GDL: రాజోలి మండలం పెద్ద ధన్వాడ సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని సోమవారం జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్కు రైతులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎల్లప్ప మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ ఏర్పడితే పంట పొలాలలో సారవంతం తగ్గిపోయి పంటలు చేతికందవని అన్నారు. అదే విధంగా కలుషితమైన రసాయనాల ద్వారా చర్మ సంబంధ వ్యాధులు వస్తాయన్నారు.
SRCL: జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించాలన్నారు.
MBNR: బాలానగర్ మండలంలోని వివిధ గ్రామాలలో 2023 సంవత్సర నుండి 2025 సంవత్సరం వరకు దాదాపు 220 ఫోన్లు మిస్ అయ్యాయి. దాంట్లో 126 ఫోన్లు రికవరీ అయ్యాయి. సోమవారం ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు తిరిగి తమ ఫోనులను సీఐ నాగార్జున గౌడ్, ఎస్సై తిరుపాజీ అందజేశారు.
NGKL: తలకొండపల్లి మండలంలోని వెల్జాల గ్రామంలో ఉన్న శ్రీ వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలకు హాజరుకావాలని ఉత్సవ కమిటీ సభ్యులు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి సోమవారం ఆహ్వాన పత్రిక అందించారు. ఈనెల 7 నుంచి 9 వరకు జరిగే ఉత్సవాలకు సతి సమేతంగా హాజరుకావాలని ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీనివాసమూర్తి, తదితరులు ఎమ్మెల్యేను ఆహ్వానించారు.
NRPT: ధన్వాడ మండల కేంద్రంలో సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల తాత్కాలిక భవనాన్ని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్నిక రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రైవేట్ భవనాన్ని డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రారంభించారు. త్వరలోనే సొంత భవన నిర్మాణం సీఎం రేవంత్ రెడ్డి సాకారంతో చేపట్టడం జరుగుతుందని అన్నారు.
NGKL: నాగర్ కర్నూల్ మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మంద జగన్నాథ్ దశదిన కర్మ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రావుల మాట్లాడుతూ.. రాజకీయాల్లో అజాతశత్రువుగా, సౌమ్యుడిగా గుర్తింపు పొందిన ఆయన అందరికీ ఆప్తుడు అని అన్నారు.
GDL: ధరూర్ మండలం పెద్ద చింతరేవుల గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వామి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సోమవారం పేర్కొన్నారు. క్యాంప్ కార్యాలయంలో ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను నిర్వాహకులతో కలిసి విడుదల చేశారు. ఫిబ్రవరి 1న ఉత్సవాలు ప్రారంభమవుతాయని, 3న రథోత్సవం ఉంటుందని తెలిపారు.
GDL: మానవపాడు మండలంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. అప్పులు తీర్చే మార్గం కనిపించక రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం ప్రకారం.. మండల పరిధిలోని బొంకురు గ్రామానికి చెందిన రైతు శేఖర్ రెడ్డి మిర్చి సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో పంట సాగు చేయడానికి అప్పు చేశారు. చేసిన అప్పు తీర్చే మార్గం కనిపించక పొలంలో పురుగు మందు తాగి మృతి చెందాడు.
ADB: బాసర గోదావరి నదిలో సోమవారం ఓ వృద్ధుడు గల్లంతయ్యాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. అతడి వయస్సు సుమారు 65 సంవత్సరాల ఉంటుందని, మృతుడు నిజామాబాద్ జిల్లా జాన్కంపేట్ వాసిగా గుర్తించారు.
NGKL: టీబీ వ్యాధి నిర్మూలనపై అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ గ్రామంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముక్తభారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య సిబ్బంది టీబీ వ్యాధి వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పలువురిని పరీక్షించారు. 100% టీబీ వ్యాధి నిర్మూలించేందుకు ప్రజలు సహకరించాలన్నారు.
ASF: నార్నూర్ మండలం భీంపూర్ గ్రామానికి చెందిన గిరిజన యువకుడు అరవింద్ జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. కాగా ఇటీవల రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన బాక్సింగ్ క్రీడా పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. దీంతో గ్రామస్థులు, బంధువులు అరవింద్ను అభినందించారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు.
GDL: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్లాపురం గ్రామానికి చెందిన ఈరమ్మ, నర్సమ్మలకు చికిత్స నిమిత్తం రూ.28,000 సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను సోమవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు పాల్గొన్నారు.
ASF: గొల్లగూడలో నాబార్డు, ప్రతిమ ఫౌండేషన్ కరీంనగర్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన వైద్య శిబిరానికి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా శిబిరంలో కలెక్టర్ వైద్య పరీక్షలు చేసుకున్నారు. ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి సిబ్బంది మందులు అందజేశారు. ప్రజలు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ASF: బూరుగూడ గ్రామంలోని పల్లె దవాఖానను కలెక్టర్ వెంకటేష్ దోత్రే సోమవారం సందర్శించారు. హెల్త్ వెల్నెస్ సెంటర్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను తనిఖీ చేశారు. ఆసుపత్రి రికార్డులను, మెడికల్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న సేవల గురించి అరా తీశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.
KMM: ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని మండల ఎస్సై రవి అన్నారు. సోమవారం జూలూరుపాడులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వాహనాలను నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు. అనంతరం విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.