ATP: గుత్తిలోని పలు ఇంటర్ పరీక్ష కేంద్రాలలో సోమవారం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్దకు అరగంట ముందుగానే విద్యార్థులు చేరుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ ను అమలు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు.
కృష్ణా: పమిడిముక్కల మండలం ఆగినిపర్రు గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించిన మండల స్థాయి బాల, బాలికల ఆటల పోటీల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని తెలిపారు.
ADB: దైవారాధనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం గుడిహత్నూర్ మండల కేంద్రంలో సంత్ గాడిగే బాబా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ జిల్లాధ్యక్షుడు పతంగి బ్రహ్మానందంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహాల ప్రతిష్టాపనతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు.
ADB: బోథ్ నియోజకవర్గంలోని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు అందేలా తనవంతుగా కృషి చేస్తానని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ఆదివారం తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ అరుణ్ కుమార్, నారాయణ, సంతోష్ తదితరులున్నారు.
SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు ఆదివారం వెల్లడించారు. టికెట్లు రూపేణ, విరాళాలు, ప్రసాదాలు రూపంలో రూ. 6.75 లక్షలు స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో KNV D ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని తెలిపారు.
ప్రకాశం: కొత్తపట్నం మండలంలోని మోటుమాల గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో గుండమాలకు చెందిన సురేష్ అనే వ్యక్తి మృతి చెందారు. రోడ్డు మరమ్మతుల్లో భాగంగా పక్కనే పోసిన మట్టికుప్పను సురేష్ తన ద్విచక్రవాహనంతో బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
NTR: ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో రైజ్ సెంటర్లో నిర్వహించిన ఏఐ ఫర్ షూర్ వర్క్ షాప్లో జిల్లా కలెక్టర్ లక్ష్మీశా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆధునిక సాంకేతికత ద్వారా వ్యాపారాభివృద్ధి అవకాశాలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా పారిశ్రామిక వేత్తలను టెక్నాలజీతో శక్తివంతం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.
PDPL :పెద్దపల్లి RSETI సంస్థ 2026–27 సంవత్సరానికి గ్రామీణ నిరుద్యోగ యువత కోసం పలు స్వయం ఉపాధి శిక్షణలను అందించనున్నట్లు, డైరెక్టర్ రాకేష్ పరీష తెలిపారు. మగ్గం వర్క్, జ్యువెలరీ, బ్యూటీ పార్లర్, ఫోటోగ్రఫీ, సీసీ కెమెరా సర్వీసెస్, కార్ డ్రైవింగ్, ఫాస్ట్ ఫుడ్, పాపడ్-పికిల్స్ తయారీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆసక్తిగల వారు 9392221907ను సంప్రదించాలన్నరు.
GDWL: కేటీదొడ్డి మండలం చింతలకుంటలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఇసుక తరలిస్తున్న యజమాని లక్ష్మణ్, డ్రైవర్ రంగస్వామిలపై కేసు నమోదు చేసి, పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. స్థానికుల సహకారం కోసం పరిశీలనలు కొనసాగిస్తున్నారు.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపాలిటీల్లో పాలక వర్గాల ఏర్పాటు పూర్తయిన తర్వాత, ఇప్పుడు అందరి దృష్టి “కో-ఆప్షన్” సభ్యుల ఎంపిక పై పడింది. పట్టణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఈ నామినేటెడ్ స్థానాల కోసం ఎన్నికల్లో టికెట్ దక్కని వారు, పార్టీ కోసం కష్టపడిన ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో మున్సిపల్ కార్యాలయాల్లో రాజకీయ సందడి నెలకొంది.
W.G: పాత గొడవల నేపథ్యంలో ఓ యువకుడిపై ఇద్దరు వ్యక్తులు చాకుతో దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హనుమంతు నాగరాజు తెలిపారు. ఆదివారం ఆకివీడులోని గంగానమ్మ కోడు వీధిలో బాధితుడు పవన్ కుమార్కు అదే ప్రాంతానికి చెందిన గోపీచంద్, వెంకటేశ్వరరావు అడ్డగించి గాయపరిచారు. తీవ్ర గాయాలైన పవన్ ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
VSP: యూత్ ఫర్ సేవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన “చిగురు” కార్యక్రమంలో మల్కాపురం జీవీఎంసీ హై స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. అన్ని విభాగాలలో పాల్గొన్న విద్యార్థులు విజేతలుగా నిలిచి అవార్డులు సాధించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు అభినందించారు.
అన్నమయ్య: సుండుపల్లి మండలం చెన్నంశెట్టి పల్లె సమీపంలోని ఎల్లమ్మ తిరుణాల సోమవారం నుంచి బుధవారం వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం అంకురార్పణ,ప్రత్యేక పూజలు,అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తామని చెప్పారు. మంగళవారం అభిషేకాలు, పుట్ట బంగారు తెచ్చుట పొంగుబాలు, రాత్రి చెక్కభజన కార్యక్రమాలు ఉంటాయన్నారు. బుధవారం చాందిని బండ్ల తిరుణాల ఉంటుందని తెలిపారు.
MNCL: క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న అల్లర్ల కేసులో మాజీ MLA బాల్క సుమన్కు బెయిల్, పోలీసుల కస్టడీ పిటిషన్లపై సోమవారం కోర్టులో వాదనలు జరగనున్నాయి. బెయిల్ మంజూరవుతుందా? లేక పోలీసుల కస్టడీకి అప్పగిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. కోర్టు తీసుకునే నిర్ణయం క్యాతనపల్లి రాజకీయ పరిణామాలపై ప్రభావం చూపే అవకాశముంది.
మహబూబ్ నగర్ జిల్లాలో ఈ నెల 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 35 కేంద్రాల్లో 21,884 మంది విద్యార్థులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష రాయనున్నారు. విద్యార్థులకు సౌకర్యాల కోసం కనీస వసతులు అందించినట్లు అధికారులు తెలిపారు.