HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు జెట్ స్పీడ్లో జరుగుతున్నట్లు డివిజనల్ రైల్వే మేనేజర్ ఏ.కే.గోపాలకృష్ణన్ తెలిపారు. ఆధునిక టెర్మినల్, విస్తరించిన ప్లాట్ఫారమ్లు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, డిజిటల్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమని చెప్పారు.
KNR: ప్రయోగాల ద్వారానే విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, ప్రశ్నించే తత్వం పెరుగుతాయని ఏంఈవో కట్టా రవీంద్రచారి అన్నారు. వెన్కేపల్లి హైస్కూల్లో భౌతిక, జీవశాస్త్ర టీచర్స్ కి ‘బెలూన్ కార్ ఛాలెంజ్’పై అవగాహన కల్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. ప్రయోగాత్మక బోధనతో పిల్లలు సులభంగా నేర్చుకుంటారన్నారు.
NZB: భీమ్గల్ మండలం పల్లికొండకు చెందిన గంగం అజయ్ (25)కి చెవి సర్జరీ చేస్తుండగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వైద్యుల నిర్లక్ష్యం ఆరోపణల నేపథ్యంలో ఆస్పత్రి యాజమాన్యం బాధిత కుటుంబంతో రూ.23 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం. రూ.5 లక్షలు నగదు చెల్లించగా, మిగిలిన రూ.18 లక్షలకు చెక్ ఇచ్చినట్లు సమాచారం.
WGL: గీసుగొండ మండలం సూర్యతండా సర్పంచ్ బానోత్ రాఘవేంద్ర బుధవారం ఎస్సారెస్పీ కెనాలో జరిగిన అక్రమమట్టి తవ్వకంపై కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. అనుమానించబడిన 10కి పైగా ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలించబడినప్పటికీ, పోలీసులు కేవలం 3 ట్రాక్టర్లపై మాత్రమే కేసులు నమోదు చేసారని తెలిపారు. ప్రజాప్రతినిధిగా తన ప్రశ్నలపై సీఐ అవమానకరంగా ప్రవర్తించి, బెదిరించారని ఆరోపించారు.
MDK: హవేలిఘనపూర్ మండలం గంగాపూర్ అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని చాకలి గోపాల్(48) మృతి చెందాడు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. గతంలో అదే గ్రామానికి చెందిన తల్లి, కుమారుడి హత్య కేసులో గోపాల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భక్తుల జయజయధ్వానాల మధ్య కళ్యాణ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.
SRD: పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై దుర్గారెడ్డి హెచ్చరించారు. కంగ్టి మండలంలో ఎవరైనా పేకాట ఆడితే సమచారం ఇవ్వాలని సూచించారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. పేకాట స్థావరాలు ఏర్పాటు చేసినా, జూదరులకు సహకరించిన వారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. పేకాట వల్ల కుటుంబాలు రోడ్డున పడతాయని, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని వివరించారు.
MBNR: ఈ ఏడాది 10 వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం 5 నిమిషాల సడలింపును ఇచ్చిందని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. ఐదు నిమిషాల సడలింపు అనంతరం పరీక్షకు హాజరయ్యే వారిని ఎట్టి పరిస్థితులలో అనుమతించరని, పరీక్షలు జరిగే రోజున చుట్టుపక్కల ఉండే జిరాక్స్ కేంద్రాలు అన్ని మూసివేయాలని అధికారులకు ఆదేశించారు.
BDK: మణుగూరు సింగరేణి ఓ.సి.విస్తరణ నిమిత్తం తీర్లాపురం గ్రామంలో ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించారు. భూసేకరణ అధికారి ఆదేశాల మేరకు భూమికి సంబంధించిన పత్రాల పరిశీలన గత 15 రోజులుగా కొనసాగుతుంది. అయితే సర్వే చేయించుకున్న కొంతమంది వ్యక్తులు తమ భూమి ప్రాంతములో అందుబాటులో లేరని తేలింది. అందుబాటులో లేని వారు 3 రోజుల గడువులోగా రావాలని తాహాసిల్దార్ నరేష్ తెలిపారు.
MNCL: క్యాతనపల్లిలో ఈనెల 17న చోటు చేసుకున్న ఉద్రిక్త ఘటనలపై నమోదైన 2 కేసుల్లో ఒక కేసుకు సంబంధించి మాజీ MLA బాల్క సుమన్, మరికొందరు BRS నాయకులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంత్రి కాన్వాయ్ పై దాడి, రాళ్ల దాడిలో పలువురు గాయపడ్డారనే ఆరోపణలతో పోలీసులు 2 వేర్వేరు కేసులు నమోదు చేశారు. మరో కేసుకు సంబంధించి గురువారం మంచిర్యాల కోర్టులో విచారణ ఉంది.
NRPT: డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. కోస్గి, నారాయణపేట డిపోల పరిధిలోని ప్రయాణికులు 7382826293 నంబర్కు ఫోన్ చేసి ఆర్టీసీ సేవలు, సమస్యలు, సలహాలు, సూచనలు ఫోన్ ద్వారా తెలియజేయాలని చెప్పారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని చెప్పారు.
KMM: ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి నగరంలోని బైపాస్ రోడ్డు, కొత్త బస్టాండ్ వంటి ప్రాంతాలలో రోడ్డు భద్రతా పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో గుర్తించిన 30 బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాల నివారణకు జీబ్రా క్రాసింగ్లు, సోలార్ బ్లింకర్స్, సైన్ బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
HNK: కుమ్మెర GPలోని జరిగిన కుల వివక్షత దాడిపై రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని PDSU నాయకులు నిన్న సాయంత్రం కలెక్టర్ కార్యాలయం ముందు నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు. అనంతరం PDSU (C) మహేష్ మాట్లాడుతూ.. అభం శుభం తెలియని పశు గుడ్డును తొక్కి చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
VKB: జిల్లా కలెక్టరేట్లో జరిగిన బ్యాంకర్ల జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్ మాట్లాడుతూ.. బ్యాంకులు ప్రభుత్వ పథకాల అమలుకు ప్రాధాన్యతనిస్తూ నిర్దేశిత రుణ లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. అర్హులైన నిరుపేదలు, స్వయం సహాయక సంఘాలు, చిన్న వ్యాపారులకు సులభంగా రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
PDPL: రామగుండం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో శిక్షకులుగా పనిచేయడానికి అర్హత గలవారు మార్చి 3లోగా అప్లై చేసుకోవాలని ప్రిన్సిపల్ సురేందర్ తెలిపారు. సీఎస్సి ఆపరేటర్, ఎలక్ట్రికల్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్, త్రీడీ ప్రింటింగ్ ఆపరేటర్, జూనియర్ ప్లంబర్ కోర్సులలో 3 నెలలు నైపుణ్య శిక్షణ ఇచ్చుటకు అర్హులైన అభ్యర్థులు పూర్తి బయోడేటాతో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.