ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని బాలాజీ నగర్లో ఆదివారం డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు స్థానిక ప్రజలకు మత్తు పదార్థాలపై పోలీసులు అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు కార్డెన్ సర్చ్ నిర్వహించినట్లు DSP తెలిపారు.
KKD: పిఠాపురంలో ఆదివారం చికెన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. సాధారణ చికెన్ కిలో రూ.180 ఉండగా, స్కిన్లెస్ రూ.250-280, స్కిన్ చికెన్ రూ.240గా ఉంది. బోన్లెస్ కిలో రూ.300, నాటుకోడి రూ.400-450 వరకు పలుకుతోంది. నాణ్యతను బట్టి ధరల్లో రూ.10-20 వ్యత్యాసం ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. చికెన్ కొనుగోలు చేసేందుకు మాంసం ప్రియులు దుకాణాల వద్ద బారులు తీరారు.
PPM: జియ్యమ్మవలస, కురుపాం మండలాల్లోని గడసింగుపురం, అడ్డకులగూడ గ్రామాల్లో ఆరోగ్య పరిస్థితిపై వైద్య అధికారులు సమగ్ర విచారణ చేపట్టారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. భాస్కరరావు తెలిపారు. ఓ పత్రికలో వచ్చిన వార్తకు ఆయన స్పందించారు. గడసింగుపురం గ్రామంలో గత కొన్నాళ్లుగా ఆరుగురు మరణించినట్లు గుర్తించామన్నారు.
అన్నమయ్య: పీలేరులో మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా పోలీసులు ఆదివారం భారీ కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. శ్రీనాధపురం, రాజీవ్ నగర్ కాలనీల్లో వేకువజామున జరిగిన ఈ తనిఖీల్లో సుమారు 450 ఇళ్లు, 1200 మంది, 214 వాహనాలను పరిశీలించారు. పత్రాలు లేని 64 బైకులు, 5 ఆటోలు, ఒక కారుపై చర్యలు తీసుకున్నారు. 15 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
TPT: నాగలాపురంలోని శ్రీవేదనారాయణ స్వామి ఆలయంలో నిన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఊయల సేవ రమణీయంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అభిషేకాల అనంతరం సుందరంగా అలంకరించి తిరుచ్చి పై వేంచేపు చేశారు. మంగళ వాయిద్యాలు నడుమ ప్రాకారోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామి వారు తన దేవేరులతో ఊయల సేవలో భక్తులకు దర్శనమిచ్చారు.
CTR: పులిచెర్ల(M) పాతపేట సమీపంలో ఆదివారం వేకువజామున ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. పశ్చిమ విభాగం అటవీ ప్రాంతం నుంచి పాతపాలెం అడవి మార్గంలో పాతపేట వద్దకు ఒంటరి ఏనుగు చేరుకుంది. అక్కడ మామిడి చెట్ల కొమ్మలను విరిచేసిన ఏనుగు కొబ్బరి చెట్లను సైతం కూకటివేళ్లతో పెకలించింది. అనంతరం అక్కడి నుంచి అడవుల్లోకి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు.
VZM: బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఉన్న ప్లేవుడ్ పరిశ్రమలో వ్యవసాయం సబ్సిడీ యూరియా వాడుతున్నట్లు ఆరోపణలు రావడంతో వ్యవసాయ శాఖాధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిశ్రమ గోదాములలో ఉన్న యూరియాను పరిశీలించి టెక్నికల్ గ్రేడ్ యూరియా వాడుతున్నట్లు గుర్తించారు. సబ్సిడీ యూరియాను వ్యవసాయేతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏవో మజ్జి శ్యామసుందర్ హెచ్చరించారు.
BPT: ప్యాడిసన్ పేటలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో సచివాలయం వద్ద నిరసన తెలిపారు. కుళాయిల ద్వారా కలుషిత నీరు వస్తోందని నాయకుడు శరత్ మండిపడ్డారు. కలుషిత జలాలతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. వారానికోసారి ట్యాంకర్లతో నీరిస్తే ఎలా అని ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించాలని కోరారు.
PLD: జిల్లా పోలీస్ కార్యాలయంలోని పాత వాహన విడిభాగాలను ఈనెల 21న ఉదయం 10:30 గంటలకు వేలం వేయనున్నట్లు ఎస్పీ కృష్ణారావు తెలిపారు. నరసరావుపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఈ వేలం ప్రక్రియ జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు నిర్ణీత సమయంలో హాజరై వేలంలో పాల్గొనవచ్చు. వాడి పక్కన పెట్టిన టైర్లు, ఇతర సామాగ్రిని ఈ వేలం ద్వారా విక్రయిస్తారు.
అన్నమయ్య: రాయచోటిలో ఆదివారం నాన్వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ కేజీ రూ.240, స్కిన్లెస్ చికెన్ రూ.260గా విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ.950గా స్థిరంగా కొనసాగుతోంది. చేపలలో కొరమేను రూ.450, రాగండి రూ.200, బొచ్చెలు రూ.230గా ఉన్నాయి. ఆదివారం సందర్భంగా చికెన్కు డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగినప్పటికీ వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులు తెలిపారు.
కోనసీమ: జిల్లా వ్యాప్తంగా హోటళ్లపై దాడులు నిర్వహిస్తూ గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగంపై కఠిన తీసుకుంటామని DSO ఉదయభాస్కర్ హెచ్చరించారు. శనివారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 18 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు పట్టుకున్నామన్నారు. డొమెస్టిక్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకుని 6-A సెక్షన్ కింద 12 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.
సత్యసాయి: రెవిన్యూ కార్యాలయానికి సెలవు వచ్చిందంటే ఎర్ర మట్టి మాఫియా ఇష్టా రాజ్యంగా తరలిపోతుంది. కదిరి నియోజకవర్గం నంబులపూలకుంట మండలంలోని ధనియాన్ చెరువులో చోట ముఠా నాయకులు ఓ గ్రూపుగా ఏర్పడి ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు వచ్చిందంటే చాలు మట్టి వందల లోడ్లు తరలిపోతున్నాయి. రెవిన్యూ, ఇరిగేషన్, మైనింగ్ అండ్ జియాలజీ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు.
కాకినాడ టౌన్- హిసార్(07717)కు ఈ నెల 21న ప్రత్యేక రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. ఈ రైలు మంగళవారం ఉదయం 5. 40కి కాకినాడ టౌన్ నుంచి బయలు దేరి రెండు రోజుల అనంతరం గురువారం మధ్యాహ్నం 1:40 వరకు హిసార్కు చేరుకుంటుందన్నారు.
SKLM: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని 25వ వార్డులో పలు ప్రాంతాలలో ఆదివారం కమిషనర్ శ్రీనివాసులు, ఏపీ టీపీసీ ఛైర్మన్ బాబూరావు విస్తృతంగా పర్యటించారు. ఈ మేరకు స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి వంటి సమస్యలను ప్రజలు వారి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఎన్టీఆర్: మాంసాహార ప్రియులకు శుభవార్త. నందిగామలో అరుదైన టోనా ఫిష్ అమ్మకాలు సందడి చేస్తున్నాయి. సుమారు 50 కిలోల బరువున్న ఈ భారీ సముద్ర చేపను పట్టణంలో తొలిసారి విక్రయానికి తీసుకురావడం విశేషంగా మారింది. కేజీ ధర రూ.500 నుంచి రూ.800 వరకు ఉండగా, ఈ చేప రుచి ప్రత్యేకమని చెబుతున్నారు. అరుదైన ఈ చేపను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు.