భర్త పనిచేసే ఆఫీసుకు వెళ్లి భార్య గొడవ చేసినా, అందరి ముందు విమర్శలు చేసినా అది నేరం, క్రూరత్వమే అవుతుందట. ఈ విషయాన్ని ఛత్తీస్ గఢ్ హైకోర్టు వెల్లడించింది. ఓ విడాకుల కేసులో కింద కోర్టు ఈ మేరకు తీర్పు ఇవ్వడం గమనార్హం.
అసలు మ్యాటర్ లోకి వెళితే…. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం ధంతరి జిల్లాకు చెందిన 32ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగికి 2010 లో రాయ్ పూర్ కు చెందిన ఓ మహిళతో వివాహమైంది. అయితే… ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో.. విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు. ఫ్యామిలీ కోర్టులో… తన భార్య తనను తరచూ వేధిస్తోందని.. కనీసం తన తల్లిదండ్రులను కూడా కలుసుకోనివ్వడం లేదని ఆయన విడాకులను ఆశ్రయించడం గమనార్హం. అతను చెప్పింది విన్న ఫ్యామిలీ కోర్టు.. అతనికి 2019లో విడాకులు మంజూరు చేసింది.
అయితే… ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. అతని భార్య హూకోర్టును ఆశ్రయించింది. ఫ్యామిలీ కోర్టులో తన భర్త తప్పుడు సాక్ష్యాలు చూపించాడని.. ఆ ఉత్తర్వులపై జోక్యం చేసుకోవాలని ఫిటిషన్ దాఖలు చేసింది. అయితే… ఆమె ఆరోపణలను భర్త తోసిపుచ్చాడు. తనకు వివాహేతర సంబంధం భార్య చేసిన తప్పుడు ఆరోపణల కారణంగా తనకు పరువుకు భంగం కలిగిందని ఆ వ్యక్తి న్యాయస్థానానికి తెలిపాడు. అక్కడితో ఆగకుండా తన భార్య ఆఫీసుకు వచ్చి మరీ తనను అసభ్య పదజాలంతో దూషించిందని, తనను మరో చోటుకు బదిలీ చేయించేందుకు ముఖ్యమంత్రికి లేఖ కూడా రాసిందని వాపోయాడు.
ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు… రాయ్ పూర్ ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను సమర్థించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత భర్తకు వివాహేతర సంబంధం ఉందని భార్య చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలింది. ఈ తప్పుడు ఆరోపణలతో ఆ భార్య… భర్త పనిచేసే ఆఫీసుకు వెళ్లి అక్కడ తన సహోద్యోగుల ముందు అతనిని దూషిస్తూ మాట్లాడటం, అతడి పరువు తీసేలా ప్రవర్తించడం క్రూరత్వమే అవుతుంది. భర్త తన తల్లిదండ్రులను కలుసుకోకుండా వేధించడం, అక్రమ సంబంధం నిందలు వేసి అతడిని బదిలీ చేయాలని కోరడం కూడా తీవ్రమైన విషయమే’ అంటూ కోర్టు పేర్కొనడం గమనార్హం.