• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అకాల వర్షం.. నేలకొరిగిన వరిచేలు

కోనసీమ:కె.గంగవరం మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి దాళ్వా, వరిచేలు నేలకొరిగాయి. కోతలు ప్రారంభమయ్యే తరుణంలో ప్రకృతి వైపరీత్యం సంభవించడంతో దిగుబడి తగ్గుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నేలపాలవ్వడంతో పెట్టుబడి వ్యయం పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

April 8, 2026 / 09:21 AM IST

డ్రైనేజీలో వ్యక్తి మృతదేహం

KDP: ప్రొద్దుటూరు పట్టణం రామేశ్వరం రోడ్డులోని డ్రైనేజీ కాలువలో మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై 1టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నూర్ బాషా, కార్మికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆరా తీస్తున్నారు.

April 8, 2026 / 09:15 AM IST

జిల్లా వ్యాప్తంగా 267 కేసులు

KDP: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగించిన వారిపై పోలీసులు ఉక్కు పాదం మోపారు. జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై 267 కేసులు నమోదు చేసి రూ.57,900 జరిమానాలు విధించారు. పోలీసులు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.

April 8, 2026 / 09:13 AM IST

రేషన్ షాపుల్లో కందిపప్పు కరవు

W.G: జిల్లాలో రేషన్ దుకాణాల్లో కందిపప్పు సరఫరా నిలిచిపోవడంతో తెల్ల కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ షాపులో రూ.67లకే లభించే కిలో కందిపప్పు బహిరంగ మార్కెట్లో రూ.140 కి పైగా పలుకుతోంది. అధిక ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే కోటా ప్రకారం కందిపప్పును సరఫరా చేసి పేదలను ఆదుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

April 8, 2026 / 09:13 AM IST

‘ల్యాండ్ రెగ్యులైజేషన్ స్క్రీంను విజయవంతం చేయాలి’

నెల్లూరు డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ల్యాండ్ రెగ్యులైజేషన్ స్క్రీంను విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అక్రమ లేఅవుట్లు, అనధికారిక భూములను చట్టబద్ధం చేయడానికి ఇది ఒక మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు, కందుకూరు, ఆత్మకూరు, కావలి మున్సిపల్ కమిషనర్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై ఈ విషయంపై చర్చించారు.

April 8, 2026 / 09:06 AM IST

‘జీవో నెంబర్60ని రద్దు చేయాలి’

ASR: జీవో నెంబర్ 60 రద్దు చేయాలని కొయ్యూరు మండలంలోని అన్ని పంచాయతీల అభివృద్ధి అధికారులు కోరారు. మంగళవారం పంచాయతీ అభివృద్ధి అధికారుల సమాఖ్య మండల యూనియన్ తరపున ఎంపీడీవో ప్రసాదరావుకు వినతిపత్రం అందజేశారు. జీవో నెంబర్-60 వల్ల రాష్ట్రంలో సుమారు 6,166 మంది పీడీవోలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. జీతం స్కేల్ రూ.28,280 నుంచి రూ.25,220 కి మార్పు చేయడం తగదన్నారు. 

April 8, 2026 / 09:04 AM IST

మీడియా స్వేచ్ఛను హరిస్తే సహించేది లేదు: ఎమ్మెల్యే

SKLM: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కేంద్ర కార్యాలయం పై వైసీపీ నేతలు దాడి చేయడం హేయమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మీడియా స్వేచ్ఛను హరించే హక్కు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికీ లేదు. ధర్నాల పేరు తో వైసీపీ నేతలు గూండాలుగా వ్యవహరిస్తూ దాడులకు దిగుతున్నారు పేర్కొన్నారు.

April 8, 2026 / 09:03 AM IST

ద్వారకాతిరుమల ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు

ELR: కూటమి ప్రభుత్వం మంగళవారం ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కొత్త ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ బోర్డులో మొత్తం 16 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 13 మంది తెలుగుదేశం పార్టీకి చెందినవారికి స్థానం కల్పించారు. అలాగే జనసేన పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులకు, BJPకు చెందిన ఒకరిని కూడా ట్రస్ట్ బోర్డులో చేర్చారు.

April 8, 2026 / 08:59 AM IST

హిందూపురంలో వైసీపీ మహిళా నేతల కీలక సమీక్ష

SS: హిందూపురంలోని సరిగమ ఫంక్షన్ హాల్‌లో జిల్లా YCP మహిళా నేతలు, కార్యకర్తలతో జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో MLC వరుదు కల్యాణి, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయమనోహరి, జడ్పీ ఛైర్మన్ గిరిజమ్మ పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో మహిళా విభాగం బలోపేతం, పార్టీ విజయానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

April 8, 2026 / 08:52 AM IST

ట్రాఫిక్ నియమాల పట్ల వానదారులకు అవగాహన

కృష్ణా: గుడివాడ పెద్ద కాలువ సెంటర్లో ట్రాఫిక్ ఎస్సై నాగరాజు బుధవారం వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నియమాలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

April 8, 2026 / 08:45 AM IST

వార్డుల పునర్విభజన గడువు పొడిగింపు

ATP: అనంతపురం నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని పురపాలికలు, నగర పంచాయతీల వార్డుల పునర్విభజన గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. పట్టణ ప్రణాళిక, రెవెన్యూ విభాగాలు ప్రస్తుతం జనగణన విధుల్లో నిమగ్నం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సిద్ధం చేయడానికి ఈ నెల 26 వరకు గడువును అధికారులు పొడిగించారు.

April 8, 2026 / 08:44 AM IST

కంభంలో అధికారులతో సమీక్ష

ప్రకాశం: ‘జలధార-జలహారతి’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కంభంలో ఫీల్డ్ పరిశీలన, సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వీరభద్రచారి, ఇరిగేషన్ శాఖ DE, AE, డిప్యూటీ MPDO, APOతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పనుల పురోగతిని సమీక్షించి, పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

April 8, 2026 / 08:41 AM IST

‘తడి చెత్త ఎరువుతో పంటల దిగుబడి పెరుగుతుంది’

PLD: నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు బుధవారం ములకలూరులో పర్యటించారు. తడి, పొడి చెత్త సేకరణను ఆయన పరిశీలించారు. సేంద్రియ ఎరువులు తయారు చేసే షెడ్లను పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. తడి చెత్త ఎరువుతో భూసారం, పంటల దిగుబడి పెరుగుతుందన్నారు. గ్రామ పరిశుభ్రత కోసం ప్రజలు తప్పనిసరిగా చెత్తను వేరుచేసి సిబ్బందికి ఇవ్వాలని ఆయన సూచించారు.

April 8, 2026 / 08:40 AM IST

నల్లజర్ల PHCలో అగ్ని ప్రమాదం

E.G: నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మెడిసిన్ స్టోర్ రూమ్‌లో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో రోగుల వార్డుకు ముప్పు తప్పింది. ఈ ఘటనలో సుమారు రూ.15 లక్షల విలువైన మందులు దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు.

April 8, 2026 / 08:38 AM IST

పట్టాదారు పాస్ పుస్తకాలపై సమీక్ష

W.G: సిద్ధాంతం వీఆర్వో కార్యాలయంలో పట్టాదారు పాస్ పుస్తకాల సమస్యలపై తహశీల్దార్ అనిత కుమారి నిన్న సమీక్ష నిర్వహించారు. రీసర్వే ప్రక్రియలో పొరపాట్లు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోపాలను వెంటనే సరిచేయాలని ఆదేశించారు. రైతులు సమర్పించే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పాస్ పుస్తకాలు జారీ చేయాలని సూచించారు.

April 8, 2026 / 08:34 AM IST