Elon Musk: ఎక్స్ ఖాతాలను పరిశీలించిన కంపెనీ భారతదేశంలోని ఖాతాలను భారీగా తొలగించింది. దాదాపు 2 లక్షల ఖాతాలను బ్యాన్ చేసింది. ఈ మేరకు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) తీసుకున్న నిర్ణయంతో భారతీయ ఎక్స్ యూజర్లు షాకయ్యారు. దేశంలోని 2 లక్షల మందికిపైగా ఖాతాదారుల అకౌంట్లను ఎక్స్ కార్ప్ (X Corp) బ్లాక్ చేసింది. పిల్లలపై లైంగిక దాడులు, అశ్లీలత, ఉద్రిక్తతలను ప్రోత్సహించే కంటెంట్ను కట్టడిచేసే చర్య తీసుకుంది. దీనిలో భాగంగా మార్చి నెలలో ఏకంగా 2,12,627 ఖాతాలపై నిషేధం విధించింది. ఫ్రిబవరి 26 నుంచి మార్చి 25 వరకు భారతీయ సైబర్స్పేస్లో ఉగ్రవాదాన్ని ప్రచారం చేసినందుకుగాను 1,235 ఖాతాలను తొలగించినట్లు వెల్లడించింది. కొత్త ఐటీ నిబంధనల పరిధిలో ఈ చర్యలు తీసుకున్నట్లు ఎక్స్ కార్ప్ వెల్లడించింది.
ఈ రిపోర్ట్లో దేశవ్యాప్తంగా 2,13,862 ఖాతాలపై నిషేధం విధించారు. ఇండియా నుంచి 5,158 ఫిర్యాదులు అందాయని, తమ గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం ద్వారా వాటిని పరిష్కరించామని తెలిపారు. వాటిలో ఎక్కువగా నిషేధాన్ని తప్పించుకోవడం (3,074), అడల్ట్ కంటెంట్ (953), విద్వేశాన్ని రెచ్చగొట్టడం (412), వేధింపులకు (359) సంబంధించినవి ఉన్నాయని పేర్కొంది. గత రిపోర్ట్లో జనవరి 26 నుంచి ఫిబ్రవరి 25 వరకు 5,06,173 మంది ఖాతాలను ఎక్స్ నిషేధించింది. కొత్తగా వస్తున్న నిబంధనలకు అనుకూలంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఎక్స్ తన నవేదికలో పేర్కొంది.