VSP: హాస్య సామ్రాట్ చార్లీ చాప్లిన్ 137వ జయంతి వేడుకలను వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 15న ఘనంగా నిర్వహించనున్నారు. నగరంలోని విశాఖ పౌర గ్రంథాలయ హాలులో సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో చాప్లిన్ చిత్రపటానికి నివాళులర్పిస్తారు. అనంతరం ఆయన జీవితంపై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీలను ప్రదర్శించనున్నారు.
KRNL: పెద్దకడబూరులోని PHCలో ప్రజలకు ఉపయోగపడాల్సిన మందులను స్థానిక వైద్యులు తగలబెట్టేశారు. ఎక్స్పైరీ అయ్యాయనే సాకుతో వందలాది సిరప్లు, ట్యాబ్లెట్లు గురువారం రాత్రి ఎవరూ లేని సమయంలో కాల్చారు. స్టాక్ను ప్రజలకు పంపిణీ చేయకుండా ఇలా మంటల్లో పారవేయడంపై సిబ్బందిపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
W.G: ఉండి మండలం పెదపుల్లేరు గ్రామంలో నూతనంగా నిర్మితమైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున సామివారి నూతన దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవాలు గత మూడు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విగ్రహాలను ఊరేగించారు. ఈ నెల 12న ఆదివారం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
W.G: నరసాపురం డీఎస్పీగా మేక సుధాకర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇదే జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసిన సుధాకర్, శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన ముద్ర వేశారు. ప్రజల రక్షణ కోసం ఆయన చేసిన విశేష కృషిని ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకుంటారు.
ELR: కొయ్యలగూడెం మండలం బయన్నగూడెం ప్రభుత్వ పాఠశాల నందు విద్యార్థులకు శుక్రవారం విద్యాసామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని మండల టీడీపీ నాయకులు పారేపల్లి నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ బర్త్ డే వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు.
E.G: బీజేపీ జిల్లా సోషల్ మీడియా విభాగంలో నూతన నియామకాలు చేపట్టారు. జక్కా ఫణిని జిల్లా సోషల్ మీడియా కో-కన్వీనర్గా గురువారం నియమించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర పార్టీ కార్యాలయంలో నియామక పత్రం అందజేసి అభినందించారు. పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ వైఖరిని సోషల్ మీడియాలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
CTR: చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కాలేజీ సమీపంలోని అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో దుప్పి మృతి చెందింది. అటుగా వెళ్తున్న స్థానికులు దుప్పి మృత దేహాన్ని చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుక్కల దాడిలో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.
PPM: ఆశ్రమ పాఠశాలల్లో విద్య ప్రమాణాలను మెరుగుపరచాలని, విధి నిర్వహణలో ఏమాత్రం ఆలసత్వం వహించనా సహించేది లేదని జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. గురువారం కురుపాం మండలం పాడి గ్రామంలోని గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా విద్యార్థుల విద్య ప్రమాణాలను ఆశించిన స్థాయిలో లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ATP: బుక్కరాయసముద్రం మండలాల్లో ప్రభుత్వం రాయితీతో పశుదాణా పంపిణీ చేయనున్నట్లు ఏడీఏ రత్నకుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు రైతు సేవా కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ప్రొటీన్ పశుదాణా బస్తా పూర్తి ధర రూ. 1350 ఉండగా 20 శాతం రాయితీతో పాడి రైతులకు రూ.1100 ఇస్తామన్నారు.
KDP: ఐపీఎల్ టోర్నీ నేపథ్యంలో బద్వేలులోని లాడ్జీలు, డార్మిటరీల్లో పోలీసులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. SI కొండారెడ్డి సిబ్బందితో కలిసి బస చేసిన వారి వివరాలను, రికార్డులను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేయడంతో పాటు, అనుమానిత వ్యక్తుల వేలిముద్రలను సేకరించారు. అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా నిఘా ఉంచామని పోలీసులు తెలిపారు.
TPT: మద్యం తాగి వాహనం నడిపినందుకు వ్యక్తికి జైలు శిక్ష విధించినట్లు రేణిగుంట పట్టణ పోలీసులు తెలిపారు. తిరుపతికి చెందిన ముత్తువన్ మద్యం తాగి వాహనం నడుపుతుండగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడ్డారు. అతన్ని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచామన్నారు. న్యాయమూర్తి 21 రోజుల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించారని తెలిపారు.
NDL: పాణ్యం మండలం నెరవాడలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ ఆకస్మికంగా గురువారం పర్యటించారు. గ్రామ సచివాలయం, చౌక ధరల దుకాణాన్ని పరిశీలించి సేవల అమలు, సిబ్బంది హాజరు, రికార్డుల నిర్వహణపై సమీక్షించారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని JC సూచించారు. రేషన్ పంపిణీ పారదర్శకంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు.
NDL: డోన్ జంగాల కాలనీకి చెందిన ఈభూది లక్ష్మికి చెందిన ఆస్తిని మరిదికి రాసివ్వాలని ఒత్తిడి చేస్తున్నారని మహిళా సంఘం నాయకురాలు పట్నం రాజేశ్వరి మండిపడ్డారు. మరిది ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమెపై ఒత్తిడి చేయడం సరికాదన్నారు. భార్యా భర్తల మధ్య ఆస్తి విషయంలో మరిది లేదా ఇతర కుటుంబ సభ్యులకు ఎటువంటి హక్కు లేదన్నారు. సమస్యను చట్టపరంగా పరిష్కరించాలన్నారు.
NLR: కలువాయి మండలం పెరంకొండకు చెందిన బి. వివేక్ (38) గురువారం సాయంత్రం తన బర్రెలు ఇంటికి రాకపోవడంతో ఎస్.వెంకటేశ్వర్లు 60తో కలిసి ముక్కు తిప్పు ప్రాంతంలో వెతకడానికి వెళ్లాడు. ఈ క్రమంలో కండలేరు జలాశయం దాటడంలో వివేక్ గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎస్సై కోటయ్య ఆధ్వర్యంలో ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు.
KDP: ప్రొద్దుటూరు నెహ్రూరోడ్డులోని TDP కార్యాలయంలో శుక్రవారం ‘ప్రజాదర్బార్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులురెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.