SRCL: ఇల్లంతకుంట మండల కేంద్రంలో LM–6 కాల్వ పనుల కోసం 16వ రోజు దీక్ష కొనసాగిస్తున్న బాధిత రైతులు బుధవారం బిక్షాటనకు దిగారు. పెద్దలింగపూర్ నుంచి ట్రాక్టర్లపై వచ్చిన రైతులు, సర్పంచులు, మహిళలు దుకాణదారుల వద్ద సహాయం కోరారు. కాల్వ పూర్తి చేయడానికి రూ.3.20 కోట్లు అవసరమని, నిధులు విడుదలయ్యే వరకు పోరాటం ఆపబోమని వారు స్పష్టం చేశారు.
PDPL: పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. ప్రజాసేవకు ఆకర్షితులై జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు 100 మందికి పైగా బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. శివపల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
GNTR: తాడేపల్లి పరిధిలోని పెనుమాకలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ‘రాధే’ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ఎస్.వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. ఇతని వెనుక మంగళగిరికి చెందిన దిలీప్, శ్రీకాంత్ ఉన్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి రూ.10,200 నగదు, ఫోన్పేలో ఉన్న రూ.49 వేలు స్వాధీనం చేసుకున్నారు.
కృష్ణా: గుడివాడ పొట్టి శ్రీరాములు హై స్కూల్ విద్యార్థులకు సీఐ హనీశ్ కుమార్, శక్తి టీం సభ్యులతో కలిసి చట్టాలపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే చట్టాల పట్ల, సామాజిక అంశాల పట్ల అవగాహన కలిగి ఉంటే ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవచ్చని తెలిపారు. ఏదైనా ఆపద కలిగినప్పుడు 112 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు.
తూ.గో: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జడ్జ్ ఎన్.శ్రీలక్ష్మీ రాజమండ్రిలోని మనసా మానసిక చికిత్స కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. మానసిక చికిత్స విభాగంలో చికిత్స పొందుతున్న వారి వివరాలు, అందుతున్న వైద్య సదుపాయాలు తెలుసుకున్నారు. మానసిక రుగ్మతల నుండి పూర్తిగా ఉపశమనం పొందిన వారిని తిరిగి వారి కుటుంబ సభ్యులతో కలిపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
MHBD: తొర్రూరు పట్టణంలో తమ అధికారిక కార్యక్రమాలు ముగించుకుని బుధవారం పాలకుర్తి వైపు ప్రయాణిస్తుండగా వెలికట్టే గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించారు. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న దంపతులు కిందపడడంతో గాయాలపాలయ్యారు. వెంటనే వాహనం ఆపించి సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే యశస్విని గాయపడిన వారిని పరామర్శించి, వారిని ఆసుపత్రికి తరలించారు.
కోనసీమ: అంబాజీపేట మండలం నందంపూడికి చెందిన నేదునూరి జనార్ధనరావు (55) బుధవారం కరెంటు షాక్తో మరణించారు. కొబ్బరి దింపు తీసేందుకు చెట్టు ఎక్కుతుండగా కరెంటు తీగలపై పడిన ఎండుటాకు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. షాక్కు గురై ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని గ్రామస్థులు కిందికి దించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీసా’. ఈ చిత్రానికి ఉద్భవ్ రఘు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా మేకర్స్ ‘అనగ అనగ అమెరికా’ అనే ఫస్ట్ సింగిల్ను ఈనెల 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మూవీకి ‘బేబీ’ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో గౌరీ ప్రియ, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
నెల్లూరు: సర్వేపల్లిలో హైవే పక్కన రూ. 100కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని MLA సోమిరెడ్డి కోరారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘సర్వేపల్లిలో గత ఐదేళ్లు చాలా ఘోరాలు జరిగాయి. MSME పార్కు పేరుతో 50 ఎకరాలు, సూరాయపాలెంలో 30 ఎకరాలు, కొమ్మలపూడిలో 19 ఎకరాల భూమిలో స్కామ్ జరిగింది. దీనిపై ఏమైనా చర్యలు మొదలె పెడితే కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంటున్నారు’ అని అన్నారు.
TPT: కోమటిగుంటలో సిమెంట్ ఇటుకల పరిశ్రమ నుంచి వస్తున్న దుమ్ము, రసాయన వ్యర్థాల వల్ల కాలుష్యం పెరిగిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. పరిశ్రమను మూసివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు చేరుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
MDCL: మేడ్చల్ సర్కిల్ పరిధిలో నీటి ట్యాంకర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రోజుకు దాదాపు 15 ట్యాంకర్ల వరకు సరఫరా జరుగుతున్నట్లు సమాచారం. ఒక్కో ట్యాంకర్కు రూ.600 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. వేసవి తీవ్రత పెరగడంతో భూగర్భజలాల కొరత స్పష్టమవుతోంది.
RR: కుమ్మెర మల్లన్న జాతరలో మృతి చెందిన రెండు నెలల పసిపాప కుటుంబాన్ని షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండల రజక సంఘం నేతలు కలిసి మద్దతు తెలుపుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిందితులకు కఠిన శిక్ష అమలు చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో శివశంకర్, బాల్ రాజ్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
HNK: ESI ఆసుపత్రిని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాకు త్వరలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మెగా టెక్స్టైల్ పార్క్, విమానాశ్రయం వంటి మూడు ప్రధాన ప్రాజెక్టులు రానున్న నేపథ్యంలో కార్మికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని, ఆసుపత్రిలో పేషెంట్లకు నాణ్యమైన సేవలను అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డాక్టర్లకు ఎంపీ సూచించారు.
BDK: మణుగూరు పీవీ కాలనీలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 11వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ప్రాంత అభివృద్ధి కోసం ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.
నాగ చైతన్య, మీనాక్షి చౌదరి కలయికలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఫిల్మ్ ‘వృషకర్మ’. ‘విరూపాక్ష’ చిత్రంతో హిట్ అందుకున్న కార్తీక్ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ గ్లింప్స్ మార్చి 5న విడుదల చేయనున్నట్లు తెలుపుతూ.. మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ను విడుదల చేశారు. చైతన్య ఇందులో నిధి అన్వేషకుడిగా కనిపిస్తుండగా, మీనాక్షి చౌదరి ఆర్కియాలజిస్ట్గా నటిస్తోంది.