ASR: అంగన్వాడీల వేతనాలు పెంచాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం CITU ఆధ్వర్యంలో అరకులోయ ఐసీడీఎస్ ఆఫీసు వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అంగన్వాడీ వ్యవస్థను పటిష్ట పరచడానికి సీఎం చంద్రబాబు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఇచ్ఛిన హామీలను నెరవేర్చాలని పేర్కొన్నారు.
తూ.గో: రాజమండ్రిలో కల్తీ పాల వల్ల నలుగురు మృతి చెందడంపై సోమవారం పీసీసీ అధ్యక్షురాలు YS షర్మిల రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కల్తీ పాల సరఫరా వెనుక ఉన్న వాస్తవాలను బయటకు తీయాలని కోరారు. ఈ ఘటన తీవ్ర భయాందోళనలకు గురిచేసిందని ఆమె పేర్కొన్నారు.
NDL: దివ్యాంగుల కోసం పెండింగ్లో ఉన్న బ్యాక్ లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని వైసీపీ పులివెందుల దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పులివెందుల ఆర్డీవో చిన్నయ్యకు వినతి పత్రం ఇచ్చారు. అర్హులైన దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలు, ఉచిత లైసెన్స్ మేళా, అలాగే సీఎం ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు.
KRNL: కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 122 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ విక్రంత్ పాటిల్ తెలిపారు. ఉద్యోగాల పేరుతో లక్షలు వసూలు చేసి మోసం చేసిన ఘటనలు ప్రధానంగా నమోదయ్యాయి. ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
NGKL: తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ వికాస సమితి నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా నాగర్ కర్నూల్కు చెందిన ప్రముఖ కవి, ఉద్యమకారుడు సుబ్బయ్య నియమితులయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా శ్రీనివాస్ కొనసాగనున్నారు. సుబ్బయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవానికి విరుద్ధంగా జరిగే అప్రజాస్వామిక చర్యలను తమ సమితి నిరంతరం ప్రశ్నిస్తుందని అన్నారు.
KMR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై గెలిచిన కాటిపల్లి రమణారెడ్డిపై కక్ష గట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్పడుతోందని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రొటోకాల్ పాటించకుండా ఎమ్మెల్యేను రానివ్వకుండా చేస్తూ అవమాన పరుస్తున్నారని మండి పడ్డారు. వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ అనవసర రాద్ధాంతాలకు తెరలేపిందన్నారు.
PDPL: రామగుండం పరిధిలో ఇటీవల నిర్వహించిన డ్రంక్ &డ్రైవ్లో దొరికిన ఏడుగురిని గోదావరిఖని కోర్టులో సోమవారం హాజరు పరిచినట్లు ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు తెలిపారు. వారిలో ఆరుగురికి రూ. 2 వేల చొప్పున జడ్జి వెంకటేశ్ దుర్వా జరిమానా విధించారని, 2 సారి పట్టుబడిన ఓ వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష విధించినట్లు సీఐ తెలిపారు. అతడిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించామన్నారు.
SKLM: పలాసలో ఈనెల 26న జరగనున్న ఎల్లమ్మతల్లి జామి యాత్ర ఏర్పాట్లను ఏపీటీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు, డీఎస్పీ షేక్ షాహ బజ్ అహ్మద్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆలయ కమిటీ సభ్యులకు తగు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు.
MLG: ఆశా వర్కర్ల శాంతియుత నిరసనలను అడ్డుకుని ముందస్తు అరెస్టులు చేయడం దుర్మార్గమని CITU జిల్లా మాజీ అధ్యక్షుడు ఎండి దావూద్ మండిపడ్డారు. ఎన్నికల ముందు వాగ్దానం చేసిన 18,000 ఫిక్స్డ్ వేతనం, హెల్త్ కార్డు, ప్రమాద బీమా హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు.
SRCL: లైసెన్సుడు సర్వేయర్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం 25 మంది సర్వేయర్లకు లైసెన్స్ పత్రాలు ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్తో కలిసి పంపిణీ చేశారు.
TG: కాంగ్రెస్ పార్టీ బలోపేతం, నాయకత్వ సామర్థ్యాల అభివృద్ధి లక్ష్యంగా DCC అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు PCC చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. నాయకత్వ నైపుణ్యాలు, ప్రజా సమస్యల పరిష్కారాలపై శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల వ్యూహరచన, సోషల్ మీడియా, కార్యాచరణపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. గ్రామస్థాయి వరకు కాంగ్రెస్ సిద్ధాంతాలను తీసుకెళ్లడం ప్రధాన ఉద్దేశమన్నారు.
VZM : జిల్లాలో నిర్వహిస్తున్న బోద వ్యాధి నివారణ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అదేశించారు. జాతీయ ఆరోగ్య మిషన్ అడిషనల్ సెక్రటరీ ఆరాధన పట్నాయక్ సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. గుర్లలో ఇప్పటివరకు 5,516 మందికి మాత్రలు పంపిణీ చేసినట్లు తెలిపారు.
భారత్తో మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ అరుదైన రికార్డు సాధించాడు. ఈ విజయంతో T20 WCలో కెప్టెన్గా 13వ విజయాన్ని నమోదు చేశాడు. తద్వారా T20 WC చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో రోహిత్(12)ను అధిగమించి మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో ధోనీ(21), విలియమ్సన్(14) తొలిరెండు స్థానంలో కొనసాగుతున్నారు.
ADB: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పోర్ట్స్ మీట్లో జిల్లాకు సంబంధించిన మహిళా కానిస్టేబుళ్లు రాణించి మూడు బంగారు, నాలుగు కాంస్య, ఒక రజత పతకం గెలుపొందడం జరిగిందని SP అఖిల్ మహాజన్ సోమవారం తెలిపారు. ఈ మేరకు మహిళా కానిస్టేబుల్లను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయస్థాయి పోటీలో సైతం రాణించాలని SP ఆకాంక్షించారు.
HYD: శేరిలింగంపల్లిలో దోమల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు ఆందోళనకు దిగారు. చెరువుల్లో చెత్త ఎక్కువైపోయి, దోమలకు నిలయంగా మారిందని ఆరోపించారు. దోమల తెరతో నిరసన వ్యక్తం చేశారు. దోమల నివారణ మందు పిచికారి చేయడం మర్చిపోయారని, సిబ్బంది కూడా పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ఇప్పటికే చాలామంది డెంగ్యూ జ్వరం బారిన పడ్డారని చెప్పారు.