PLD: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 25న మాచర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువత కోసం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తమ్మాజి రావు, ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస రావు శుక్రవారం తెలిపారు.
KDP: పోరుమామిళ్ల మండలం పులివీడు గ్రామంలో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. బైకుపై వెళ్తున్న మహిళ మెడలో ఉన్న సుమారు 22 గ్రాముల బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. దీంతో సమాచారం అందుకున్న పోరుమామిళ్ల పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
NGKL: కొల్లాపూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించింది. మున్సిపల్ ఛైర్ పర్సన్ రెడ్డి జ్యోతి సత్యనారాయణ, వైస్ ఛైర్మన్గా షేక్ రహీం పాషా బాధ్యతలు చేపట్టారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది నూతన పాలకవర్గాన్ని ఘనంగా సత్కరించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో కొల్లాపూర్ను అభివృద్ధి చేస్తామని తెలిపారు.
SRD: సదాశివపేట మున్సిపల్ ఛైర్మన్ అంజమ్మ ఆధ్వర్యంలో టీజీఐఐసీ నిర్మల రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రావీణ్యను శుక్రవారం కలిశారు. నూతనంగా గెలిచిన కౌన్సిల్ సభ్యులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు.
MNCL: ఈ నెల 17న హైదారాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి దివ్యాంగ విద్యార్థుల క్రీడా పోటీలలో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఈ సందర్భంగా శుక్రవారం భవిత కేంద్రంలో డీఈవో యాదయ్య విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగ చిన్నారుల విజయాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అన్నారు.
NDL: ప్రముఖ పుణ్యక్షేత్రం ఎగువ అహోబిలం స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో శుక్రవారం సాయంత్రం నుంచి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన అర్చకులు కీడాంబి వేణుగోపాల్ స్వామి ఆధ్వర్యంలో అంకురార్పణతో వేడుకలకు శ్రీకారం చుట్టారు. అనంతరం సెల్వార్ కూత్ ఉత్సవం నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
BDK: ఈనెల 22వ తేదీ వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పొడి వాతావరణ ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 23 నుంచి 25వ తేదీల్లో జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పారు. పగటి ఉష్ణోగ్రత 34°C నుంచి 36°C ఉంటుందని తెలిపారు. చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నందున రైతులు పంట తడవకుండా టార్పాలిన్ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.
WGL: నెక్కొండ(M) కేంద్రంలోని అక్కల్ చెడు GPలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుందని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వలన గ్రామాల్లో అభివృద్ధి నోచుకోలేదని విమర్శించారు. అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
BDK: కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న దివ్యాంగుల వైకల్యం నిర్ధారణ సదరం క్యాంపును శుక్రవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంపులో నిర్వహిస్తున్న దివ్యాంగుల వైద్య పరీక్షలు, ఆన్లైన్ దరఖాస్తుల నమోదు విధానాన్ని ఆమె ప్రత్యక్షంగా పరిశీలించారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
GNTR: నల్లపాడు GDCC బ్యాంక్లో నిధుల దుర్వినియోగం కేసులో వెలిసెల ఏడుకొండలను పోలీసులు గురువారం GT రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. 28 నవంబర్ 2025న నమోదైన కేసులో బ్యాంక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అరెస్టైన నిందితుడిని కోర్టులో హాజరుపరిచి 14 రోజుల రిమాండ్ ఆదేశించారు. మిగతా నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
MBNR: గండీడ్ మండలం లింగాయపల్లి, సల్కర్పేట్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులు గృహప్రవేశం చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. మొదటి విడతకు అభినందనలు తెలిపారు. త్వరలో రెండో విడత మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
కృష్ణా: హనుమాన్ జంక్షన్లో దాతల సహకారంతో రూ.కోటితో నిర్మించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయ భవనాన్ని గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, స్థానికులతో కలిసి దాతలను ఘనంగా సన్మానించారు. ఈ భవనం వల్ల హనుమాన్ జంక్షన్ పరిధిలో పోలీసు సేవలు మరింత వేగవంతంగా అందనున్నాయి.
SDPT: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం సర్పంచుల ఫోరం హుస్నాబాద్ అధ్యక్షుడిగా గాంధీనగర్ గ్రామ సర్పంచ్ పోలు సంపత్ను మండలంలోని 17 గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సంపత్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సర్పంచులకు ఏ సమస్య ఉన్నా ముందుండి మరి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
JGL: కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలో గల మోడల్ స్కూల్ విద్యార్థులకు మట్టి నమూన పరీక్షపై అవగాహన సదస్సును శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా మండల వ్యవసాయ అధికారిని నాగమణి మట్లాడుతూ.. సేంద్రియ, సహజ వ్యవసాయం నేలలో సరైన ఆరోగ్యంగా పెరుగుతుందన్నారు. రసాయన ఎరువులు వాడకంతో నేలలో సారం తగ్గిపోతుందన్నారు. అలాగే నేలలో జరిగే చర్యల గూర్చి విద్యార్థులకు వివరించారు.
MNCL: మంచిర్యాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలను ఈ నెల 25న ఉదయం 10 గంటలకు వేలం వేయనున్నట్లు ప్రోహిబీషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గురవయ్య తెలిపారు. స్టేషన్ ఆవరణలో నిర్వహించే వేలంలో ఆసక్తి గల వారు పాల్గొనాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.