NRML: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఎఎస్పీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో గురువారం దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. సరైన పత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలను సీజ్ చేసి పత్రాలను పరిశీలించారు. రోడ్డు భద్రత నియమాలు, సైబర్ నేరాలు, గంజాయి నివారణ, సీసీ కెమెరాల ప్రాముఖ్యత పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
ఖమ్మం జిల్లాలోని గ్రానైట్ లోడింగ్, అన్లోడింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఖానాపురం హవేలీ పారిశ్రామిక ప్రాంతంలో కార్మిక సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. AITUC జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. క్వారీల్లో పనిచేసే కార్మికులు తక్కువ వేతనాలు, సామాజిక భద్రత లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
WGL: వరంగల్ నగరంలోని ఓల్డ్ బీట్ బజార్ వద్ద సూరజ్ ఓయోలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు బుధవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.12,650 నగదు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు నిమిత్తం మట్వాడ పోలీసులకు అప్పగించినట్లు ఏసీపీ మధుసూదన్ తెలిపారు.
NLG: ఈ ఖరీఫ్ సీజన్లో అత్యధికంగా 72 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండించి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రికార్డు సృష్టించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం, బోనస్ కలిపి రూ.19,800 కోట్లు చెల్లించినట్లు కోదాడలో వెల్లడించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
SDPT: జాతీయ చేనేత అవార్డ్స్-2026 కొరకు చేనేత కళాకారులు, డిజైనర్ వృత్తిలో నైపుణ్యం కలిగిన కళాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు ఎం.సాగర్ పేర్కొన్నారు. అర్హులైన చేనేత నిపుణులు ఈనెల 23 వరకు సిద్ధిపేట చేనేత జౌళి శాఖ కార్యాలయంలో దరఖాస్తుతో పాటు వారు తయారు చేసిన వస్త్రములు సమర్పించాలని కోరారు.
MHBD: తొర్రూరు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చర్లపాలెం గ్రామానికి చెందిన చిట్టిమల్ల లచ్చమ్మపై ఆమె కుమారుడు యాకయ్య మద్యం మత్తులో బుధవారం రాత్రిగొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన లచ్చమ్మను స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా ఎంజీఎం హాస్పిటల్ కుతరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన అనంతరం నిందితుడు పరారైనట్లు తెలిసింది.
KMM: రఘునాథపాలెం మండలంలోని పాపటపల్లిలో గ్రామంలో పేకాడుతున్నారన్న సమాచారంతో గురువారం తెల్లవారుజామున పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.3 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. మండలంలో పేకాట, గంజాయి, డ్రగ్స్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు.
JGL: జిల్లాలో మార్క్ ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని బుధవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు పలువురు రైతులు వినతిపత్రం సమర్పించారు. ఖరీఫ్లో మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మక్కలకి జగిత్యాలకి చెందిన 300పైగా రైతుల 6000క్వింటాల్ల మక్కల డబ్బులు బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. రబీకి చెందిన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తానన్నారు.
ADB: బోరజ్ మండలంలోని జాతీయ రహదారిపై ఆటో అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని పూసాయి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ప్యాసింజర్లతో పాటు ఇతర సామాగ్రితో అధిక లోడుతో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
BDK: జిల్లాలో మార్చి 6 నుంచి 16 వరకు ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. బుధవారం అధికారులతో సమీక్షలో మాట్లాడారు. గ్రామం, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులను విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలలు, అంగన్వాడీలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పిచ్చి మొక్కలను తొలగించి, తడి-పొడి చెత్తను వేరుగా సేకరించాలని అన్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో ఓ పాఠశాల ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనం (TS 32 0570) బుధవారం చోరీకి గురైంది. పెద్దమందడి మండలం మనిగిళ్లకు చెందిన అశోక్ పాఠశాల వేడుకల కోసం వచ్చి బైక్ నిలపగా, తిరిగి వచ్చేసరికి అది కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు వనపర్తి టౌన్ ఎస్సై హరిప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
HYD: షేక్పేట్ డివిజన్లోని బృందావన్ కాలనీలోని సాలార్-ఎ-మిల్లత్ గ్రౌండ్లో MIM ఆధ్వర్యంలో గ్రాండ్ దావత్-ఇ-ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MIM ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ వచ్చారు. ముందుగా ఆయన మత పెద్దలతో కలిసి ప్రతేక్య ప్రార్థనలు (దువా) నిర్వహించారు. అనంతరం ముస్లింలతో కలిసి విందు ఆరగించారు.
PDPL: కార్మిక కుటుంబాలకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని AITUC నాయకులు మడ్డి ఎల్లాగౌడ్ కోరారు. రామగుండం RG-2 GM లలిత్ కుమార్, అధికారులు, కార్మిక నేతలతో కలిసి బుధవారం GDK పట్టణ శివారు గోదావరి నది ఫిల్టర్ బెడ్ ప్రాంతాన్ని, నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. 24 గంటలు నీరు అందివ్వాలని సూచించారు.
NZB: శ్రీరామ నవమి పురస్కరించుకుని భద్రాద్రి రాములవారి కళ్యాణ తలంబ్రాలను టీఎస్ఆర్టీసీ కార్గో సేవల ద్వారా భక్తుల ఇంటికే చేరవేస్తున్నట్లు నిజామాబాద్-1 డిపో మేనేజర్ ఆనంద్ తెలిపారు. బుధవారం ఇందుకు సంబంధించిన గోడప్రతులను ఆయన ఆవిష్కరించారు. భక్తులు రూ.151 చెల్లించి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే నేరుగా ఇంటి వద్దకే తలంబ్రాలు అందజేస్తామన్నారు.
GDWL: అయిజ మండలం చిన్న తాండ్రపాడులో ఉపాధి హామీ కూలీలకు ఫేషియల్ అథెంటికేషన్పై అవగాహన కల్పించారు. మార్చి 2 నుంచి తెలంగాణలో ముఖ హాజరు విధానం అమల్లోకి వచ్చిందని జిల్లా కోఆర్డినేటర్ ఎంజి. నరసింహులు తెలిపారు. పని ప్రారంభంలో ఒకసారి, ముగింపులో ఒకసారి ఫోటో తీయించుకుంటేనే హాజరు నమోదవుతుందని.. లేదంటే వేతనాలు జమకావని స్పష్టం చేశారు.