KNR: నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో రెండు నెలల పాప మృతికి కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ స్టేజ్ వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు పూసల సంపత్ మాట్లాడుతూ.. అగ్రవర్ణ దురహంకారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు.
ELR: గ్రామాలలో ఆదాయ వనరులను గుర్తించి అభివృద్ధికి సహకరించాలని గణపవరం ఎంపీడీవో పివి.సత్యనారాయణ అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్లకు ఒకరోజు శిక్షణ తరగతులు జరిగాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో శివాజీ, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
PLD: పుణ్యక్షేత్రమైన అమరావతిలోని అమరేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు శంకరమంచి రాజేశ్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు, విశేష అలంకరణలు జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకన్నారు.
WNP: జిల్లా సర్వేశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నూతన లైసెన్స్డ్ సర్వేయర్లకు లైసెన్స్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాబోయే రోజుల్లో ప్రజల భూ సమస్యల పరిష్కారంలో లైసెన్స్డ్ సర్వేయర్ల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. భూ సర్వే ప్రక్రియల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని సూచించారు.
ATP: జిల్లా కోర్టుకు నేడు మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా ఈ హెచ్చరిక పంపినట్లు కోర్టు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాంబు స్క్వాడ్ సహాయంతో న్యాయస్థాన ఆవరణలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. పదేపదే ఇలాంటి బెదిరింపులు వస్తుండటంతో న్యాయవాదులు, సిబ్బంది భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా: పెడన మండలం నందిగామ పంచాయతీలో ఒడ్డు చెరువులో గుర్రపు డెక్క తొలగించే పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ కాగిత లక్ష్మీ నాగేశ్వరరావు, స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు స్వచ్ఛందంగా కూలీలతో గుర్రపు డెక్క తొలగింపు పనులను చేపట్టారు. గుర్రపు డెక్క తొలగించడంతో నీరు ఒకచోట నిలిచిపోకుండా సాఫీగా ప్రవహిస్తుందని నాగేశ్వరరావు తెలిపారు.
NZB: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా కమ్మర్ పల్లి మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన మోర్తాడ్ ఉదయ్ని నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్ తెలిపారు. ఈ రోజు నియమాక పత్రాన్ని అందజేసి ఎస్సీల సంక్షేమం కోసం పాటు పడాలని సూచించారు. ఉదయ్ మాట్లాడుతూ.. ఎస్సీల అభివృద్ధికి తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు.
SKLM: సోంపేట మండలం బెంకిలి గ్రామానికి చెందిన టెంక విశ్వనాథం (36) సోమవారం ఉదయం బూరగాం గ్రామ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గొంతు క్యాన్సర్తో బాధపడుతూ… ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురై, మరోవైపు గొంతు నొప్పులు తాళలేక ఈ ఘటనకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు ఉన్నారు.
NGKL: చారకొండ మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో ఎర్రవల్లి-గోకారం రిజర్వాయర్లో ముంపునకు గురికాకుండా చూడాలని చేస్తున్న రిలే నిరాహార దీక్ష మంగళవారంతో 85 రోజులకు చేరుకుంది. అలాగే R&R ప్యాకేజీ ప్రాథమిక నోటిఫికేషన్ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని భూనిర్వాసితులు డిమాండ్ చేశారు. తమ భూములు తమకు కావాలని, తమ ఇళ్లు ముంపునకు గురి కాకుండా కాపాడాలని కోరారు.
MLG: మంగపేట మండలం నిమ్మగూడెం, రమణక్కపేట, దొమేడ గ్రామాల్లో మంగళవారం MGNREGA పనులను ఆయ గ్రామాల సర్పంచులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవి కాలంలో గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే ఈ పథకం ద్వారా గ్రామీణులు ఆర్థికంగా బలోపేతం అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామాల వార్డ్ మెంబర్లు ఉన్నారు.
NDL: రుద్రవరం మండల సర్వసభ్య సమావేశం ఈ నెల 28వ తేదీన నిర్వహించబడనుందని ఎంపీడీవో భాగ్యలక్ష్మి ఇవాళ తెలిపారు. మండల అధ్యక్షుడు మబ్బు బాలస్వామి అధ్యక్షతన ప్రారంభమయ్యే సమావేశంలో జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు సకాలంలో హాజరు కావాలని, శాఖల అధికారులు ప్రగతి నివేదికలతో సిద్ధంగా ఉండాలని ఆమె ఆదేశించారు.
తిరుపతి: ఏర్పేడులోని తిరుపతి IISERలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఫిబ్రవరి 28, మార్చి 2వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఆ రెండు రోజులు ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమాలు జరుగనున్నాయి. 200కు పైగా శాస్త్రీయ ప్రదర్శనలు, ప్రత్యక్ష ప్రయోగాలు చేపడతారు. మార్చి 2న కౌస్తావ్ సాన్యాల, రుచి ఆనంద్, ధనంజయ శర్మ ప్రత్యేక ఉపన్యాసాలు ఇవ్వనున్నారు.
AKP: నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామం మోడల్ స్కూల్లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైందని ప్రిన్సిపాల్ సంధ్య తెలిపారు. మంగళవారం నుంచి వచ్చే నెల మార్చి 31 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. https://www.cse.ap.gov.in , https://www.apms.apcfss.in అనే వెబ్సైట్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
SRD: గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గ్రామానికి చెందిన ఠాకూర్ పద్మాబాయ్ చికిత్స కోసం నిజాం ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సస్లో చేరగా, మెదక్ ఎంపీ రఘునందన్ రావు రూ.2,00,000 ఎల్ఓసిని కుటుంబ సభ్యుడు వికాస్ సింగ్కు అందించారు. కార్యక్రమంలో జిన్నారం మండల బీజేపీ అధ్యక్షుడు కొత్తకాపు జగన్ రెడ్డి, రమణ సింగ్ తదితరులు ఉన్నారు.
TG: జలవివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. దేవాదుల సాక్షిగా కృష్ణా, గోదావరి జలాల సాధనలో వివాదమా?, పరిష్కారమా? అంటే తాము పరిష్కారం కోరుకుంటామని అన్నారు. చర్చలా, పంచాయితీనా అంటే తాము చర్చలే కోరుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందివ్వడమే తమ ప్రభుత్వం మందున్న టార్గెట్ అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.