NLG: కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోగికర్ రవీందర్ గుండెపోటుతో మరణించగా.. వారి మృతదేహానికి ఇవాళ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రవీందర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. ఆయనతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గార్లపాటి రవీందర్ ఉన్నారు.
BHNG: ఆలేరు పట్టణంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వం బీసీలను మొదటి నుంచే మోసం చేస్తోందని ఆరోపించారు. బీసీల అభివృద్ధి కోసం లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోలేదన్నారు. బీసీలకు 40 శాతం రిజర్వేషన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
SRD: పటాన్చెరు బీహెచ్ఈఎల్ టౌన్షిప్లో శ్రీ వెంకటేశ్వర ఆలయం(SVTC), ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో 1,000 సంవత్సరాల సోమనాథ జ్యోతిర్లింగ దర్శనం, రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో BRS పార్టీ ఇంఛార్జ్ ఆదర్శ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుక భక్తిశ్రద్ధల మధ్య శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించిందని ఆయన తెలిపారు.
HNK: చేనేత కార్మికుల హక్కుల సాధన కోసం ఐకమత్యంతో పోరాడాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం మీడియా కార్యదర్శి చింతకింది కృష్ణమూర్తి అన్నారు. ఈ నెల 25న హైదరాబాద్లో నిర్వహించనున్న మహా ధర్నాకు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. చేనేత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని తమ హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
JN: జీడికల్ గ్రామంలోని శ్రీ వీరాచల జీడికంటి రామచంద్ర స్వామి వారి ఆలయాన్ని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సందర్శించారు. ఈ మేరకు ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, ఆలయానికి విచ్చేసే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అర్చకులు, అధికారులకు ఎమ్మెల్యే సుచనలు చేశారు.
WGL: తెలంగాణ గ్రామీణ అభివృద్ధి శిక్షణ కేంద్రానికి కూసం రాజమౌళి పేరును కేటాయిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. జాతీయ ఆదర్శ గ్రామమైన గంగాదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి ఇటీవల మృతి చెందగా ఆయన సంస్మరణ సభలో మంత్రి పాల్గొన్నారు. గుర్తింపు కోసం కాకుండా సమాజం కోసం పని చేసిన నాయకుడిగా రాజమౌళి నిలిచారని పేర్కొన్నారు.
MHBD: తొర్రూరు మండలం దుబ్బ తండా గ్రామపంచాయతీ పరిధిలోని భీముడు తండాలో సీసీ రోడ్డు పనులకు ఆదివారం స్థానికులతో కలిసి సర్పంచ్ బాదావత్ విజయ లింబా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
GDWL: పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. గద్వాల మండలం పరమల శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవాళ ప్రారంభించారు. లబ్దిదారు గౌసియా బి ఇంటి వద్ద గృహప్రవేశం చేయించి, ఇళ్ల నిర్మాణ నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.
WNP: ప్రభుత్వ ఆదేశాల మేరకు వనపర్తి పురపాలికల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఈ రెవెన్యూ మేళ మార్చి 20 నుంచి మార్చి 31 వరకు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అధికారులు అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్కరు అవకాశాన్ని వినియోగించుకుని పురపాలిక అభివృద్ధికి సహకరించాలని కోరారు.
SRPT: విదేశీ విశ్వవిద్యాలయాలను ఆహ్వానించడంపై చూపుతున్న శ్రద్ధ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో చూపాలని TSUTF రాష్ట్ర పూర్వ కార్యదర్శి రాములు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. ఈ సందర్భంగా అప్పారి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
BDK: ఖమ్మం నగరంలో బంద్ నిర్వహించిన నాయకులను అరెస్టు చేయడం సరికాదని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేతలు విమర్శించారు. టేకులపల్లి కేంద్రంలో నాయకులు మాట్లాడుతూ.. పేదల ఇళ్ల కూల్చివేతపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందని ఆరోపించారు. కొంతమందికి మాత్రమే పట్టాలు ఇచ్చి సమస్యను పరిష్కరించలేదని పేర్కొన్నారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
NLG: మిర్యాలగూడ మండలం అవంతిపురంలో నూతన సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం పల్లెల ప్రగతికి కట్టుబడి ఉందని, గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పంచాయతీ భవనాల వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.
MBNR: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణ, దుందుభి నదులు వ్యవసాయానికి ఊపిరిపోస్తున్నాయి. జూరాల, కల్వకుర్తి ఎత్తిపోతలు, డిండి ప్రాజెక్టుల ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతోంది. నేడు ‘ప్రపంచ జల దినోత్సవం’ సందర్భంగా నీటి పొదుపుపై అవగాహన పెంచుకోవాలని, ఈ జీవ నదులను కాపాడుకోవాలని నిపుణులు కోరుతున్నారు.
KMM: తెలంగాణ విద్యా సమితి ఆధ్వర్యంలో ఖమ్మం స్వర్ణభారతి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ ఫెయిర్ను మేయర్ పునకొల్లు నీరజ ప్రారంభించారు. ప్రముఖ యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్న ఈ వేదిక విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగకరమని ఆమె తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కోర్సుల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.
MNCL: దేశంలో బీజేపీ పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు సికందర్ ఆరోపించారు. ఆదివారం జైపూర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈనెల 23 నుంచి 30 వరకు జరగనున్న భగత్ సింగ్, రాజ్ గురు, సుక్ దేవ్ 95వ వర్ధంతి సభల పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత డ్రగ్స్, గంజాయి, మాదక ద్రావ్యాల మత్తులో ఉన్నారని తెలిపారు.