VZM: జిల్లా ట్రాఫిక్ పోలీస్ స్టేషనులో పని చేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు బ్యాగు, క్యాప్, వాటర్ బాటిల్తో కూడిన సమ్మర్ కిట్స్ను ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఇవాళ పంపిణీ చేశారు. వేసవి కాలం అంతా మజ్జిగ, కూలింగు వాటర్, ఎలక్ట్రోలర్, గ్లూకోజ్ పౌడర్ను ట్రాఫిక్ సిబ్బందికి ప్రతీ రోజూ అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
VSP: అమరావతి అభివృద్ధి, అవినీతి అంశాలపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ సీనియర్ నేత కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. ‘మావిగన్’ అనే అభివృద్ధి కారిడార్ ప్రతిపాదనతో ప్రభుత్వం ఉలిక్కిపడిందని, జగన్ మాటల ప్రభావం స్పష్టమైందన్నారు. అమరావతిపై భారీ ఖర్చులు పెట్టినా పూర్తి చేయడానికి టైమ్ బాండ్ లేకపోవడం ప్రశ్నార్థకమని విమర్శించారు.
ATP: యాడికిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతంగా ముగిసింది. ‘జలధార’ పథకం ప్రారంభించి, సాగునీటి సంఘాల బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల విజ్ఞప్తులను స్వీకరించిన అనంతరం వేములపాడు హెలిప్యాడ్ నుంచి విజయవాడకు ఆయన తిరుగు ప్రయాణమయ్యారు.
నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం స్వచ్ఛత వారోత్సవాలు నిర్వహించారు. మేయర్ దేవరకొండ సుజాత అశోక్ సమక్షంలో కమిషనర్ వై.ఓ నందన్ అధికారులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు సైకిల్ ప్రయాణం, ప్లాస్టిక్ నివారణ, మొక్కలు నాటడం, వ్యర్థాల పునర్వినియోగం వంటి పర్యావరణ హిత చర్యలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలని పిలుపునిచ్చారు.
ప్రకాశం: దోర్నాల మండలంలోని వెలిగొండ ప్రాజెక్టును భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏప్రిల్ 7న సందర్శించనున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జూలై-ఆగస్టు నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి నీటి విడుదల లక్ష్యంగా పనుల పురోగతిని పరిశీలించనున్నారు. మంత్రి పర్యటన ఇప్పటికే ఖరారైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
GNTR: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో అమరావతి రాజధాని పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల పురోగతి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ATP: గుత్తి మండల ఏపీటీఎఫ్ నూతన కార్యావర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు పోతులయ్య పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మండల అధ్యక్షులుగా చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా వీరాంజనేయులు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. ఉపాధ్యాయులు సమస్యలపై పోరాటం చేయడంతోపాటుగా, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునే దిశగా కృషి చేయాలన్నారు.
VZM: వేతనదారులు కొలతల ప్రకారం పనిచేయాలని జిల్లా జల యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ శారదాదేవి సూచించారు. సోమవారం బొండపల్లి మండలంలోని ఓంపల్లి గ్రామంలో జరుగుతున్న చెరువు పనులను పరిశీలించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ఉదయం 6 నుంచి 10 వరకు, సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో అరుణ పాల్గొన్నారు.
SKLM: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 70 శాతం వరకు ములపేట పోర్ట్ పనులు పూర్తి చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డితో కలిసి పోర్టును సందర్శించారు. పోర్టుకు ఉప్పు భూములు 400 ఎకరాలు అవసరమైతే 399 ఎకరాలు భూములు 99 సంవత్సరాలకు లీజుకు ఇచ్చినట్లు తెలిపారు.
CTR: చిత్తూరు జిల్లా పోలీసుల పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో 41 ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. భూ, డబ్బు, కుటుంబ తగాదాలు వంటి వివిధ సమస్యలు వచ్చాయి. ప్రతి ఫిర్యాదును చట్టప్రకారం విచారించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు న్యాయం చేయడం పోలీసుల ప్రధాన బాధ్యత అని ఎస్పీ తెలిపారు.
అన్నమయ్య జిల్లాలో నీటి కొరత నివారణకు జలధార–జలహారతి కార్యక్రమాన్ని 100 రోజుల మిషన్గా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రారంభించారు. కేసాపురం పరిధిలోని రెడ్డివారిపల్లి చెరువు వద్ద ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చిన్న చెరువుల పునరుద్ధరణ, ఫీడర్ ఛానళ్ల శుభ్రపరిచే పనులతో భూగర్భ జలాలు 5.6 మీటర్లు పెరిగాయని, తాగునీటి సమస్య 90% వరకు పరిష్కారమైందని కలెక్టర్ తెలిపారు.
NLR: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత100 రోజుల ప్రత్యేక కార్యక్రమం కోవూరు నియోజకవర్గంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కోవూరు మండలం గంగవరం క్రాస్ రోడ్డు సదరన్ ఛానల్ వద్ద సాగునీటి సంఘాల నేతలు, రైతులు ర్యాలీ చేశారు.
E.G: రాజమండ్రిలో జరుగుతున్న గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులను రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా ఇతర అధికారులతో కలిసి ప్రతి పనిని క్షుణ్ణంగా సమీక్షించారు. పనుల వేగాన్ని మరింత పెంచి త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
AKP: చోడవరం మండలం జుత్తాడ గ్రామంలో పట్టాలమ్మ తల్లి పండుగ సందర్భంగా సోమవారం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలను ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం బ్యాట్ పట్టుకుని క్రీడాకారులతో సరదాగా ఆడారు. పండుగల వేళ క్రీడా పోటీలు నిర్వహించడం ఆనందదాయకమని, యువత క్రీడలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
నంద్యాల మార్కెట్ యార్డులో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని మంత్రి ఫరూక్ సోమవారం ప్రారంభించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయం కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. వేసవి ముగిసే వరకు రైతులు, ప్రజలకు ప్రతిరోజూ చల్లటి నీరు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యార్డు ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.