ATP: రాయదుర్గం పట్టణం మధు సినిమా థియేటర్ సమీపాన వెలసిన మహిమాన్విత దుగ్గిలమ్మ జాతర వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభించారు. వేకువ జామునే అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. స్థానిక భక్తులే కాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని, అమ్మవారికి వేప చీరలతో మొక్కుబడులు తీర్చుకున్నారు.
సత్యసాయి: కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఖాద్రీశునికి వెండిరథ ప్రాకారోత్సవం జరుగుతుంది. ఉదయం ఆరు గంటలకు భక్తులకు దర్శనం కల్పించి, ఏడు గంటలకు స్వర్ణ కవచ, అభిషేక పూజలు ఉంటాయి. ఉదయ 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 వరకు శ్రీవారి సర్వదర్శనం నిర్వహిస్తారు.
కృష్ణా: బాపులపాడులో శ్రీ భ్రమరాంబ సమేత శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం ప్రాంగణంలో నిర్మాణం జరుగుతున్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయానికి దాతలు విరాళాలు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం మండల వెంకట సత్యనారాయణ మూర్తి, లక్ష్మీ రంగనాయకమ్మ దంపతులు రూ.5,09,000 విరాళం ఆలయ కమిటీకి అందించారు. అయ్యప్ప స్వామి వారి కుటుంబాన్ని కాపాడాలని ఆలయ కమిటీ ఆకాంక్షించారు.
TG: ఖైరతాబాద్ మహా గణపతి సిద్ధమైంది. విగ్రహానికి చివరి అంకమైన కన్ను దిద్దడం నేడు పూర్తయింది. 69 అడుగులతో నిర్మించిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి నేత్రాలను శిల్పి రాజేందర్ గీశారు. ఈ సందర్భంగా బడా గణేశ్ ఆగమన్ నిర్వహించారు. డీజేల హోరు, యువత కేరింతల నడుమ గణపతికి ఘనంగా స్వాగతం పలికారు. మరాఠీ బ్యాండ్తో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
కృష్ణా: గన్నవరం మండలంలోని కేసరపల్లి ఆర్సీఎం చర్చిలో ప్రార్థన కార్యక్రమంలో వైఎస్ భారతీ రెడ్డి సోమవారం పాల్గొన్నారు. అనంతరం మదర్ థెరిసా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో లెప్రసీ వ్యాధిగ్రస్తులను పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి అన్ని విధాల సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు.
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలను లెక్కింపు చేసినట్లు ఆలయ ఈవో విజయరాజు తెలిపారు. ఈవో మాట్లాడుతూ.. 70 రోజుల నుంచి కానుకలను లెక్కించగా రూ. 85,74,111 నగదు, అన్న ప్రసాదం ద్వారా రూ. 25,063, బంగారం 39 గ్రాములు, వెండి 2 కేజీల 400 గ్రాములు వచ్చినట్లు తెలిపారు.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. భక్తులు ttdevasthanams.ap.gov.in వైబ్సైట్లో టికెట్లను బుకింగ్ చేసుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు. కాగా, మధ్యాహ్నం 3 గంటలకు అదే నెలకు సంబంధించిన గదుల బుకింగ్ కూడా ప్రారంభం కానుంది.
KKD: ప్రముఖ పుణ్యక్షేత్రం లోవ తపులమ్మతల్లికి ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ. 4,98,249 ఆదాయం సమకూరినట్లు ఈవో విశ్వనాథరాజు తెలిపారు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమ్మవారిని 15 వేల మంది భక్తులు దర్శించుకున్నారని పేర్కొన్నారు. భక్తులు చెల్లించిన కానుకల ద్వారా రూ. 4,98,249ల ఆదాయం వచ్చిందన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయం వద్ద ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
VSP: విశాఖ హరే కృష్ణ మూవ్మెంట్ వ్యవస్థాపకులు ప్రభుపాదుల వారి 129వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విశాఖలోని గంభీరం హరే కృష్ణ వైకుంఠంలో ఆదివారం శ్రీ వ్యాసపూజ సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు తమ ఇళ్లలో 3,930 రకాల వంటకాలను తయారు చేసి, వాటిని రాధా మదన మోహన్ మందిరంలో శ్రీల ప్రభుపాదుల వారికి గురుదక్షిణగా సమర్పించారు.
TG: వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే వినాయక మండపాలు, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉచిత విద్యుత్ సదుపాయం కోసం త్వరలోనే ఒక విధివిధానాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈ నిర్ణయంపై వినాయక మండపాల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే దసరా మహోత్సవాల ఏర్పాట్లను దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్, ఈవో శీనా నాయక్లతో ఆదివారం సమీక్షించారు. వైభవంగా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. త్వరిత దర్శనం, తాగునీరు, అన్నప్రసాదాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విజయదశమి రోజున భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదంగా ఇవ్వనున్నారు.
NTR: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా మూసివేయబడుతుంది. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ప్రధాన ఆలయంతో పాటు అన్ని ఉపాలయాలను మూసివేస్తున్నట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు కవాట బంధనం ఉంటుందని వైదిక కమిటీ ప్రకటించింది. తిరిగి సెప్టెంబర్ 8న ఉదయం 8:30 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించనుంది.
కోనసీమలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆదివారం వివిధ సేవల ద్వారా రూ. 2.50 లక్షలు ఆదాయం లభించిందని ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు. ఉదయం నుంచి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దర్శనం చేసుకున్న భక్తులు అన్న ప్రసాదాలను స్వీకరించారు.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన శాలివాహన కులస్తులు మట్టి విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారు. రోజుకు 200 నుంచి 300 విగ్రహాలను తయారుచేస్తూ, వాటిని హైదరాబాద్, పుణే, రాజమండ్రి, విశాఖపట్నం, ఒడిశా వంటి ప్రాంతాలకు విక్రయిస్తున్నారు. మట్టి విగ్రహాలకు పెరుగుతున్న ఆదరణతో వారి పని పుంజుకుంది.
TG: యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వారాంతపు సెలవుదినం కావడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు ఉదయం నుంచే స్వామి దర్శనానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లు రద్దీగా మారాయి. ఆలయ పురవీధులు, కళ్యాణ కట్ట, పుష్కరిణి, ఘాట్ రోడ్డు పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతోంది.