: మనోహరాబాద్ మండలం రామాయపల్లి ఇండస్ మెడికేర్ కంపెనీలో ‘Arrive అండ్ Alive’ 2వ దశ కార్యక్రమం నిర్వహించారు. తూప్రాన్ సీఐ రంగాకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటించడం, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై అవగాహన కల్పించారు.
PDPL: సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాలు చేయాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. GDK తిలక్ నగర్ ఆఫీస్లో గురువారం సింగరేణి పరిరక్షణ- కార్మిక హక్కులపై సమావేశం నిర్వహించారు. రియాజ్ అహ్మద్, రాజన్న, విశ్వనాథ్ మాట్లాడుతూ.. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలన్నారు.
MHBD: తొర్రూర్(M) ఆర్యభట్ట ప్రైవేట్ స్కూల్లో దారుణం చోటుచేసుకుంది. పెద్దవంగర తండాకు చెందిన ఓ విద్యార్థిని పాఠశాల యాజమాన్యం నోట్లో తువాల కుక్కి, స్లాబ్కు వేలాడదీసి చంపే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది చూసిన మరో విద్యార్థి ఆ విద్యార్థి ప్రాణాలను కాపాడినట్లు తెలుస్తోంది. కొత్తగా కట్టే స్కూలుకు పిల్లలను బలి ఇవ్వాలని యాజమాన్యం ఆలోచన చేసినట్లు సమాచారం.
BHNG: భువనగిరి పట్టణాన్ని సుందరీకరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతామని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ ఛైర్పర్సన్గా ఎన్నికైన తంగెళ్ళపల్లి శ్రీవాణి, వైస్ ఛైర్పర్సన్గా పోతంశెట్టి మంజుల పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. పట్టణంలోని అన్ని రోడ్లను పూర్తిగా అభివృద్ధి చేస్తామన్నారు.
JGL: రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామ ప్రజల నిరీక్షణకు తెరపడింది. గత ఏడాది కాలంగా గ్రామానికి కోరుట్ల డిపోకు చెందిన బస్సు సర్వీస్ నిలిపివేయబడగా, గురువారం సర్వీస్ను మళ్లీ పునరుద్ధరించారు. డిపో మేనేజర్ తీసుకున్న నిర్ణయంతో బస్సు రాకపోకలు తిరిగి ప్రారంభం కావడం వల్ల గ్రామస్తులు, విద్యార్థులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
MNCL: చెన్నూర్ మండల కేంద్రంలో కొనసాగుతున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ADB: నేరడిగొండ మండల కేంద్రంలోని రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన కల్వర్టు నిర్మాణానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గురువారం స్థానికులతో కలిసి పూజ చేశారు. కల్వర్టు నిర్మాణంతో వ్యవసాయ పొలాలకు వెళ్ళటానికి రైతులకు ఇబ్బందులు దూరం అవుతాయని అన్నారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు.
NLG: శ్రీ మార్కండేశ్వర స్వామి జాతర వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. ‘ఓం నమశ్శివాయ’ నామస్మరణతో గ్రామం ఆధ్యాత్మికతతో నిండిపోయింది. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అగ్నిగుండాలలో నడిచి మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
HYD: మూసీ పునరుజ్జీవనంపై సర్కారు పట్టుదలతో ఉన్నా, నిధుల వేట సవాలుగా మారింది. రూ.17 వేల కోట్ల మాస్టర్ ప్లాన్కు కేంద్ర బడ్జెట్లో ఆశించిన మద్దతు లభించలేదు. దీంతో ప్రాజెక్టు అమలులో జాప్యం జరిగేలా కనిపిస్తోంది. సర్వేలు పూర్తయినా, భూసేకరణ, పునరావాసంపై స్పష్టత రావాల్సి ఉంది.
KNR: మొక్కజొన్న చేనును పాడు చేస్తున్న కోతులను తరమడానికి చింపాంజీ మాస్క్ ఉపయోగించి ఊరట పొందాడు ఓ రైతు. శంకరపట్నం మండలం కరీంపేటకి చెందిన చింతిరెడ్డి మల్లారెడ్డి అనే రైతు రెండు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. కోతుల నుంచి పంటను రక్షించుకోవడానికి ఆన్లైన్లో చింపాంజీ మాస్క్ కొనుగోలు చేసి, దానిని ఓ వ్యక్తికి ధరింపజేసి కోతులను తరుముతున్నట్లు తెలిపాడు.
SRD: కార్మికులు కర్షకుల సమస్యలపై పోరాటాలు చేద్దామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు అన్నారు. సంగారెడ్డిలోని కేకే భవన్లో గురువారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజెపీ ప్రభుత్వం రేతాంగ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెట్టిందని విమర్శించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి జయరాజ్ పాల్గొన్నారు.
WNP: కొత్తకోట మండలం చర్లపల్లి గ్రామంలో లబ్ధిదారులు రాధ, మణెమ్మల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని భరోసా ఇచ్చారు.
HYD: గంజాయి విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్, లాలగూడ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్లో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.2 లక్షల విలువైన 4 కేజీల ఎండు గంజాయితో పాటు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
BDK: బూర్గంపాడు మోరంపల్లిబంజర్ గ్రామంలో అక్రమ ఇసుక రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. నిబంధనలను తుంగలో తొక్కి కొందరు వ్యక్తులు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. తాజాగా గురువారం సాయంత్రం గ్రామంలో పట్టపగలే బహిరంగంగా జరుగుతున్న ఇసుక లోడింగ్ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని స్థానికులు కోరారు.