VKB: పరిగి పట్టణంలోని శ్రీశ్రీ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి-ఉమారెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపారాయణం, స్వామివారికి అభిషేకం, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర హోమం, అంజనేయ, నాగ, ధ్వజ హోమాలు, మహాపూర్ణాహుతి నిర్వహించారు.
మేడ్చల్: జీడిమెట్ల డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలోని హరిహర అయ్యప్ప దేవాలయ ప్రథమ వార్షికోత్సవాన్ని మంగళవారం ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఉత్సవాలు ఈనెల 11 నుంచి 13 వరకు కొనసాగుతాయన్నారు. మంగళవారం మహాగణపతిపూజ, ప్రసాదశుద్ధి, స్థలశుద్ధి, మహాగణపతిహోమం, వాస్తుహోమం, బుధవారం మహాగణపతిహోమం, కలశపూజ, ధ్వజారోహణం, పడిపూజ ఉంటాయన్నారు.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారిని గురువారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ. 1,26,495 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 176 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. అలాగే, అన్నదాన ట్రస్ట్ ద్వారా 1510 మంది అన్నదానం స్వీకరించారని వెల్లడించారు.
KDP: సిద్ధవటం మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామికి శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చకులు సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూల అలంకరణ, త్రికాలారాధన వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భక్తులు పాల్గొని స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
హిందువులకు ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. పౌరాణిక కథల ప్రకారం ఈ రోజున శివుడు, పార్వతి ఏకమయ్యారని చెప్తుంటారు. ఈ పండుగ ఆత్మపరిశీలన, ఆధ్యాత్మిక మేల్కొలుపు వంటి విషయాలను బోధిస్తుంది. మహాశివరాత్రి పండుగ ప్రజలను పునర్జన్మ స్వీకరించడానికి, ప్రతికూలతను విడిచిపెట్టడానికి ప్రోత్సహిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
అన్నమయ్య: మహాశివరాత్రి వేల మదనపల్లె పట్టణంలో వేకువజాము నుండే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ మంజునాథ స్వామి ఆలయంలోని బ్రహ్మసూత్ర శివలింగానికి, మడి కయ్యల శివాలయంలోని యోగ భోగేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించారు. పండుగ సందర్భంగా ఆలయాలను వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ తగు ఏర్పాట్లు చేశారు.
MBNR: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామివారి ఆలయాలను శనివారం పంచాయతీ రాజ్ SE సురేష్ చంద్రా రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద శర్మ వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు.
VSP: పెందుర్తికి బార్డర్గా ఉన్న దేశపాత్రుని పాలెం గ్రామంలో ఫిబ్రవరి 23న ఆదివారం శ్రీభూలోకమాంబ అమ్మవారి ఉత్సవం నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తెలిపారు. ఉదయం ఊరేగింపుగా జాతర ప్రారంభమవుతుందన్నారు. ఆలయం వద్ద ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.
AP: ఇవాళ్టి నుంచి శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. స్వామివారి ప్రథమ భక్తుడైన భక్త కన్నప్ప ధ్వజారోహణంతో బ్రహోత్సవాలు ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఆర్జిత అభిషేక సేవలు, అంతరాలయం దర్శనాలను రద్దు చేసినట్లు ఆలయాధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
CTR: పుంగనూరు పట్టణం పుష్కరి వద్ద గల ఆలయంలో దక్షిణామూర్తికి గురువారం విశేషపూజలు జరిగాయి. ముందుగా, గణపతి పూజ, పుణ్య వచనాలు, పరిమళ పుష్పాలతో పూజలు చేసి హారతి సమర్పించారు. దక్షిణామూర్తికి పాలు, పెరుగు, చందనము, వీభూదితో అభిషేకం చేశారు. భక్తులు భక్తిశ్రద్ధలతో గురుదక్షిణామూర్తి అభిషేకంలో పాల్గొన్నారు.
NLG: తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. సూర్యపేటలోని లింగమతుల స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. తమ మొక్కులు చెల్లించుకొని స్వామి కృపకు పాత్రులవుతున్నారు. భారీగా వాహనాలు తరలివస్తుండటంతో అధికారులు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. HYD నుంచి VJWD వెళ్లే వాహనాలను NKP వద్ద దారి మళ్లిస్తున్నారు.
పార్వతీపురంమండలంలోని తాళ్లబురిడి గ్రామంలో ఆరవిల్లి శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో గ్రామ పురోహితులు అయ్యల స్వామి యాజుల శ్రీనివాసశర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు బసవ రాజుల పర్యవేక్షణలో శివాలయ ప్రతిష్ట పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మూడు రోజుల నుంచి గ్రామస్తుల సహాయ సహకారాలతో శివాలయపునఃప్రతిష్ట పూజలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
VSP: మధురవాడ ఐటీ రోడ్డులోని శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పూజలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోజు తెల్లవారుజాము నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని అర్చకులు సుబ్బారావు తెలిపారు. నమకం చమకం – మహన్యాస పూర్వక అభిషేకంతో ప్రారంభమై రుద్రాభిషేకం, అభిషేకాలు, లింగోద్భవ పూజలు ఉంటాయన్నారు. సోమవారం ప్రత్యేక అభిషేకాలు చేశారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ సన్నిధిలో శనివారం భక్తులు నిర్వహించిన వివిధ సేవల ద్వారా రూ. 38,02,281 ఆదాయం వచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు తెలిపారు. ఈ మేరకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులను చెల్లించుకున్నారు. అనంతరం అన్నప్రసాదాలను స్వీకరించారు.
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం వేకువజామున స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ స్వామివారి మూలమూర్తికి సింధూర, ఆకు పూజలు ఘనంగా జరిగాయి. శనివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు.