W.G: ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియను ఈనెల 26లోపు పూర్తి చేస్తామని కమిషనర్ కృష్ణమోహన్ తెలిపారు. 2011 జనాభా లెక్కలు, ఈ ఏడాది జనవరి 1 నాటి ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల సంఖ్యను 20 నుంచి 28కి పెంచినట్లు పేర్కొన్నారు. ప్రతి వార్డులో సుమారు వెయ్యి మంది ఓటర్లు ఉంటారని, త్వరలోనే టౌన్ ప్లానింగ్ అధికారిని నియమించనున్నట్లు ఆయన తెలిపారు.
ATP: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే పరిటాల సునీత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన సహచర ఎమ్మెల్యేలు, టీడీపీ ఎంపీలతో కలిసి ఆయనను కలిసి పలు అంశాలపై ముచ్చటించారు. ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు, ప్రాంతీయ అంశాలపై చర్చ సాగింది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను ఇరువురు నేతలు స్వాగతించారు.
సత్యసాయి: పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ క్రాంతి కుమార్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో జి.శ్రీనివాస్ను కొత్త కమిషనర్గా నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నూతన కమిషనర్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.
ASR: అరకులోయ తహసీల్దార్ కార్యాలయాన్ని ఎస్టీ కమిషన్ సభ్యుడు కిల్లో సాయిరాం గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులను పరిశీలించి, అర్హులైన గిరిజనులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కుమారస్వామికి సూచించారు.
PLD: వెల్దుర్తి, జనాభా గణన-2027లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కోరారు. గురువారం క్యాంపు కార్యాలయంలో స్వయం నమోదు ప్రక్రియలో తన వివరాలు నమోదు చేశారు. ఏప్రిల్ 17–30 వరకు జరిగే ఈ కార్యక్రమంలో మొబైల్ ద్వారా 33 ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాలని సూచించారు. దీంతో సంక్షేమం పారదర్శకంగా అందుతుందని చెప్పుకొచ్చారు.
VSP: సింహాచలం చందనోత్సవం నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు విస్తృతంగా ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. రీజినల్ మేనేజర్ సి.బి. అప్పలనాయుడు ఆధ్వర్యంలో కొండపై ఏర్పాట్లను పరిశీలిస్తూ ట్రాఫిక్, రద్దీ నిర్వహణపై ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చందనోత్సవానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. ఇందులో కలెక్టర్, పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు.
SKLM: రీ-సర్వేలో వచ్చిన సమస్యల పరిష్కారమే ధ్యేయం అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన జలుమూరు మండలం అక్కురాడ పంచాయతీలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో రీ-సర్వే పురోగతి, రికార్డుల నమోదు పై క్షేత్రస్థాయిలో ఆయన సమీక్షించారు. ఇందులో RDO ప్రత్యూష, రెవెన్యూ అధికారులు ఉన్నారు.
పార్వతీపురం ఎంప్లాయిమెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఈనెల 21న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా తెలిపారు. 4 కంపెనీల్లో వివిధ రకాల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. 18 ఏళ్లు పైబడిన స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులని, మొత్తం 250 ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఉదయం 10 గంటలకు GJ కళాశాలలో నిర్వహిస్తామన్నారు.
AKP: కసింకోట మండలం తాళ్లపాలెం పీహెచ్సీ పరిధిలోని కచ్చలపాలెంలో గురువారం 100 ఇళ్లకు దోమల నివారణకు ఏసీఎం 5 శాతం దోమల మందు పిచికారి చేశారు. వైద్యాధికారులు డాక్టర్ రామ్, డాక్టర్ సుమ ఆధ్వర్యంలో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాస్ స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
CTR: 48 గంటల్లో బాలికల మిక్సింగ్ కేసును చేధించినట్లు చిత్తూరు వన్ టౌన్ సీఐ మహేశ్వర గురువారం తెలిపారు. చిత్తూరు కొంగారెడ్డి ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలు ఈనెల 14 నుంచి కనిపించడం లేదని కేసు నమోదు అయింది. సాంకేతిక పరిజ్ఞానంతో ఒంగోలు, గుంటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నట్టు గుర్తించి, వారిని సురక్షితంగా తీసుకువచ్చి అప్పగించినట్టు ఆయన చెప్పారు.
KRNL: కర్నూలు మున్సిపల్ కమిషనర్ పి.విశ్వనాథ్ను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో చల్లా ఓబులేసును నియమిస్తూ జీవో 414 విడుదలైంది. తొమ్మిది నెలలుగా సేవలు అందించిన విశ్వనాథ్ నగర అభివృద్ధికి కృషి చేశారు. పారిశుద్ధ్యం, పచ్చదనం, మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషించారు.
NLR: సంఘం మండలం సిద్దీపురంలో గురువారం చుక్కల జింక సంచారం చేసింది. గ్రామ సమీపంలో పొలాల నుంచి గ్రామంలోకి జింక వచ్చింది. గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఎండల వేడికి సమీపంలోని అటవీ ప్రాంతాల నుంచి వన్యప్రాణులు గ్రామాల్లోకి వస్తున్నాయని, వాటిని రక్షించాలని ఫారెస్ట్ అధికారులు, గ్రామస్థులకు తెలిపారు.
VZM: విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో సిగరెట్లు, ఖైనీ, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ఇవాళ హెచ్చరించారు. ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ పేరుతో జిల్లా వ్యాప్తంగా పాన్ షాపులు, కిరాణ దుకాణాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ డ్రైవ్లో ఇప్పటి వరకు 347 కేసులు నమోదు చేశామన్నారు.
నంద్యాల జిల్లా వైసీపీ యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్గా డోన్ పట్టణానికి చెందిన గజేంద్ర నాథ్ రెడ్డి నియమితులయ్యారు. తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశాన్ని ఇచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి , మాజీ ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్ర నాథ్ రెడ్డికి గజేంద్ర ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
ELR: చింతలపూడి మండలం రేచర్ల సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం నుంచి సత్తుపల్లి బండిపై వెళ్తున్న వ్యక్తిని వెనక నుంచి అతివేగంతో వచ్చి కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.