MDK: శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా రేపటి నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఏవిధమైన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని ఎస్పీ తెలిపారు.
SRD: స్విమ్మింగ్ పూల్ కోచ్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాధికారి అఖిలేష్ రెడ్డి తెలిపారు. 40 ఏళ్లలోపు ఉండి, ఎన్ఐఎస్ సర్టిఫికెట్ కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు మార్చి 7 లోపు కలెక్టరేట్లోని క్రీడా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు 7981798957 నంబర్ను సంప్రదించాలని సూచించారు.
కోనసీమ: ఆలమూరు మండలం పరిధిలోని బడుగువాని లంక గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో రూ.15 లక్షల వ్యయంతో నిర్మాణంలో ఉన్న కల్వర్ట్ పనులను శనివారం ఎంపీడీవో ఎ.రాజు పరిశీలించారు. గ్రామ ప్రజల రాకపోకలకు అనుకూలంగా, ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులను నివారించే లక్ష్యంతో ఈ కల్వర్ట్ నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు.
PLD: వినుకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ప్రపంచ టైలర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు హాజరయ్యి కుట్టు మిషన్ సృష్టికర్త చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రంగంలో విశేష సేవలు అందిస్తున్న టైలర్లను శాలువాలతో సన్మానించారు.
SKLM: కాశీబుగ్గ బస్టాండ్ ఆవరణంలో ఉన్న అన్న క్యాంటీన్ను శనివారం మధ్యాహ్నం ఏపీటీపీసీ ఛైర్మన్ బాబురావు సందర్శించారు. అనంతరం పలాస టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి సప్ప నవీన్తో కలిసి ఆయన భోజన రుచిని పరీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం ఐదు రూపాయలకే పేదవాడికి కడుపునిండా భోజనం కూటమి ప్రభుత్వంలో తిరిగి ప్రారంభించామని తెలిపారు.
JGL: జగిత్యాల పట్టణం విద్యానగర్లోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో నిర్వహించనున్న శ్రీరామనవమి ఉత్సవాల కరపత్రాన్ని శనివారం దేవాలయం ఆవరణలో ఆవిష్కరించారు. మార్చి 26- 28 వరకు శ్రీరాముని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ అశోక్ రావు తెలిపారు. ఉత్సవాల్లో మార్చి 26 గురువారం విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యవచనం, రక్షాబంధన నిర్వహిస్తామన్నారు.
VZM: మెరకముడిదాం మండలంలోని చెల్లాపురం సర్పంచ్ రెడ్డి వరంను శనివారం తన నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. టీడీపీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఇటీవల ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తనను గృహనిర్బంధం చేశారని పోలీసులు తెలిపారు. పార్టీకి రాజీనామా చేసిన నన్ను ఇలా గృహ నిర్బంధం చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. T20 WC అనంతరం కెప్టెన్ సల్మాన్ ఆఘాపై వేటు వేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. జట్టు పేలవ ప్రదర్శనపై పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నక్వీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే జట్టులోని సీనియర్ ఆటగాళ్లు ఆఘా, బాబర్, ఉస్మాన్ ఖాన్లను T20 జట్టు నుంచి పూర్తిగా తప్పించనున్నట్లు సమాచారం.
MDK: మెదక్ పట్టణంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించి మహమ్మద్ ఇమ్రాన్ కుటుంబంపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లు టౌన్ సిఐ మహేష్ తెలిపారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్, గణేష్, శ్రీను, సురేష్ తదితర 30 మంది వ్యక్తులు ఇమ్రాన్ ఇంటిపైకి వచ్చి దాడికి యత్నించినట్లు వివరించారు.
NLG: గుండ్లపల్లి(డిండి) మండలం ఎర్రగుంటపల్లి, వావిల్ కోల్ రహమంతాపూర్, కందుకూరు, సింగరాజుపల్లి, తవక్లాపూర్ గ్రామాలలో నూతనంగా నిర్మించనున్న గ్రామ మహిళా సమాఖ్య కార్యాలయ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బాలునాయక్ శనివారం శంకుస్థాపన చేశారు. కందుకూరు స్కూల్ కాంపౌండ్ వాల్ శంకుస్థాపన చేసిన అనంతరం సీసీ రోడ్డును ప్రారంభించారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్: మిడ్జిల్ మండలంలోని వెలుగోములలో సర్పంచ్ సువర్ణమ్మ అధ్యక్షతన శనివారం గ్రామసభ నిర్వహించారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామంలో తాగునీటి ఎద్దడి కలగకుండా పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు అండర్ డ్రైనేజీ, వీధి దీపాలు, సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. పంచాయతీ కార్యదర్శి వినీల ఉన్నారు.
MLG: తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క-సారలమ్మ వనదేవతలను శనివారం సాయంత్రం ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మంత్రులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు అమ్మవార్లకు చీర, సారే సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, SP తదితరులు ఉన్నారు.
WGL: వర్ధన్నపేట మండలం కట్రియాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు మహమ్మద్ అక్బర్ తండ్రి ఇవాళ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న MLA KR నాగరాజు మృతుడి ఇంటికి వెళ్లి ఆయన పార్దివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
అన్నమయ్య: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా బాలాజీ నగర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్కు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించుకోవాలని, శాస్త్రాన్ని దైనందిన జీవితంలో అన్వయించుకోవాలని సూచించారు. ఉత్తమ ప్రదర్శనలు కనబరిచిన విద్యార్థులను అభినందించారు.
GDWL: మల్దకల్ కేంద్రంలో రెండవ సంవత్సరం ఆంగ్ల పరీక్షకు ఒక్కరు కూడా గైర్హాజరు కాకుండా అందరూ హాజరుకావడం గర్వకారణం అని సీఎస్ నరసింహులు, డిపార్ట్మెంటల్ అధికారి శేఖర్ సంతోషం వ్యక్తం చేశారు. శనివారం జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా, మొత్తం 64 మంది విద్యార్థులకు గాను 64 మంది పరీక్షకు హాజరయ్యారు.