KDP: జిల్లాలో రౌడీయిజం, గంజాయి కార్యకలాపాలకు తావులేదని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ బుధవారం ప్రొద్దుటూరులో జరిగిన నేర సమీక్షా సమావేశంలో స్పష్టం చేశారు. మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. బెల్ట్ షాపులు, బహిరంగ మద్యపానంపై కఠిన చర్యలు తీసుకోవాలని, బెట్టింగ్, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు.
NDL: టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన వలసల రామకృష్ణ బుధవారం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధి, కార్యకర్తల సమన్వయం వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. కొత్తగా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణకి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.
KRNL: జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఇవాళ కర్నూలు జిల్లా లద్దగిరి, అత్యధికంగా 44.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
W.G: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ బుధవారం అమరావతి నుంచి జిల్లా కలెక్టర్లలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. 22-ఏ రీ సర్వే, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, ఈ-కేవైసీ ప్రక్రియ, జలధార-జలహారతి కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాలను సమన్వయంతో పూర్తి చేయాలన్నారు.
ELR: జిలాల్లో ‘నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఇరిగేషన్ శాఖాధికారులను హెచ్చరించారు. బుధవారం గ్రామాలలో చేపట్టవలసిన పనులకు సంబంధించి ప్రతిపాదనలపై అధికారులతో సమీక్షించారు. నీటి పరిరక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దీనిపై అలసత్వం వహించకూడదన్నారు.
ప్రకాశం: కనిగిరి అమరావతి గ్రౌండ్లో ఈ నెల 18న ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు క్యాంపు కార్యాలయ ప్రతినిధి తిరుమల తెలిపారు. శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థల సంయుక్తంగా ఈ శిబిరం జరుగనుంది. రోగులకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
NLR: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పొలిట్ బ్యూరో సభ్యురాలుగా నియామకమవడం అభినందనీయమని ఇందుకూరుపేట మండల అధ్యక్షుడు పవన్ కుమార్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని ఆయన సత్కరించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యేకు వెంకటేశ్వర స్వామి ఫొటోను బహూకరించారు.
PLD: పెద్దకూరపాడు నియోజకవర్గ చరిత్రలోనే అభివృద్ధి జరిగిందంటే వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని తాడికొండ YCP పరిశీలకులు ఈదసాంబిరెడ్డి అన్నారు. ఏ గ్రామంలో చూసిన రోడ్లు, సచివాలయాలు, ఆర్బికేల నిర్మాణం జరిగిందన్నారు. పార్టీలకతీతంగా సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత వైసీపీకే దక్కిందన్నారు.
SKLM: రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహక కార్యదర్శిగా బగ్గు అర్చన నియమితులయ్యారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజల సేవలో నిమగ్నం అవుతానని చెప్పారు. ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఆమెను అభినందించారు.
W.G: నరసాపురానికి చెందిన టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎం.ఏ. షరీఫ్కు పార్టీ అధిష్టానం గుర్తింపునిచ్చింది. పార్టీలో అత్యున్నత నిర్ణాయక విభాగమైన ‘పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఆయనను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మైనార్టీ వ్యవహారాల సలహాదారుగా ఉన్న షరీఫ్, గతంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా, క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్గా విశేష సేవలు అందించారు.
ELR: జనాభా గణన 2027 కార్యక్రమంలో ఇంటి జాబితా, గృహ గణనపై అవగాహన కల్పించే పత్రికను ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు ఆవిష్కరించారు. స్థానిక MLA క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం జనాభా గణన కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని, ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు పూర్తి సమాచారం అందించాలన్నారు.
KDP: వల్లూరు(M) ఏ. ఓబయపల్లె క్రాస్ వద్ద జరిగిన కే. వెంకటసుబ్బయ్య హత్య కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. CI మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజేశ్, మోహన్ రంగ, రఘురాం కలిసి కత్తులతో దాడి చేసి హత్య చేసినట్టు విచారణలో తేలింది. మృతుడికి, నిందితుల మధ్య పాత కక్షలే ఈ ఘటనకు కారణమని పోలీసులు పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండుకు తరలించారు.
కోనసీమ: అల్లవరం మండలం గోడిలో ఉన్న అంబేద్కర్ గురుకులం బాలుర కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో ప్రతిభ చూపారని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సంవత్సరంలో 83.33%, ద్వితీయ సంవత్సరంలో 86% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని అన్నారు. ఫస్ట్ ఇయర్లో రోహిత్ 482 మార్కులు, బాల సందీప్ 435 మార్కులు సాధించారన్నారు.
ప్రకాశం: కంభం మండలంలోని నర్సిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి అబ్దుల్ సత్తార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణ, బోధనా విధానం, విద్యార్థుల హాజరు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. పాఠశాలలోని తరగతి గదులు, మౌలిక వసతులు, తాగునీటి సదుపాయం, పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించిన ఎంఈవో సంతృప్తి వ్యక్తం చేశారు.