W.G: తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ గొర్రెల శ్రీధర్ టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులయారు. ఈ మేరకు పలువురు టీడీపీ నేతలు ఆయనను కలసి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఉదయం పార్టీ కార్యాలయంలో నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.
ATP: జిల్లా క్రికెట్ సంఘము ఆధ్వర్యంలో ఈ నెల 18న సీనియర్ మహిళలకు, 19న అండర్-15 బాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి యుగంధర్ రెడ్డి తెలిపారు. ఆర్డిటిలో నిర్వహించే ఎంపిక పోటీలకు హాజరై క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, క్రీడా సామాగ్రి, యూనిఫామ్తో హాజరు కావాలన్నారు.
E.G: రాజమండ్రిలో ట్రాఫిక్ నియంత్రణను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి శుక్రవారం విస్తృత చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ డీఎస్పీ వై.శ్రీకాంత్ ఆధ్వర్యంలో పలు జంక్షన్ల వద్ద సమగ్ర పరిశీలన నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పరిస్థితులను మెరుగుపరచడానికి డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలనలు నిర్వహించారు.
KDP: ప్రొద్దుటూరులో 1946లో నామ ఎరుకలయ్య ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ గీతాశ్రమం ఆదాయ వివరాలను ఈవో శ్రీధర్ శుక్రవారం వెల్లడించారు. ఆశ్రమానికి 5 కాలేజీల నుంచి రూ.65.41 లక్షలు, షాపులు, ఇళ్ల బాడుగల ద్వారా రూ.29 లక్షలకు పైగా ఆదాయం వస్తోందని తెలిపారు. 38.96 ఎకరాల భూముల కౌలుతో పాటు రూ.2.01కోట్ల ఎల్డీలపై వడ్డీ వస్తోందని పేర్కొన్నారు.
NDL: నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి మాతకు ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, ఛైర్మన్ పీవీ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం అమావాస్య సందర్భంగా పూజలు చేశారు. అర్చకులు తెల్లవారుజామున అమ్మవారిని పసుపు పారాయణంతో సింగారించి, విశేష పుష్పాలంకరణలో కుంకుమార్చన, రుద్రాభిషేకం, మహా మంగళహరతి పూజలు గావించారు. అమావాస్య కావడంతో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.
PPM: ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎమ్.శ్రీనివాసరావు ఆద్వర్యంలో శుక్రవారం కురుపాం మండలం జోంగరపాడు గ్రామంలో ఉపాధి హామీ పనుల వద్ద కూలీలు ఫేస్ యాప్ రద్దు చేసి పాత పద్ధతిలో కొనసాగించాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫేస్ యాప్ కారణంగా హాజరు నమోదు సమస్యలు తలెత్తి కూలీలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
KDP: సిద్దవటం మండలం మాధవరం-1 పంచాయతీ పరిధిలోని బంగారుపేట గ్రామ సమీపంలో వెలసిన శ్రీ గంగాభవాని అమ్మవారికి శుక్రవారం విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకం, అలంకరణ, సహస్రనామార్చన, కుంకుమార్చన వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.
KRNL: దేవమ్మ మడుగులో ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కర్నూలు మండలం ఆర్.కె. దుద్యాల సమీపంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు. ఇసుక అక్రమ తరలింపు, నీటి నిల్వ సామర్థ్యం, తాగునీటి సమస్యలపై క్షేత్రస్థాయిలో ఆరా తీశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
కోనసీమ: జిల్లాలో కొబ్బరికాయ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. గత వారం రోజుల నుంచి కొబ్బరి కాయ రూ.16 నుంచి రూ.18 వరకు పలుకుతుంది. అయితే ధర బాగానే ఉన్నా పంట దిగుబడి లేదని రైతులు వాపోతున్నారు. గతంలో ఎకరానికి 1000 కొబ్బరికాయ వచ్చే చోట ఇప్పుడు 500 కూడా రావడం లేదని వాపోతున్నారు. దిగుబడి లేకపోవడంతో ఎంత రేటు ఉన్నా ప్రయోజనం లేదంటున్నారు.
సత్యసాయి: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ 2026-27 విద్యా సంవత్సరానికి క్రీడా అకాడమీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్ తెలిపారు. 15 నుంచి 19 ఏళ్ల లోపు క్రీడాకారులు SAAP వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఎంపికైన వారికి ఉచిత వసతి, భోజనంతో పాటు ఆధునిక శిక్షణ ఇస్తామన్నారు.
ఏలూరులోని డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఈనెల 18, 19 తేదీల్లో సేంద్రియ ఆహార ఉత్పత్తుల మేళా నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ భాషా తెలిపారు. ఈ మేళాలో 80 మంది రైతులతో 50 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని, 150 రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే ఈ ప్రదర్శనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
NDL: అటవీ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఆ శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆత్మకూరు పరిధిలో రిజర్వ్ ఫారెస్ట్గా వెబ్ ల్యాండ్లో నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని, అటవీ చెక్ పోస్టులను పోలీస్ కంట్రోల్ రూంతో అనుసంధానం చేసి భద్రతను పెంచాలన్నారు.
KDP: కలసపాడు MPDO కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజా వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు MPDO మహబూబీ వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 13 పంచాయతీల్లో జరిగిన ఉపాధి పనులపై 19వ విడత సామాజిక తనిఖీ జరుగుతుందన్నారు. తనిఖీలో గుర్తించిన అంశాలపై ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చ జరుగుతుందన్నారు. ప్రజలు, కూలీలు, అధికారులు హాజరుకావాలని సూచించారు.
బాపట్ల: పంగలూరు మండల విద్యాశాఖ అధికారిగా షేక్ కాలేషావలిని ఉన్నతాధికారులు నియమించారు. ప్రస్తుతం దర్శిలోని బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇంతకుముందు ఎంఈఓగా ఉన్న కే. నాగభూషణం మార్చిలో పదవీ విరమణ చేయడంతో ఖాళీ ఏర్పడింది. దీంతో కాలేషావలిని నియమించారు.
KKD: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నిహారికలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ ఇటిక్యాలను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనకు బెయిల్ మంజూరైంది. అర్ధరాత్రి 2 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగిందని పోలీసులు తెలిపారు.