HYD: అనుమానం పెనుభూతమై.. ఓ నిండు చూలాలు, ఆమె కడుపులోని బిడ్డ ప్రాణాలను అత్యంత కర్కశంగా తీసింది. కాచిగూడకు చెందిన సత్యనారాయణ, కాప్రాకు చెందిన స్నేహకు ఓ బాబు ఉన్నాడు. గొడవల నేపథ్యంలో కొద్ది నెలలు దూరంగా ఉన్నారు. ఆమె 7 నెలల గర్భవతి అని అతడికి తెలిసింది. అనుమానంతో భార్యకు మద్యం తాగించి.. ఆమె కడుపుపై కూర్చున్నాడు. దిండును ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు.
HYD: మల్కాజిగిరి పరిధి మధురానగర్, MIGH కాలనీ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా గార్బేజి వ్యర్థాలు తీసుకెళ్లడానికి స్వచ్ఛ ఆటో వారు రావడం లేదని స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కేవలం 3 గంటల్లోనే స్పందించిన అధికారులు, ప్రత్యేక సిబ్బంది పంపించి, గార్బేజీని వెంటనే తొలగించారు. ఫిర్యాదుపై వెంటనే స్పందించడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
మహబూబ్బాద్: ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వ్యక్తులపై కఠిన చర్యలతో పాటు తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ అంబేద్కర్ ఎదుట లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు నిరసన తెలిపారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు భీమా నాయక్ మాట్లాడుతూ.. జనవరి 30న మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడుతామని తెలిపారు.
జనగామ: ఆరేళ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఓ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో బాలిక స్కూలుకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఒంటరిగా ఉన్న బాలికపై అదే గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు.
HYD: నగరంలో రెండవ దశ మెట్రో విస్తరణకు సంబంధించి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(HMRL) రూట్ మ్యాప్ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మియాపూర్ నుంచి పటాన్చెరువు వరకు 13.4 కి.మీ దూరంలో 10 స్టేషన్లు ఉండనున్నాయని తెలిపింది. ఈ మెట్రో విస్తరణ ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, మెరుగైన కనెక్టివిటీని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
HYD: ఆన్లైన్లో బిల్స్ చెల్లించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని యాచారం సీఐ నరసింహారావు సూచించారు. వెబ్సైట్ను ఒకటికి 2సార్లు చెక్ చేసుకోవాలన్నారు. రిఛార్జ్లు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్ల కోసం థర్డ్ పార్టీ వెబ్సైట్లు, యాప్స్ వాడొద్దని సూచించారు. కేవలం అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలని కోరారు.
NZB: పసుపు బోర్డు విషయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోటోలను మార్ఫింగ్ చేసి X వేదికగా సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన వారిపై కేసు నమోదు చేయాలని తెలంగాణ జాగృతి మహిళా విభాగం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్ట్ చేసిన @AravindAnnaArmy అనే హ్యాండిల్తో పాటు దీని వెనక ఉన్నవాళ్లపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
NZB: తప్పిపోయిన బాలుడిని నిజామాబాద్ వన్ టౌన్ పోలీసులు సోమవారం రాత్రి బాలుడి తల్లికి అప్పగించారు. నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో మాటలు రాని సుమారు 11 సంవత్సరాల బాలుడు తప్పిపోయి కనిపించగా అతడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ బాలుడిని అహ్మద్ పురా కాలనీకి చెందిన సూఫీయాన్గా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు వన్ టౌన్ SHO రఘుపతి వివరించారు.
NZB: పకడ్బందీగా గ్రామ సభలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. సోమవారం ఆయన రుద్రూర్లో సందర్శించారు. రుద్రూర్ బస్టాండ్ వెనుక వైపు ఉన్న భూములకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
PDPL: జిల్లాలో రేపు మిషన్ భగీరథ వాటర్ సరఫరా బంద్ ఉంటుందని ఈఈ మిషన్ భగీరథ గ్రిడ్ కే.పూర్ణచందర్ సోమవారం తెలిపారు. పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాలు, పెద్దపల్లి, శ్రీరాంపూర్, జూలపల్లి, ఓదెల, ఎలిగేడు, సుల్తానాబాద్ మండలాలు, పాలకుర్తి మండలంలోని అంతర్గంలోని ముర్మూరు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద సంపు పైప్ లైన్ నిర్వహణ పనుల నిమిత్తం త్రాగునీరు సరఫరా నిలిపివేయబడుతుంది అన్నారు.
SRCL: ఇందిర మహిళ శక్తి పథకం కింద అర్హులైన క్రైస్తవ మహిళలకు కుట్టు మిషన్ల సరఫరా కోసం దరఖాస్తు తేదీని ఈనెల 25వ తేదీ వరకు పొడిగించినట్టు మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి రాధాబాయి తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. అర్హులైన క్రైస్తవ మహిళలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
KNR: రామడుగు మండలంలోని వెదిర, గోపాల్ రావుపేట గ్రామాల్లో అధికారులు నిర్వహిస్తున్న రైతు భరోసా సర్వేను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అధికారులు సర్వే పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని సూచించారు. సర్వే విషయంలో పొరపాట్లు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
NGKL: వెల్దండ మండలంలోని వివిధ గ్రామాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తామని తహశీల్దార్ కార్తీక్ కుమార్ సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామసభల ద్వారా కొత్త రేషన్ కార్డు జాబితా సిద్ధం చేస్తామని, జాబితాలో లబ్ధిదారుల పేరు ఉన్నది.. లేనిది చూసుకోవాలన్నారు. జాబితాలో పేరు లేకపోతే మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
PDPL: జిల్లాలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ డీ. వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు సమీకృత కలెక్టరేట్లో జరుగుతాయని, అధికారులు, సిబ్బంది వేడుకలకు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.
GDL: రాజోలి మండలం పెద్ద ధన్వాడ సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని సోమవారం జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్కు రైతులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎల్లప్ప మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ ఏర్పడితే పంట పొలాలలో సారవంతం తగ్గిపోయి పంటలు చేతికందవని అన్నారు. అదే విధంగా కలుషితమైన రసాయనాల ద్వారా చర్మ సంబంధ వ్యాధులు వస్తాయన్నారు.