MDK: హైదరాబాద్లోని డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు. ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు సాగే ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ అమలుపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ నివేదికను సమర్పించారు.
BDK: హోలీ పండుగ పూట మణుగూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. మల్లేపల్లి వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని పద్మగూడెం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఎస్సై శ్రావణ్ కుమార్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక జాలర్లు, గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.
నిజామాబాద్ జిల్లాలోనీ బోధన్ పట్టణంలోని 16వ వార్డులో చిన్నారులు వినూత్నంగా హోలీ సంబరాలు జరుపుకుని అందరినీ ఆకట్టుకున్నారు. పిల్లలు ప్రత్యేకంగా ట్రాక్టర్లో నీటిని నింపి, అందులో రంగులు కలిపి వీధుల గుండా తిరుగుతూ ఆనందంగా హోలీ పండుగను జరుపుకున్నారు. వారి ఈ వినూత్న ఆలోచన స్థానికులను ఆకర్షించడంతో పాటు పండుగకు ప్రత్యేక వాతావరణాన్ని తీసుకొచ్చింది.
BDK: జిల్లా గిరిజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. ప్రవేశాలకు ఎంపిక జిల్లా స్థాయిలో ఈ నెల 16 నుంచి 18 వరకు, అటు తుది ఎంపికలు భద్రాద్రి, ఖమ్మం జిల్లా స్థాయిలో ఈ నెల 28 నుంచి 30 వరకు జరుగుతాయన్నారు. ఆసక్తి గలవారు ధరఖాస్తు చేసుకోవాలన్నారు.
VKB: బొంరాస్పేట మండల వ్యాప్తంగా 35 గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు జీపీ కార్మికులు తెలిపారు. కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోయారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వేతనాలు విడుదల అయ్యేలా చొరవ చూపాలని కోరుతున్నారు.
MHBD: పెద్దముప్పారం గ్రామంలోని ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుని రైతులు వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని క్లస్టర్ AEO ఉదయ్ కిరణ్ హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ చేయకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రైతు సంక్షేమ పథకాలకు అర్హత పొందలేరని స్పష్టం చేశారు. రైతులు తగిన ధృవపత్రాలతో AEO కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
JGL: మల్యాల నుంచి సర్వాపూర్కు వెళ్లే ప్రధాన రహదారిలో గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ప్రారంభించిన రహదారి పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో, రోడ్డుపై వేసిన కంకర తేలి దుమ్ము ధూళి రేగుతోంది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలు జారి ప్రమాదాలకు గురవడమే కాకుండా, కంకర వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
KMM: గత కొన్ని రోజులుగా దుబాయ్లో చిక్కుకుపోయిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తిరిగి హైదరాబాద్ వచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దుబాయ్లో బ్రెయిన్ స్ట్రోక్కు గురైన తన అల్లుడు కళ్యాణ్ శేఖర్ను పరామర్శించేందుకు వెళ్లిన ఆయన, అక్కడ యుద్ధం నేపథ్యంలో విమాన సర్వీసులు రద్దు కావడంతో నిలిచిపోయారు.
SRPT: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా గుండెపంగు రమేష్ నియమితులయ్యారు. ఇవాళ కోదాడలో నిర్వహించిన సమావేశంలో ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చీమ శ్రీనివాస్ రావు ఈ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. నాడు జైలు జీవితం గడిపిన తనను గుర్తించి బాధ్యత ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
PDPL: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు డీసీపీ రామ్ రెడ్డి గోదావరి పుష్కర ఘాట్ల ఏర్పాట్లు పరిశీలించారు. ఎల్లంపల్లి, గోలివాడ, గోదావరి బ్రిడ్జ్ ప్రాంతాల్లో భద్రత, బ్యారికేడింగ్, సీసీ కెమెరాలు, ట్రాఫిక్ మళ్లింపులపై సూచనలు చేశారు. మహిళలు, వృద్ధులకు ఇబ్బందులు లేకుండా సమగ్ర ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు.
NZB: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన ముగ్గురికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హైమద్ మొయినుద్దీన్ తీర్పునిచ్చారు. వీరితో పాటు మరో 10 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం లక్ష రూపాయల జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు.
HNK: గడ్డి మందు సైనైడ్ కంటే ప్రమాదకరం అని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య అన్నారు. ప్రాణాంతకమైన గడ్డి మందును వెంటనే నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఎంపీ పాల్గొన్నారు. గడ్డి మందు నిషేధంపై కేంద్ర మంత్రులను కలుస్తానని, గడ్డి మందు రద్దు వరకూ నా పోరాటం కొనసాగిస్తానని ఎంపీ చెప్పారు.
KMM: వైరా మున్సిపాలిటీ 8 వార్డు సీనియర్ టీడీపీ నాయకులు రామారావు తనయుడు అశోక్ మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అశోక్ భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
MBNR: మిడ్జిల్ మండలం చిల్వేర్ గ్రామ సమీపంలోని దుందుభి వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా కొనసాగుతుందని రైతులు తెలిపారు. వాగు నుంచి ఒకచోట ఇసుక డంపు చేసి రాత్రి వేళలో టిప్పర్ ద్వారా ఇసుకను ఇతర ప్రాంతాలకు గుట్టు చప్పుడు కాకుండా తరలించి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. ఎంత జరుగుతున్న పోలీస్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
NZB: ఎడపల్లి మండలం సరయు ఫంక్షన్ హాల్ వద్ద మంగళవారం సాయంత్రం రెండు బైకులు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎడపల్లికి చెందిన బాలయ్య, ఎరాజ్పల్లికి చెందిన నారాయణ ఒకరినొకరు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది గంగామణి, అనిల్ వెంటనే స్పందించి క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.