GDWL: ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందించాలని గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. గురువారం గద్వాల జిల్లాలోని నిర్వహించిన క్రైమ్ రివ్యూలో ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పీఎస్ పరిధిలో ‘విలేజ్ హిస్టరీ షీట్స్’ అప్డేట్ చేయాలని, రాత్రి పూట గస్తీ (నైట్ బీట్) చట్టంపై అవగాహన రావాలని కోరారు.
NZB: బాసర త్రిపుల్ ఐటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విమర్శించారు. గురువారం సాయంత్రం నిజామాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని, తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
NLG: నల్గొండ-సాగర్ రోడ్లోని లింగోటం వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును టాటా ఏస్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పులిమామిడి గ్రామ కార్యదర్శి మోహన్ రావు అలియాస్ మనోహర్ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. విధులకు వెళుతున్న ఆయనను టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన స్వగ్రామం పజ్జురుగా తెలుస్తుంది.
BHPL: రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్ఎంసీ) ప్రవేశ పరీక్షలో జయకేతనం ఎగురవేసి భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం బౌసింగ్ పల్లికి చెందిన చిందం సౌమ్య సత్తా చాటారు. దక్షిణ భారతదేశం నుంచే ఈ ఘనత సాధించిన ఏకైక బాలికగా ఆమె రికార్డు సృష్టించారు. భవిష్యత్తులో ఆర్మీలో ఉన్నత అధికారిణిగా సేవలు అందించడమే తన లక్ష్యమని సౌమ్య పేర్కొన్నారు.
NRPT: ధన్వాడ మండలంలోని మందిపల్లి స్టేజ్ వద్ద బస్సు షెల్టర్ను సర్పంచ్ సురేందర్ రెడ్డి సొంత నిధులు రూ.20 వేలతో మరమ్మతులు చేయించారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గోడలకు రంగులు వేయించి, కూర్చునేందుకు సౌకర్యాలు కల్పించారు. షెల్టర్ ఇప్పుడు సరికొత్తగా మారింది. సర్పంచ్ చొరవపై గ్రామస్తులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
BHPL: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఎన్పీడీసీఎల్ వాట్సాప్ సేవలను ప్రారంభించినట్లు జిల్లా ఎస్ఈ మల్సూర్ నాయక్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల వినియోగదారులు సులభంగా ఫిర్యాదు చేయేందుకు 7901628348 నంబర్ను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఈ నంబర్కు ‘Hi’ అని మెసేజ్ పంపితే ఫిర్యాదు నమోదు, ఏజెంట్తో చాట్ వంటి సేవలను పొందవచ్చని వివరించారు
ADB: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ఇవాళ ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో పర్యటించనున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ప్రధాన సమస్యలైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పోడు భూముల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా గిరిజన గ్రామాల్లో అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
KNR: సైదాపూర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ దుస్స కుమార్ రాష్ట్ర ఉప సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శిగా గురువారం నియామకం అయ్యారు. హైదరాబాద్లో సంఘం అధ్యక్షుడు రాములు నాయక్, ఉపాధ్యక్షుడు కార్తీక్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన కమిటీకి కృతజ్ఞతలు తెలిపిన కుమార్.. ఉప సర్పంచుల బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
BDK: భద్రాద్రి రామనవమి వేడుకలు ఈసారి జిల్లా ఉన్నతాధికారులకు సవాల్గా మారనున్నాయి. బాధ్యతలు చేపట్టిన తర్వాత కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్కు ఇదే తొలి కళ్యాణ వేడుక. వీరితో పాటు EO దామోదర్రావు తొలిసారిగా ఈ వేడుకలను పర్యవేక్షించనున్నారు. 2019 బ్యాచ్కు చెందిన కలెక్టర్ అంకిత్ ఇప్పటికే ఏర్పాట్లపై దృష్టి సారించారు.
SDPT: ఫోరం ఆఫ్ ఫిజికల్ సైన్స్ నిర్వహించిన రాష్ట్రస్థాయి భౌతిక రసాయన శాస్త్ర ప్రతిభా పరీక్షలో పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ జక్కాపూర్ విద్యార్థి అశ్విత్ రెడ్డి సత్తా చాటాడు. 33 జిల్లాల నుంచి సుమారు 100 మంది పాల్గొన్న ఈ పోటీలో 9వ తరగతి చదువుతున్న అశ్విత్ 50కి 35 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు కైవసం చేసుకున్నాడు.
MDCL: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లంపేట్ గ్రామంలో అర్ధరాత్రి దారుణం జరిగింది. ఇంటి బయటకు వచ్చిన ఇమ్రాన్ (27) అనే వ్యక్తిపై బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా దాడి చేశారు. ఈ క్రమంలో నిందితులు ఇమ్రాన్ కడుపులో కత్తితో పొడవడంతో ఆయనకు తీవ్ర రక్తస్రావమైంది. బాధితుడిని వెంటనే చికిత్స నిమిత్తం నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సింది.
SRD: జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ముఖ్యంగా రోడ్డుపై పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
HYD: నగరంలోని మణికొండ సమీపంలో ఉన్న మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో ప్రకృతి ప్రేమికుల కోసం తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(TGFDC)ప్రత్యేక ‘రాక్ బే నేచర్ క్యాంప్’ ఆఫర్ చేస్తోంది. ఫిబ్రవరి 28 సాయంత్రం నుంచి మార్చి 1 ఉదయం వరకు జరిగే ఈ క్యాంప్లో ట్రెకింగ్, క్యాంప్ ఫైర్, బర్డ్ వాచింగ్ వంటివి ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులు నిపుణులతో కలిసి పక్షుల లోకాన్ని చూడొచ్చు.
జోగులాంబ గద్వాల జిల్లా తెలుగు టీచర్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో కొండాపురం ZPHSలో మండల స్థాయి తెలుగు ప్రతిభా పోటీలు నిర్వహించారు. దస్తూరి పోటీల్లో అనూష శ్రీ, సంగీత ప్రతిభ కనబరిచారు. పద్య పఠనంలో నందిని, పవిత్ర మెప్పించారు. తెలుగు ప్రతిభా పరీక్షలో రాఘవేంద్ర ప్రథమ స్థానం సాధించారు. విజేతలను నిర్వాహకులు అభినందించారు.
మహబూబ్నగర్ జిల్లాలోని 11వ డివిజన్ పరిధిలోని బండమీదిపల్లి, వడ్డెర బస్తీల్లో నూతనంగా ఏర్పాటు చేసిన బోరు బావిని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి (MSR) ప్రారంభించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రాధాన్యతని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 30వ డివిజన్ కార్పొరేటర్ గిరి గౌడ్, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు.