కోనసీమ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మన్ చింతపల్లి వీరభద్రరావు (78) మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. హాసనాబాద్లో జరిగిన ఆయన అంతిమయాత్రలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని పాడె మోశారు. వీరభద్రరావు మృతి పార్టీకి, ప్రాంతానికి తీరని లోటని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
TPT: తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లె వీధిలో మంగళవారం పట్టపగలే చోరీ జరిగింది. పూల వ్యాపారం చేస్తున్న లీలమ్మ ఉదయం 9 గంటలకు బయట వెళ్లి మధ్యాహ్నం 2 గంటలకు వచ్చారు. తలుపులు బద్దలు కొట్టి ఉండడం చూసి దొంగలు పడ్డట్టు గుర్తించారు. ఇంటి లోపలికి వెళ్లి పరిశీలించగా బీరువాలోని రూ.67 వేలు, 350 గ్రాముల వెండి నగలు కనిపించలేదు.
AKP: గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కసింకోట ఎస్సై లక్ష్మణరావు మంగళవారం తెలిపారు. 2019 డిసెంబర్ నెలలో 165 కిలోల గంజాయి రవాణా చేస్తుండగా పశ్చిమబెంగాల్కు చెందిన డెబాసిన్ ఘెరాయ్ పట్టుపడ్డాడు. బెయిల్ పై బయటకు వచ్చిన నిందితుడు కోర్టుకు హాజరు కావడం లేదు. అతనిపై నాన్ బైబిల్ జారీ కావడంతో పశ్చిమ బెంగాల్ వెళ్లి అరెస్టు చేసారు.
E.G: 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, భక్తులకు అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు మంత్రి దుర్గేష్ మంగళవారం తెలిపారు. మంగళగిరిలో జరిగిన సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లతో పాటు నియోజకవర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి పనుల పురోగతిపై డిప్యూటీ సీఎం సుదీర్ఘంగా చర్చించారని పేర్కొన్నారు.
సత్యసాయి: కనగానపల్లి మండలం శివపురం గ్రామంలో తాగునీటి ఎద్దడి తీర్చేందుకు బోరు బావి తవ్వించారు. తవ్వకాల్లో సమృద్ధిగా నీరు పడటంతో ఎమ్మెల్యే పరిటాల సునీత గ్రామస్థులతో కలిసి గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాగునీటి సమస్య పరిష్కారం కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. రాప్తాడు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
NLR: జిల్లాలో నేడు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే, ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా తల్లిదండ్రులు వారికి ధైర్యం చెప్పాలని జిల్లా ఇంటర్ RIO అధికారి వరప్రసాదరావు సూచించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలలో ఫెయిలైన విద్యార్థులు ఎటువంటి అవమానాలకు లోను కాకుండా ధైర్యంగా ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.
TPT: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి, బయట ATGH వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న మొత్తం 79,426 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 25,889 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.98 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
కడప: రాజంపేట, పులపుత్తూరు గ్రామ అభివృద్ధి బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని TDP నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు మంగళవారం తెలిపారు. అన్నమయ్య డ్యామ్ ఘటనలో నష్టపోయిన గ్రామాన్ని 3 నుంచి 4 నెలల్లో మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తామని, పునరావాస గృహాల నిర్మాణం, రోడ్లు, వీధి దీపాలు, తాగునీటి సదుపాయాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బాధితులను పరామర్శించారు.
W.G: భీమవరంలోని SRKR ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో బుధవారం ఉదయం 10 గంటలకు MSME ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో ఎమ్మెల్యే రామాంజనేయులు, ఏపీఐఐసీ ఛైర్మన్ రామరాజు పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
SKLM: నరసన్నపేట పట్టణంలోని ఎండిఓ కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీను బుధవారం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రారంభించనున్నారు. ఈ మేరకు MLA కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం నుంచి ఈ అన్న క్యాంటిన్ ద్వారా పేద ప్రజలకు రూ.5కే నాణ్యమైన భోజనం అందించనున్నారు. స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
VSP: నక్కపల్లి మండలం వేంపాడు ఆయుర్వేద ఆసుపత్రి వైద్యాధికారి ఆయుర్వేద వైద్యంతో దీర్ఘకాలిక వ్యాధులను నివారించవచ్చని డాక్టర్ కె. రఘు తెలిపారు. మంగళవారం వేంపాడు శివారు గునిపూడిలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రోగులను పరీక్షించి మందులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పేర్రాజు, ఫార్మసిస్ట్ రామకృష్ణ పాల్గొన్నారు
ATP: రాప్తాడు నియోజకవర్గ YCP సోషల్ మీడియా కార్యకర్త గిరీష్ రెడ్డిని కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. రాప్తాడులో ఆయనను అదుపులోకి తీసుకుని కుప్పానికి తరలించినట్లు సమాచారం. గిరీష్ రెడ్డిపై కుప్పం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. అయితే, ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
సత్యసాయి: ధర్మవరం పోతుకుంట ఏరియా ఆసుపత్రిలో శంకర నేత్రాలయ సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ సందర్శించారు. ఇప్పటి వరకు 727 మందికి పరీక్షలు చేసి, 135 మందికి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కులమతాలకు అతీతంగా ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
కృష్ణా: మాజీ సీఎం YS జగన్ను ఆయన నివాసంలో కలిసి శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి శ్రీమన్నారాయణ మహాయజ్ఞానికి ఆహ్వానించారు. కోడూరు మండలం ఉల్లిపాలెంలోని శ్రీమన్నారాయణ స్వామి దేవస్థానంలో రాజగోపుర కుంభప్రోక్షణ సందర్భంగా ఈనెల 19 నుంచి 29 వరకు మహాయజ్ఞం నిర్వహించనున్నట్లు తెలిపారు.
PLD: అమరావతి మండలం దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఈ నెల 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.