SRCL: విద్యుత్ సిబ్బందికి రక్షణ కల్పించే విషయంలో ఎన్పీడీసీఎల్ ముందడుగు వేసింది. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని సిబ్బందికి రక్షణ కవచాలు అందించింది. లైన్లో విద్యుత్ సరఫరా ఉంటే తెలిసిపోయేలా ఎర్త్ రాడ్లతో పాటు హెల్మెట్లు, జాకెట్లు పంపిణీ చేశారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన ఫోటోగ్రాఫర్ ఇంగు శ్రీనివాస్ రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో తనప్రతిభను చాటి ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఆదివారం HYDలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫోటోగ్రాఫర్గా నిలిచిన శ్రీనివాస్ను జిల్లా ప్రజలు, ఫోటోగ్రాఫర్లు అభినందిస్తున్నారు.
JGL: కోరుట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తోట ఆంజనేయులు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు శనివారం ప్రకటించారు. అలాగే జాయింట్ సెక్రటరీగా కడకుంట్ల దినేష్, కోశాధికారిగా చింతకింది ప్రేమ కుమార్, స్పోర్ట్స్ సెక్రెటరీగా నవీన్ కుమార్, లైబ్రరీ సెక్రెటరీగా రాజశేఖర్, వైస్ ప్రెసిడెంట్గా అంబల్ల నాగ నిర్మల, జనరల్ సెక్రటరీగా సుతారి శ్రీనివాస్ నియామకమయ్యారు.
KMR: భిక్కనూరులోని కంచర్లలో ఆదివారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొల్ల నర్సయ్య అనే వ్యక్తి తన పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న భిక్కనూరు పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది
SRPT: నడిగూడెం మండలంలోని గ్రామపంచాయతీ వార్డు సభ్యులుగా ఎన్నికైన వారికి నేటి నుంచి 10వ తేదీ వరకు శిక్షణ కార్య క్రమం నిర్వహిస్తున్నట్లు, ఎంపీడీవో మల్సూర్ నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నడిగూడెంలోని రైతు వేదికలో శిక్షణ ఉంటుందని, వార్డు సభ్యులు శిక్షణకు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు, పాస్ ఫొటో తీసుకురావాలని కోరారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నేత టి.సాగర్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలన్నారు. ఆలస్యం చేస్తే రైతులు దళారులకు అమ్ముకొని నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భజరహత్నూర్ మండలంలోని పిప్పిరి గ్రామంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టింది.
ASF: కాగజ్ నగర్ పట్టణంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం ప్రతిపాదిత స్థలాన్ని కలెక్టర్ ఆదివారం పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు పెంచి నాణ్యమైన విద్య అందిస్తామని ఆమె చెప్పారు. అనంతరం పట్టణంలోని ఈఎస్సై ఆసుపత్రి స్థలాన్ని కూడా పరిశీలించి, సిబ్బంది గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
PDPL: గోదావరిఖని పట్టణం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతన కాలనీ రహదారిపై పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండాలని సీఐ ప్రసాద్ రావు అవగాహన కల్పించారు. అలాగే ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.
మెదక్ జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో వాహనాల రిజిస్ట్రేషన్లు సుమారు 2 శాతం తగ్గినట్లు జిల్లా రవాణా అధికారి వెంకటస్వామి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 12,058 రిజిస్ట్రేషన్లతో రూ.52.72 కోట్లు, 2024–25లో 12,210 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.53.88 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఈవీల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు.
RR: మాజీ మంత్రి హరీష్ రావు నేడు కొహెడలోని పండ్ల మార్కెట్ భూములను పరిశీలించనున్నట్లు జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి తెలిపారు. సర్వే నంబర్ 167/1లో భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడనున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారని పేర్కొన్నారు.
KMM: వైరా మున్సిపాలిటీలో ఆదివారం సాయంత్రం 13వ వార్డు కౌన్సిలర్ ముళ్లపాటి విజయపై దాడి ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. అమృత పైప్లైన్ పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో అదే వార్డుకు చెందిన అన్వర్ అనే వ్యక్తి దుర్భాషలాడుతూ దాడికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపారు. అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
VKB: వికారాబాద్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థ ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారింది. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న కెమెరాలు మెయింటినెన్స్ లేక, మరమ్మతులకు గురై నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. నేరాల నియంత్రణలో కీలకపాత్ర పోషించాల్సిన నిఘా నేత్రాలను అధికారులు గాలికి వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
KNR: బెజ్జంకి లక్ష్మి నర్సింహా స్వామిని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బండి సంజయ్ ప్రతి ఏటా స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
MBNR: విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులకే ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయుడు ఫరూక్ హుస్సేన్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తరగతి గదుల్లో సమాజాభివృద్ధికి తోడ్పడిన గురువులు, విశ్రాంతి కాలంలోనూ సామాజిక సేవలో పాలుపంచుకోవాలని కోరారు.