GDWL: భర్త బతికుండగానే వితంతు పింఛన్ పొందుతున్నారనే ఆరోపణలతో గద్వాల 36వ వార్డు కౌన్సిలర్ సునీతపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో తన పింఛన్ రద్దు చేయాలని ఆమె కోరడంతో ఈ విషయం బయటపడ్డట్లు తెలుస్తోంది. అయితే, తనకు చదువు రాకపోవడం వల్ల అది ఏ పింఛనో తెలియదని, కేవలం తన ఖాతాలో రూ.2 వేలు జమ అయ్యేవని సునీత వివరణ ఇచ్చారు.
MBNR: మిడ్జిల్ మండలం వేములలో నిర్మిస్తున్న లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. మంగళగడ్డ గ్రామపంచాయతీకి చెందిన భాస్కర్ నాయక్ తన దాతృత్వాన్ని చాటుకుంటూ ఆలయ నిర్మాణానికి రూ.1,50,000 విరాళాన్ని మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, ఆలయ కమిటీ ఛైర్మన్ జంగయ్య ఆయనను అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.
VSP: విశాఖలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు జీవీఎంసీ ‘ప్రాజెక్టు సారథి’ని అమల్లోకి తెచ్చింది. 101 సిగ్నళ్లను సిటీ ఆపరేషన్ సెంటర్కు అనుసంధానిస్తూ అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ను ప్రవేశపెడుతున్నారు. 90 కీలక జంక్షన్లలో ఏఐ ఆధారిత ఐటీఎంఎస్ ఏర్పాటు చేసి హెల్మెట్ లేకపోవడం, సిగ్నల్ జంప్ వంటి ఉల్లంఘనలను గుర్తించి ఆటోమేటిక్గా చలానాలు పంపించనున్నాయి.
KDP: ప్రొద్దుటూరు రాజీవ్ గాంధీ నేషనల్ ఏకో పార్క్, రిజర్వ్ ఫారెస్ట్ పరిరక్షణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కడపలో జరిగిన అటవీ పరిరక్షణ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని జాతీయ పార్కు, రక్షిత అడవి, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల చుట్టూ ఏకో-సెన్సిటివ్ జోన్ అమలుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు.
KMM: వెలుగుమట్ల భూదాన్ భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నట్లు అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు. భూదాన్ యజ్ఞ బోర్డు ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను తొలగించామన్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మినహాయించిన నిర్మాణాలు మినహా మిగిలిన 308 మంది ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. బాధితుల సామాగ్రిని అంబేద్కర్ భవనంలో భద్రపరిచామన్నారు.
కృష్ణా: నందివాడ విద్యుత్తు సబ్స్టేషన్ పరిధిలో బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు విద్యుత్తు శాఖ అధికారులు తెలిపారు. నూతన ఆర్డీఎస్ఎస్ విద్యుత్తు లైన్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు తుమ్మలపల్లి, తమిరిశ గ్రామాలతో పాటు నందివాడ ప్రాంతంలో సరఫరా ఉండదని వెల్లడించారు.
ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన ప్రసిద్ధ శ్రీ స్వయంభు జంబుకేశ్వరుడు బెల్లం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చాడు. బుధవారం వేకువ జామునే స్వామి మూల విరాట్కు పంచామృత, రుద్రాభిషేకం వివిధ అభిషేకాలు చేపట్టి బెల్లంతో విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. స్వామివారి విశేష అలంకరణను భక్తులు దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు.
WNP: కుమ్మెరలో జరిగిన దాడిలో మరణించిన బేబీ మౌనిక ఆత్మకు శాంతి చేకూరాలని వనపర్తి పట్టణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ చౌరస్తాలో నాయకులు మాట్లాడుతూ.. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకుడు తిరుమలేశ్ పాల్గొన్నారు.
NDL: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సునీల్ షౌరాణ్ పోలీసు అధికారులతో మంగళవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులు, నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు తీరుతెన్నులు, వాటి పురోగతిపై సంబంధిత పోలీస్ అధికారులతో ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రకాశం: మార్కాపురం జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో, ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ.. దాదాపు 1200 మంది పోలీసు సిబ్బందితో పకడ్బందీ బందోబస్త్ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాస్లు ఉన్నవారు మాత్రమే సీఎం కార్యక్రమంలో పాల్గొనాలని, పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
NGKL: జిల్లాలో నేటి నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ALL THE BEST చెప్పారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని, ప్రతి ఒక్కరు పరిక్ష రాయాలని సూచించారు. జిల్లాలోని ఇంటర్మీడియట్ సెంటర్లలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.
KMR: కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీఎస్కేసీ, ఫీజికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో బహుళజాతి కంపెనీలు మంగళవారం నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 12 మంది విద్యార్థులు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఇవాళ తీవ్ర పోటీ ప్రపంచంలో బహుళజాతి సంస్థలు స్వయంగా గ్రామీణ ప్రాంతాలకు రావడం శుభ సూచకమన్నారు.
AKP: కొత్తకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు ర్యాంపు, వీల్ఫైర్ వంటి మౌలిక సదుపాయాలు లేక తీవ్ర అవస్థలు ఎదురయ్యాయి. తోటకూరపాలెం నుంచి 20 కి.మీ. దూరం ప్రయాణించి వచ్చిన గూనూరు ఆదిలక్ష్మిని ఆమె తల్లి వెంకటలక్ష్మి ఎత్తుకొని పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లారు. మెట్లు ఎక్కాల్సి రావడంతో మరింత ఇబ్బంది పడింది.
JGL: బీర్పూర్ సెక్షన్ పరిధిలోని కొల్వాయి సబ్ స్టేషన్లో 2 నూతన అదనపు 11కేవీ బ్రేకర్లను జగిత్యాల సూపరింటెండింగ్ ఇంజనీర్ సుదర్శనం మంగళవారం ప్రారంభించారు. నిరంతర విద్యుత్ సరఫరా, అభివృద్ధి పనుల్లో భాగంగా అంతరాయం సమస్యకు పరిష్కారం చేపట్టామన్నారు. దీనిపట్ల గ్రామాల విద్యుత్ వినయోగదారులు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో డీఈ, ఏడిఈ, ఏఈ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
BHNG: బీబీనగర్ నుంచి నడికుడికి రైలు మార్గం రెండవ లైన్ కోసం భూసేకరణ చేపట్టనున్నట్లు భువనగిరి RDO కృష్ణ రెడ్డి తెలిపారు. భూసేకరణ కార్యక్రమంలో భాగంగా భువనగిరి మండలంలోని పగిడిపల్లి, అనాజిపురం, నందనం, బొమ్మాయిపల్లి, నాగిరెడ్డిపల్లి, బొల్లెపల్లి గ్రామాలలో క్షేత్రస్థాయి పరిశీల చేసి రైతుల భూముల వివరాలను సేకరించినట్లు తెలిపారు.