VKB: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ కేంద్రం వద్ద జరిగిన గొడవలో తాండూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయనకు ఊరట లభించింది. పైలెట్తో పాటు మరో ఏడు మందిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. హైకోర్టు బెయిల్ ద్వారా తాండూరు పోలీసులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
SRPT: ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు నిఘా నీడలో నిర్వహించనున్నామని ఇంటర్మీడియట్ బోర్డ్ జాయింట్ సెక్రటరీ భీమ్ సింగ్ వెల్లడించారు. శుక్రవారం సూర్యాపేటలోని ప్రభుత్వ కళాశాలలో డీఐఈఓ భాను నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సీఎస్డీఓల ఓరియంటేషన్ ప్రోగ్రాంలో పాల్గొని మాట్లాడారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
WNP: నర్సింగయ్యపల్లి డిగ్రీ కళాశాల సమీపంలో శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఎస్సై నరేష్ మానవత్వం చాటుకున్నారు. రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడగా, అంబులెన్స్ అందుబాటులో లేని పరిస్థితిని గమనించిన ఎస్సై తక్షణమే స్పందించారు. క్షణ కాలం కూడా ఆలస్యం చేయకుండా బాధితుడిని తన బైక్ పైనే ఎక్కించుకుని ఆసుపత్రికి తరలించారు.
HYD: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్ను నాంపల్లి కోర్టు మూడోసారి వెనక్కి పంపింది. అల్లు అర్జున్తో సహా 23 మందిని నిందితులుగా పేర్కొన్న ఈ పత్రాల్లో హార్డ్ డిస్కులు, సీడీలు, పెన్ డ్రైవ్లు వంటి కీలక సాంకేతిక ఆధారాలు జతపరచలేదని కోర్టు గుర్తించింది. ఈ సాంకేతిక లోపాలను సరిదిద్దాలని ఆదేశిస్తూ చార్జిషీట్ను రిటర్న్ చేసింది.
KMM: మధిర మండలం సిరిపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు దుంప వెంకటేశ్వర్ రెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. వైద్యులు కే. అప్పారావు ఆధ్వర్యంలో రోగులకు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం కలెక్టర్ సత్య శారద సందర్శించి, పీఎంశ్రీ పథకం కింద మంజూరైన నిధుల వినియోగం, మౌలిక సదుపాయాల అభివృద్ధిని పరిశీలించారు. తరగతి గదులు, వంటశాల, భోజనశాల, సైన్స్ ల్యాబ్, ఏటీఎల్ ల్యాబ్, గ్రంథాలయం, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఉత్తమ విద్యా వాతావరణం కల్పించాలన్నారు.
KNR: శుక్రవారం సభల్లో అంగన్వాడి, వైద్య సిబ్బంది ద్వారా నివేదిక తెప్పించుకుని ప్రజారోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. చొప్పదండి మండలం చాకుంట అంగన్వాడి కేంద్రం ఆవరణలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. తల్లీపిల్లల ఆరోగ్యానికి సరైన పోషణ ఎంతో అవసరమన్నారు.
ADB: కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణతో పని చేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆత్మ కమిటీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సంతోష్ రావును శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. సంతోష్ రావు పనిపట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు.
RR: నందిగామ మండలం తాళ్లగూడ గ్రామంలో హెచ్ఎండీఏ నిధుల ద్వారా రూ.10 లక్షల వ్యయంతో చేపట్టిన అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి మౌలిక వసతులు అత్యంత కీలకమని, సీసీ రోడ్డు, డ్రైనేజ్, రోడ్ల అభివృద్ధి ద్వారా గ్రామ ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుందన్నారు.
BDK: మణుగూరు సింగరేణి ఏరియా పీవీ కాలనీలో నిర్వహించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా ఇవాళ ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, స్వామివారి ఆశీస్సులతో కార్యక్రమం విజయవంతం కావాలని కమిటీ సభ్యులు తెలిపారు.
KMR: కామారెడ్డిలో రాజకీయ వేడి రాజుకుంది. తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి కాంగ్రెస్ నాయకులకు బహిరంగ సవాల్ విసిరారు. కళాశాల ఆస్తుల వ్యవహారంపై నిజానిజాల నిర్ధారణకు శనివారం స్థానిక శిశుమందిర్ పాఠశాల వద్దకు చర్చకు రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత సంస్థల యాజమాన్యాలు కూడా పాల్గొంటాయని పేర్కొన్నారు.
SRCL: జిల్లాలో పీఎంశ్రీ కింద ఎంపిక అయిన స్కూళ్లలో మొదలు పెట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంఛార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. పీఎంశ్రీ కింద ఎంపిక అయిన విద్యాలయాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై జిల్లా సమీకృత కార్యాలయంలో శుక్రవారం జిల్లా విద్యాధికారి, టీజీఈడబ్ల్యూఐడీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వారికి పలు సూచనలు చేశారు.
NLG: చిట్యాల మండలం, ఉరుమడ్ల రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్లకు నిర్వహించిన మొదటి విడత శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో జయలక్ష్మి హాజరై మాట్లాడుతూ శిక్షణను సద్వినియోగం చేసుకొని వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఎంపీఓ కోటేష్, ట్రైనర్ యూసుఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
BHNG: భారతదేశం అంతటా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే, తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో ఆమె మాట్లాడుతూ.. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దౌర్జన్యంతో అనేక మున్సిపాలిటీలో ఛైర్ పర్సన్ సీట్లను కైవసం చేసుకుందన్నారు.
MBNR: దేవరకద్ర మున్సిపాలిటీ నూతన ఛైర్మన్గా దమయంతి గోవర్ధన్ రెడ్డి, వైస్ ఛైర్మన్గా యుగంధర్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హాజరై నూతన పాలకవర్గాన్ని అభినందించారు. పట్టణ సమగ్ర అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.