ఈ మధ్యన మీరే చూస్కోండి. కొందరు యంగ్ హీరోలు హిట్ అన్నమాటే మరచిపోయారు. వరస ఫ్లాపులు….ఒకదానివెంట వైఫల్యాలు. వాళ్ళ పేర్లు చెబితేనే ఎగ్జిబిటర్లు వణికిపోయే పొజిషన్కి వచ్చేశారు. అందులో ముఖ్యంగా నితిన్ తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ. రాబిన్ హుడ్ సినిమా పూర్తిగా అతిపెద్ద డిజాస్టర్. ఎక్కడా ఓటిటిలు కూడా మైత్రీ మూవీమేకర్స్ని కాపాడలేకపోయాయి. భారీ నష్టాన్ని ఎదర్కొన్నారు మైత్రీ బ్రదర్స్.
తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ లోగడ సినిమా జాక్ దెబ్బకి బెంబేలెత్తిపోయారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు గగ్గోలు పెట్టేశారు. బడా నిర్మాతలు, పంపిణీదారులే బహిరంగంగా, బాహాటంగా ప్రెస్మీట్లు పెట్టి మరీ తమ గోడును వెళ్ళగక్కారు. అమ్మో ఇలాటి సినిమాలైతే ఇంక దుకాణాలు మూసుకుని ముక్కు మూసుకుని అడవిలోకి పరిగెత్తి తలకిందులుగా తపస్సు చేసుకోవడం ఉత్తమం అని ఎలుగెత్తి రంకెలు వేసిన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో పరువు పోతుందని సిద్ధూ నాలుగో ఐదో కోట్లు వాపస్ ఇచ్చేశాడు. అదీ ఈ ఇద్దరి పరిస్థితి. ఈ జాబితాలో విష్వక్సేన్, శర్వానంద్ కూడా ఉన్నారు.
అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ కొత్త సినిమాల రిలీజులకి తయారయ్యారు. తమ్ముడు సినిమాతో నితిన్ జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకుడు. వేణుకి కూడా చెప్పుకోదగ్గ హిట్ లేదు ఈ మధ్యన. 2021లో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ తర్వాత మళ్ళీ వేణు దర్శకత్వం వహిస్తున్నది తమ్ముడు చిత్రమే.
సిద్దూ జొన్నలగడ్డ జాక్ తర్వాత తెలుసు కదా చిత్రంలో హీరోగా చేస్తున్నాడు. స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టిజి విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్లో ఉంది. అక్టోబర్ 17వ తేదీన తెలుసు కదా రిలీజు కాబోతోంది.
ఈ రెండు సినిమాలు ఈ ఇద్దరి హీరోల భవిష్యత్తునూ చాలా వరకూ తేల్చి చెబుతుంది.