NLR: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్గా రవి జోసెఫ్ నియమితులైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గత జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ATP: మిర్చి పంట దొంగతనాలను అరికట్టేందుకు విడపనకల్లు మండల పోలీసులు గ్రామసభల ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. CI మహనంది, ఎస్సై ఖాజా మొహిద్దీన్ పొలాల్లో పర్యటించి భద్రతా చర్యలు సూచించారు. పంట రాశుల వద్ద రాత్రిపూట కనీసం ఇద్దరు వ్యక్తులు కాపలా ఉండాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100, 112కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
GNTR: కొల్లిపర మండలం తూములూరు అడ్డరోడ్డు సెంటర్లో శుక్రవారం రాత్రి పేకాడుతున్న ఏడుగురు జూదరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి నిందితుల వద్ద నుంచి రూ. 4,300 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కోనసీమ: ఐ. పోలవరం మండలం మురముళ్ళ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని అమలాపురం ఏఈ రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఐ.పోలవరం, తిలకుప్ప, కొమరిగిరి, కేసనకుర్రు, టి.కొత్తపల్లి, జి.వేమవరం గ్రామాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుంది అని తెలిపారు.
సత్యసాయి: భారత జనగణన–2027 నిర్వహణపై శుక్రవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కె. విజయానంద్ సమీక్ష నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఈ సమావేశానికి హాజరై జిల్లాలోని సన్నద్ధతపై వివరాలు సమర్పించారు. ఎన్యూమరేటర్ల అవసరాల అంచనా, మాస్టర్ ట్రైనర్ల ఎంపిక, అధికారులకు శిక్షణ ఏర్పాట్లు వంటి కీలక అంశాలపై చర్చించారు.
ATP: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో శుక్రవారం పది మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. హిందూపురం బాలయేసు కళాశాలలో ఒకరు, బాలాజీ విద్యామందిర్లో ముగ్గురు, కళ్యాణదుర్గం జ్యోతిర్మయి కళాశాలలో ఐదుగురు, అనంతపురం చైతన్య కళాశాలలో ఒకరిపై చర్యలు తీసుకున్నట్లు పరీక్షల విభాగం డైరెక్టర్ ఆచార్య రమణ తెలిపారు.
PDPL: రామగుండం MLA MS రాజ్ ఠాకూర్, మనాలి దంపతులు, కుటుంబ సభ్యులు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి సన్నిధిలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు MLA తెలిపారు. ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. MLA వెంట ఆయన సన్నిహితులు ఉన్నారు.
ASF: రెబ్బెన మండలంలో శుక్రవారం రాత్రి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. కాగజ్ నగర్ X రోడ్ వద్ద బైక్ను అతివేగంగా నడిపిన ఏ.అంజిరెడ్డిపై కేసు నమోదు చేశారు. అలాగే రెబ్బెన PHC సమీపంలో బైక్పై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ నిర్లక్ష్యంగా వెళ్తున్న పోగుల శ్రీకాంత్పై కూడా చర్యలు తీసుకున్నామని SI వెంకటకృష్ణ తెలిపారు. ట్రిపుల్ రైడింగ్ చట్ట విరుద్ధమన్నారు.
WGL: నెక్కొండ మండల పరిధిలో పని చేస్తున్న ఇద్దరు ఎస్జీటీ ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ డీఈవో రంగయ్య శుక్రవారం ఉత్తర్వులు జరీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరవుతున్న అంకం ప్రవీణ్ కుమార్, రామారపు రవి సస్పెండ్ అయ్యారు. ప్రవీణ్ కుమార్ అజ్మీర మంగ్యా తండా MPPS, రవి గొట్లకొండ MPPSలలో ఎస్జీటీలుగా విధులు నిర్వహిస్తున్నారు.
అనకాపల్లి పట్టణం గవరపాలెంలో వేంచేసియున్న నూకాంబిక అమ్మవారికి విశాఖ నగరం చిన్న వాల్తేరుకు చెందిన పల్లా వెంకట చంద్రశేఖర్ శుక్రవారం 40 గ్రాముల బరువు గల రెండు బంగారు మంగళసూత్రాలు వితరణగా అందజేశారు. వీటిని అమ్మవారి సన్నిధిలో ఉంచి పూజలు చేశారు. అనంతరం ఆలయ ఛైర్మన్ పీలా నాగ శ్రీను, ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శి వై.శ్రీధర్కు వాటిని అందజేశారు.
JGL: మైనార్టీ ఈ స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జగిత్యాల జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఆర్ఎస్ చిత్రు తెలిపారు. తుర్క కాశి ముస్లిం వర్గానికి టూల్ కిట్లు, జనరేటర్ల పంపిణీ, మైనార్టీ యువతకు ఈ-స్కూటర్ల పంపిణీ పథకానికి ఈనెల 20 నుంచి మార్చి 1 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.
MBNR: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ తెలుగు సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సమాన అవకాశాలు, సహకారం లభించినప్పుడే సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్వో)గా డాక్టర్ దుర్గా రామ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ రవీందర్ నాయక్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కూకట్పల్లి డీఎంహెచ్వోగా విధులు నిర్వహిస్తున్న దుర్గా రామ్ కుమార్ కామారెడ్డి జిల్లాకు బదిలీపై రానున్నారు.
GDWL: జిల్లాలో పెండింగ్ ఉన్న భూభారతి దరఖాస్తులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం IDOC కార్యాలయంలో తహసీల్దార్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం RDO స్థాయిలో 1370 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, త్వరగా క్లియర్ చేయాలని సూచించారు.
SRCL: కొనరావుపేట మండలం కొండాపూర్ మూల వాగులో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం మూల వాగులో తాళ్లపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ట్రాక్టర్లో ఇసుక నింపుకొని వాగులో నుంచి బయటకు వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.