VSP: ఏయూ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, సీపీ శంఖబ్రత బాగ్చి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 27న జరిగే కార్యక్రమానికి ప్రముఖులు హాజరుకానుండటంతో భద్రత, వేదిక, గ్యాలరీలు, హెలిప్యాడ్, రూట్ మ్యాప్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అనంతరం అధికారులకు కీలక సూచనలు చేశారు.
GNTR: తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం సాయంత్రం తెనాలి వచ్చిన ఆయన ఆసుపత్రిలోని పలు విభాగాలను సందర్శించి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. ఆస్పత్రిలో అందుతున్న సౌకర్యాలు, వైద్య సేవల గురించి ఆరా తీశారు. సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
TPT: తిరుపతి కలెక్టరేట్లో ‘8వ పోషణ్ పక్షోత్సవాలు’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పిల్లలు, గర్భిణులు, బాలింతలలో పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. పీ.డీ వసంత బాయి తల్లి-శిశు పోషణ ప్రాముఖ్యత వివరించగా, అధికారులు పిల్లల అభివృద్ధి, జంక్ ఫుడ్ దుష్ప్రభావాలు, ఆరోగ్య పరీక్షలపై సూచనలు చేశారు.
PLD: రాష్ట్రంలో పీఎం సూర్య ఘర్ కింద 20 లక్షల కనెక్షన్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. వినుకొండలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో విద్యుత్ కోతలు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టామన్నారు. సోలార్ కోసం బీసీలకు రూ. 98 వేలు, వోసీలకు రూ.78 వేల సబ్సిడీ ఇస్తామని చెప్పుకొచ్చారు.
ప్రకాశం: మర్రిపూడిలో మంగళవారం భూముల రీసర్వే ప్రాజెక్టులో భాగంగా అవగాహన ర్యాలీ తహసీల్దార్ జనార్ధన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బుధవారం నుంచి మండలంలో రీ సర్వే ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో రీ సర్వే పూర్తి అయ్యిందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ వెంకటరెడ్డి, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
BPT: అద్దంకి మున్సిపల్ కార్మికులకు మార్చి నెల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. మంగళవారం అద్దంకి మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఏప్రిల్ 21వ తేదీ వచ్చినా జీతాలు అందకపోవడంతో కార్మికులు నిరసన గళం విప్పారు. మార్చి నెల జీతాలు రాకపోవడంతో కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని సీఐటీయూ మండల కన్వీనర్ తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు.
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శించి, సేవల అమలు, సిబ్బంది హాజరు, ప్రజలకు అందుతున్న సౌకర్యాలపై సమీక్షిస్తున్నారు. లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలని అధికారులకు ఆదేశించారు.
విజయనగరం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు మార్చి నెల వేతనాలు వెంటనే చెల్లించాలని మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కమిషనర్ బాలస్వామికి వినతిపత్రం అందజేశారు. నిధి పోర్టల్ను రద్దు చేసి ప్రభుత్వం నేరుగా జీతాలు చెల్లించాలన్నారు.
VZM: జిల్లాలో కొనసాగుతున్న కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రైల్వే లైన్లు, జాతీయ రహదారుల భూసేకరణ పురోగతిపై కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి మంగళవారం అధికారులతో కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రాజెక్టుల వారీగా పెండింగ్లో ఉన్న అంశాలను పరిశీలించారు. నిర్దేశించిన గడువులోగా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
KDP: ఆహార ప్రాసెసింగ్ రంగంలో పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ నజ్మా పేర్కొన్నారు. మంగళవారం కడపలోని యాంపుల్ ఫుడ్స్ పరిశ్రమకు పులివెందుల, వేంపల్లె ఎస్సీ యువత, మహిళ రైతులను తీసుకెళ్లి, ఆహార ప్రాసెసింగ్ విధానాలు, విలువ జోడింపు ఉత్పత్తుల తయారీ, నిల్వ పద్ధతులు, ప్యా కేజింగ్ పై అవగాహన కల్పించారు.
ATP: అనంతపురంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పేదరిక నిర్మూలన, మౌలిక వసతుల కల్పన, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. బీసీ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
PLD: అచ్చంపేట మండలం మాదిపాడు సత్తెమ్మతల్లి అమ్మవారి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఛైర్మన్గా ఎన్నికైన యర్రంశెట్టి సత్యవతి తదితరులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని, భక్తుల విశ్వాసాలను కాపాడాలని సూచించారు. మాదిపాడు–గుడి రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కృష్ణా: గుడివాడ మండల పరిధిలోని విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు (బుక్ కీపర్)లకు ప్రభుత్వం సమకూర్చిన స్మార్ట్ ఫోన్లను ప్రజా వేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే రాము మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మీరు గ్రామ స్థాయిలో ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రకాశం: నోయిడా కార్మికులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్బంధాన్ని ఖండిస్తూ సింగరాయకొండలో IFTU ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. IFTU రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ మాట్లాడుతూ.. నోయిడా పారిశ్రామిక కారిడార్లు ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నిస్తే 350 మంది కార్మికులను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. వారికి సంఘీభావంగా నిరసన చేసినట్లు తెలిపారు.
NTR: స్మార్ట్ కిచన్ పధకం రద్దు చేసి ప్రస్తుతం నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన ఏజెన్సీలను కొనసాగించాలని మధ్యాహ్న భోజనం జిల్లా కార్యదర్శి సుప్రజ డిమాండ్ చేశారు. ఈ నెల 27న విజయవాడ కలెక్టరేట్ ముట్టడి జయప్రదం చేయాలని మంగళవారం నందిగామ సీఐటీయూ భవనంలో జరిగిన సమావేశంలో ఆమె పిలుపునిచ్చారు.