PPM: మన డబ్బులు మన లెక్కలు యాప్ ద్వారా మహిళా సంఘాల సభ్యులు పొదుపు, అప్పు నిల్వలు వారివారి మొబైల్లలో తెలుసుకోవచ్చని వెలుగు సీసీ పి.రామకృష్ణ రావు సూచించారు. ఈ మేరకు బుధవారం రాత్రి పాచిపెంట మండలం పణుకువలసలో మహిళా సంఘాల సభ్యులకు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పొదుపులో ఉన్న అమౌంట్ను డిపాజిట్ చేసుకోవాలని, అప్పులు సకాలంలో చెల్లించాలని కోరారు.
E.G: రాజమండ్రి మహిళా కారాగారాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి ఎన్. శ్రీలక్ష్మి బుధవారం సందర్శించి ఖైదీల సదుపాయాలను పరిశీలించారు. న్యాయవాదులు లేని వారికి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని, బెయిల్ లేదా అప్పీలు దాఖలుకు సంస్థ సహకరిస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. ఆహార నాణ్యతపై ఆరా తీస్తూ, ఖైదీల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
VSP: భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బుధవారం వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ రోడ్ల పురోగతిపై ఎంవీపీ కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం దృష్ట్యా 7 రోడ్ల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆనందపురం, అడివివరం ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు నిర్మిస్తే రాకపోకలు సులభమవుతాయని తెలిపారు. భూ నిర్వాసితులకు త్వరగా టీడీఆర్లు ఇవ్వాలని సూచించారు.
VZM: బొబ్బిలి నియోజకవర్గంలో వైసీపీ బలోపేతానికి పని చేయాలని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడును మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం జగన్ను కలిశారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయానికి కలిసికట్టుగా పని చేయాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయానికి ప్రణాళికతో పని చేయాలని సూచించారు.
కోనసీమ: విద్యార్థుల భవిష్యత్తుకు మార్కులే పునాది అని కలెక్టర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. అమలాపురం జెడ్పీ హైస్కూల్లోని పదో తరగతి మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించిన ఆయన, ఈ ప్రక్రియను పవిత్ర బాధ్యతగా చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థి జీవితంలో ఇది కీలక మలుపు అని, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కలెక్టర్ వెంట విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
సత్యసాయి: నాందేడ్ – ధర్మవరం ప్రత్యేక రైలును రెగ్యులర్ సర్వీసుగా మారుస్తూ కేంద్ర రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. హిందూపురం ఎంపీ బి.కె. పార్థసారథి విజ్ఞప్తి మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మార్పునకు ఆమోదం తెలిపారు. ఇక నుంచి ఈ రైలు 17635/17636 నంబర్లతో హజూర్ సాహిబ్ నాందేడ్ – ధర్మవరం ఎక్స్ప్రెస్గా సేవలు అందించనుంది.
CTR: కుప్పం (M) దాసే గానూరు పంచాయతీలో అక్రమంగా వెలిసిన లేఔట్లలో పంచాయతీ అధికారులు నోటీసు బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా వేసిన లేఔట్లలో ఎవరైనా స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడితే వారికి ఎలాంటి మౌలిక వసతులు కల్పించడం జరగదని పంచాయతీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు.
ఎన్టీఆర్: విజయవాడ గుణదల పడవలరేవు వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని రూ.2 కోట్ల నగదు పట్టుబడింది. పోలీసులను చూసి కారును వెనక్కి తిప్పేందుకు ప్రయత్నించిన బల్వంత్ అమర్సింగ్ సోలంకీ, అల్పేష్ కుమార్లను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ సత్యరమేష్ తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు.
GNTR: జనాభా గణన-2027 విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ సి.యం. సాయి కాంత్ వర్మ తెలిపారు. జనాభా గణనను ఈసారి రెండు దశల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తిగా డిజిటల్ విధానంలో చేపట్టనున్న ఈ ప్రక్రియలో మొబైల్ యాప్ ద్వారా డేటా సేకరణ జరుగుతుందని వెల్లడించారు.
ATP: పుట్లూరు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 12న ప్రవేశ పరీక్ష నిర్వహించ నున్నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఓబుళరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు పాఠశాలలోని పరీక్షా కేంద్రం వద్దకు హాల్ టికెట్తో చేరుకోవాలని ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.
VZM: పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని TDP రాష్ట్ర కార్యదర్శి కిమిడి రాంమల్లిక్ నాయకుడు స్పష్టం చేశారు. బుధవారం గరివిడిలోని కొండపాలెం ప్రాంతానికి చెందిన బసవ తిరుమల రావు అనే బాధితునికి ఆయన CMRF కింద మంజూరైన రూ.43,306ల చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. CMRF అపదలో ఉన్న పేదలకు అండగా ఉంటుందని తెలిపారు.
బాపట్ల: అద్దంకి మండలం చక్రాయపాలెంలో జాలర్ల సంఘం ఎన్నికలు జరుగుతున్న సమయంలో విషాదం చోటుచేసుకుంది. ఓటు హక్కు వినియోగించేందుకు వచ్చిన గుర్రం వారిపాలెం గ్రామానికి చెందిన మహంకాళి అనే వ్యక్తి ఎండ తీవ్రతతో కుప్పకూలి, గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
W.G: పెంటపాడుకు చెందిన వివాహిత మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మర్రి సాయి కుమార్, గుండుమోగుల నాగేంద్రబాబులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పెంటపాడు పోలీసులు బుధవారం తెలిపారు. మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఈనెల 5న ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. ఆమె ఫిర్యాదుపై నిందితులను అరెస్ట్ చేసి బుధవారం కోర్టులో హాజరు పరచగా, 14 రోజులు రిమాండ్ విధించారు.
NDL: దేశానికి అన్నం పెట్టే రైతన్న తన సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం ఎంత మాత్రం తగదని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయుడు, బాబా ఫక్రుద్దీన్ విమర్శించారు. బుధవారం వారు మాట్లాడుతూ.. కొలిమిగుండ్ల మండలంలో రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ కాలుష్యం బాధిత రైతులు ఈనెల 10న ధర్నా చేయడానికి సిద్ధమయ్యారన్నారు.
KRNL: ఆస్పరి మండలం పుటకలమర్రి ఏపీ మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాలకు ఈనెల 12న ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు బుధవారం ప్రిన్సిపల్ ఎస్.షమీల తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, పరీక్ష రోజు ఉదయం 9:30 గంటలకు స్కూల్కు హాజరుకావాలని సూచించారు.