AKP: అనకాపల్లి పట్టణం లెపర్సీ కాలనీలో 50 మందికి ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్లను నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త పీలా గోవిందు శనివారం పంపిణీ చేశారు. వృద్ధాప్య వితంతు వికలాంగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు సామాజిక పింఛన్లు దోహదపడుతున్నాయని అన్నారు. రేపు ఆదివారం కావడంతో ఒక రోజు ముందే పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
CTR: వెదురుకుప్పం మండలం టీకేఎంపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ శనివారం ఉదయం మొదలైంది. ముఖ్య అతిథిగా జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్ హాజరయ్యారు. లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా నగదు అందజేశారు. చెప్పిన మాట ప్రకారం ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్లు అందజేస్తున్నామని చెప్పారు. ఎంపీడీవో పురుషోత్తం, తహశీల్దార్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
KRNL: ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో ఓడీ, ఏడీసీగా పనిచేస్తున్న ఎంఎల్ రెడ్డి (55) గుండెపోటుతో కన్నుమూశారు. విధుల్లో ఉండగా అస్వస్థతకు గురైన ఆయనను సహచరులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డిపో మేనేజర్ మద్దిలేటి నాయుడు, యూనియన్ నేత ముస్తాక్ అహ్మద్ నివాళులర్పించారు. ఈ ఘటనతో డిపోలో విషాద ఛాయలు అలముకున్నాయి.
సత్యసాయి: ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా శనివారం కదిరి మున్సిపాలిటీలోని 10వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో శనివారం ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి నేరుగా చేరాలన్న స్పష్టమైన లక్ష్యంతో, లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నట్లు తెలిపారు.
ATP: గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా అనంతపురం రైల్వే స్టేషన్లో పోలీసులు శనివారం ఉదయం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్ సాయంతో రైళ్లు, పార్శిల్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. నార్కోటిక్స్ గుర్తింపులో శిక్షణ పొందిన ‘టైగర్’ అనే జాగిలంతో ప్రయాణికుల లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
KDP: జమ్మలమడుగు పెద్దమ్మ తల్లి దేవరకు ఎస్పీ నచికేత్కు ఆహ్వానం అందింది. మార్చి 1వ తేదీన జమ్మలమడుగులో జరిగే దేవర మహోత్సవానికి రావాలని దేవర కమిటీ సభ్యులు ఎస్పీ కార్యాలయంలో ఆయనను కలిసి ఆహ్వానించారు. దాదాపు 17 సంవత్సరాల తర్వాత జరుగుతున్న పెద్దమ్మ తల్లి దేవర వేడుకలు ప్రశాంత వాతావరణంలో వైభవంగా సాగుతున్నాయని కమిటీ సభ్యులు SPకు తెలియజేశారు.
NLR: కోవూరు పంచాయతీ గుమ్మళ్ళదిబ్బలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదివారం పర్యటించనున్నట్లు టీడీపీ మండలాధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పాటూరులో ఏర్పాటు చేసిన చేనేత క్లస్టర్ ద్వారా చేనేత కార్మికులకు సాయంత్రం 4గంటలకు చేనేత ఉపకరణాలు పంపిణీ చేస్తారని వివరించారు.
CTR: పలమనేరు-చిత్తూరు రోడ్డులోని ఓ పాఠశాల వద్ద ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఉన్న కరెంట్ స్తంభాన్ని శుక్రవారం రాత్రి లారీ ఢీకొట్టడంతో విరిగిపోయింది. కేవలం వైర్ల ఆధారంగా పోల్ నిలబడి ఉంది. ఎప్పుడు నేల కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పరిస్థితి గమనించిన స్థానికులు ఎవరూ దగ్గరకు వెళ్లకుండా రాళ్లు పెట్టి, విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించారు.
KRNL: పెద్దకడబూర్ మండలంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ శనివారం పర్యటించారు. దళిత గిరిజనుల సమస్యలను తెలుసుకుని, మాదిగలపై హత్యలు, దాడులు ఆపాలని అయన కోరారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా వినతి పత్రాల కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు, యువత పాల్గొన్నారు.
W.G: పెరవలి మండలం తీపర్రుకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ కోడూరి రాఘవేంద్ర బాబు తన ప్రతిభతో కలెక్టరును ఆకట్టుకున్నారు. చాక్పీస్ పై కలెక్టర్ చదలవాడ నాగరాణి పేరును అద్భుతంగా చెక్కి, శుక్రవారం భీమవరం కలెక్టరేట్లో ఆమెకు అందజేశారు. ఈ కళాఖండాన్ని చూసి విస్మయం చెందిన కలెక్టర్.. రాఘవేంద్ర బాబును ప్రత్యేకంగా అభినందించారు.
TPT: గూడూరు మునిసిపాలిటీలో ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ మొదలైంది. నెల్లటూరు సచివాలయ ఉద్యోగిని వాత్సల్య ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందజేశారు. ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేశామని చెప్పారు. ఇవాళ పింఛన్ తీసుకోని వారికి సోమవారం ఇవ్వనున్నారు.
PLD: నరసరావుపేట క్రిస్టియన్పాలెంలో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో పోలీసులు శనివారం తెల్లవారుజామున ఆకస్మిక కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేసిన పోలీసులు.. రౌడీషీటర్లు, పాత నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 31 బైకులు, 2 ఆటోలతో పాటు కత్తులు, గొడ్డళ్లు వంటి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
CTR: జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ దూడి ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ శ్రీ రాజశేఖర్ పర్యవేక్షణలో జిల్లాలోని గ్రామాలలో “పల్లె నిద్ర” కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసులు గ్రామస్తులతో సంభాషించి ధైర్యం-స్పర్శ, మహిళలు మరియు పిల్లలపై నేరాలు, సైబర్ నేరాల జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, బాల్య వివాహాల నివారణపై మార్గ నిర్దేశం చేశారు.
ప్రకాశం: అర్ధవీడు మండలంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లతోపాటు,గతంలో ఈసీగా విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం మార్కాపురం కార్యాలయంలో ఈసీగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి సస్పెండ్ అయ్యారు. అర్ధవీడులో మొక్కలు లేకుండానే బిల్లులు చేశారని లోకాయుక్తకు ఫిర్యాదు మేరకు, విచారణ చేపట్టిన అధికారులు భారీ అవినీతి బయటపడడంతో వారిని సస్పెండ్ చేశారు
ATP: గుంతకల్లు మున్సిపాలిటీలోని తాగునీటి శుద్ధి కేంద్రాన్ని కమిషనర్ లక్ష్మీదేవి శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. ఆమె తాగునీటి శుద్ధి కేంద్రంలోని యంత్రాల పనితీరు, నీటి నాణ్యత, పారిశుధ్య పరిస్థితులను తనిఖీ చేసి ప్రజలకు నిరంతరం సురక్షితమైన తాగునీరు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. తాగునీటి శుద్ధి ప్రక్రియ సక్రమంగా జరుగుతోందో లేదో చూడాలన్నారు.