సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి పరిధిలోని విద్యానగర్లో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. కాలనీలో నివాసం ఉండే బంగారం వ్యాపారి విక్రమ్ ఇంటికి తాళం వేసి శనివారం ఊరికి వెళ్లారు. ఆదివారం ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉంది. బీరువాలో ఉన్న 15 తులాల బంగారం చోరీ అయినట్లు గుర్తించారు. ఘటనా స్థలాన్ని సంగారెడ్డి రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి పరిశీలించారు.
NRPT: మక్తల్ మండలం ముసలయ్యపల్లి గ్రామంలో శ్రీ నారద గడ్డ జాతర సందర్భంగా ఎద్దుల బండి లాగుడు పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామ రైతులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఎద్దులతో ప్రతిభ చాటారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పవిత్ర, మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి తదితర నాయకులు, గ్రామస్థులు పాల్గొని జాతర వేడుకలను ఘనంగా నిర్వహించారు.
JGL: వ్యక్తి నిర్మాణం ద్వారానే దేశ పునర్నిర్మాణం సాధ్యమని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సహ వ్యవస్థాపకుడు ప్రముఖ్ తిరుమల్ అన్నారు. ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా జగిత్యాల పట్టణంలో నగర మహాసాంఘిక్ నిర్వహించారు. 23 శాఖలకు చెందిన సుమారు 500 మంది స్వయం సేవకులు పాల్గొన్నారు. నిత్య శాఖ ద్వారా వ్యక్తిత్వ వికాసం జరుగుతుందని, శక్తివంతమైన భారతదేశంతోనే ప్రపంచశాంతి సాధ్యమన్నారు.
ASF: రెబ్బెన మండలం ఇంద్రనగర్ అమ్మవారిని కరీంనగర్ జిల్లా మానకొండూర్ సీఐ శ్రీలత ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. లోక కళ్యాణం, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్య క్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
MDCL: ‘ఆపరేషన్ సికింద్రాబాద్’ పేరిట రైల్వే సామాగ్రి దొంగతనాలపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మౌలాలి, అశ్వాపురం ప్రాంతాల్లో గాలింపు నిర్వహించి యాక్షన్ ప్లాన్ అమలు చేసింది. ఈ క్రమంలో ఓ దొంగను పట్టుకుని అతని వద్ద నుంచి ఎలక్ట్రిక్ వైర్, భారీ పంపుసెట్ స్వాధీనం చేసుకున్నారు.
VKB: జిల్లా మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న వ్యక్తిని కుల్కచర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. అడవి పందులను వేటాడేందుకు సదరు వ్యక్తి తుపాకీని వినియోగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.
HYD: మార్చి 8 నుంచి 14 వరకు గచ్చిబౌలి స్టేడియంలో మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ జరగనున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనేందుకు వస్తున్న 8 దేశాల క్రీడాకారిణులకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో హాకీ వరల్డ్ కప్ ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది.
SDPT: బెజ్జంకి మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాల దరఖాస్తుల గడువును మార్చి 10 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ మలోత్ సంగీత తెలిపారు. సంచాలకులు సున్నం శ్రీనివాస్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19, 2026న జరగనుంది. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ₹2000 నగదు బహుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
KMM: మత సామరస్యానికి, సోదరభావానికి ఇఫ్తార్ విందులు వేదికలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం కూసుమంచి మండల కేంద్రంలోని శివాలయం రోడ్డులో కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి మంత్రి విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కార్యకర్తలు ఉన్నారు.
BDK: ప్రతిరోజు లక్షన్నర లడ్లు, భక్తులకు అందించేలా చర్యలు తీసుకావాలని, ఈ సంవత్సరం భక్తులకు తలంబ్రాలు, ప్రసాదాలు కొరత లేకుండా చూడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి స్వామివారి తలంబ్రాలు పంపిణీకి 80 కౌంటర్లు, లడ్డూలు సరఫరాకు 20 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి పొంగులేటి అన్నారు.
BHPL: కాటారం మండలం చింతకాని పరిధిలోని రోటీపొదాల వాగులో ఆదివారం సాయంత్రం పురాతన స్వామి విగ్రహం లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు. విష్ణుమూర్తి అవతారాన్ని పోలిన ఈ విగ్రహాన్ని స్థానికులు గుర్తించి జాగ్రత్తగా బయటకు తీశారు. ఈ విషయం తెలిసిన వెంటనే గ్రామస్థులు పెద్ద సంఖ్యలో వాగు వద్దకు చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
JGL: ఈనెల 3న రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉన్నందున ఆ రోజు ప్రసిద్ద పుణ్యక్షేత్రం కొండగట్టులో నిర్వహించే గిరి ప్రదక్షిణను గ్రహణానికి ముందే పూర్తి చేసుకుందామని గిరి ప్రదక్షిణ ప్రారంభికులు సురేష్ ఆత్మారాం పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం 6 గంటలకు గిరి ప్రదక్షిణ ప్రారంభించి, 07:30 లోపు పూర్తి చేసుకుందామన్నారు. కావున గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తుల సహకరించాలన్నారు.
KNR: గంగాధర మండలం గర్శకుర్తిలో ఘనంగా వరల్డ్ సివిల్ రైట్స్డేను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం నుంచి భారత సైన్యంలో పని చేసిన, ప్రస్తుతం పని చేస్తున్న వారికి, వారి తల్లిదండ్రులను స్థానిక సరస్వతి హైస్కూల్లో ఓ ట్రస్ట్ వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ డా.రఘరామన్, గ్రామ సర్పంచ్ చిందం ఆంజనేయులు పాల్గొన్నారు.
SRCL: నోరూరించే ఆపిల్ పండ్లు కాశ్మీర్లోనే కాకుండా సిరిసిల్లలో కూడా పండుతున్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్కు చెందిన విజయ్ బాబు తన ఇంటి ఆవరణలో సీజీజీఎం జాతికి చెందిన జావా ఆపిల్ మొక్కను నాటాడు. ఆ చెట్టు పూతలు పూయడమే కాకుండా ప్రస్తుతం కాయలు కూడా కాస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆపిల్ సాగుకు అనువైన ప్రాంతం కాదనే అభిప్రాయం ఉండేదని వారు తెలిపారు.
WGL: నెక్కొండ మండలం మడిపల్లి GP కార్యదర్శి రజియా GP నిధులు దుర్వినియోగం చేసినట్లు సర్పంచ్ అనూష DLPOకు ఇటీవల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సర్పంచ్ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్కు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. పంచాయతీలో నిధుల దుర్వినియోగం, సంతకాల ఉదంతం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.