కర్నూలులోని ఓ థియేటర్లో జరిగిన వీరశైవుల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు బుధవారం మాట్లాడారు. వీరశైవుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ తెలిపారు. వారిని ఓబీసీ జాబితాలో చేర్చే అంశాన్ని పార్లమెంటులో చర్చిస్తానన్నారు. అనంతరం ఆయన బసవేశ్వర విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
KDP: ఎర్రగుంట్ల-ముద్దనూరు రోడ్డులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి గురువారం రానున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గురు భాస్కర్ రెడ్డి తెలిపారు. పాఠశాలలోని నిర్మిస్తున్న స్మార్ట్ కిచెన్ పనులను పరిశీలించేందుకు ఆయన వస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు.
E.G: రాజమండ్రి రైల్వేస్టేషన్ వద్ద ఇటీవల గుర్తు తెలియని సుమారు 6 నెలల చిన్నారిని స్థానికులు గుర్తించి రెండో పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఛైల్డ్ లైన్ 1098కు సమాచారం అందించడంతో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో సిబ్బంది చిన్నారిని శిశు గృహకు చేర్చి సంరక్షిస్తున్నారు. ఈ పాప వివరాలు తెలిసిన వారు పోలీసు స్టేషన్లో సంప్రదించాలన్నారు.
ELR: ఏపీ స్కిల్ డెవలప్మెంట్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. జీలుగుమిల్లి మండలం బర్రెంకలపాడు ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం 9:00 నుంచి జరిగే ఈ జాబ్ మేళాలో 16కి పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. 10, ఇంటర్, ఐటిఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్, D/B/M/ఫార్మసీ చేసి, 18-35 వయస్సు కలిగిన వారు అర్హులన్నారు.
BPT: ఈ నెల 23వ తేదీన బల్లికురవ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కుసుమకుమారి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుందని, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై మండల అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాలని కోరారు. సమావేశానికి సంబంధిత అధికారులు పూర్తి వివరాలతో సిద్ధంగా రావాలని ఎంపీడీవో సూచించారు.
KRNL: కౌతాళం మండల MROగా పి. రవిచంద్ర బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రవిచంద్ర మాట్లాడుతూ.. మండల ప్రజలకు పారదర్శకంగా, వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. భూ సమస్యలు, ధ్రువపత్రాల జారీ సేవలను సమయానికి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.
ATP: గుంతకల్లు రైల్వే డివిజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని యశ్వంతపూర్- సహర్ష మధ్య వయా గుత్తి మీదుగా ప్రత్యేక వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు నడుపుతునట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 16 నుంచి 30 వరకు ప్రతి గురువారం రాత్రి 10:25గంటలకు సహర్షలో బయలుదేరి శనివారం రాత్రి 10:30కు యశ్వంత్పూర్కు చేరుకుంటుందన్నారు.
కృష్ణా: డ్రగ్స్ రహిత సమాజం కోసం నిర్వహిస్తున్న సైకిల్ యాత్ర బుధవారం గన్నవరం మండలం చిన్నఅవుటపల్లికి చేరుకుంది. తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు 1000 కిలో మీటర్ల మేర వైబ్రేంట్స్ ఆఫ్ కలాం సంస్థ ఆధ్వర్యంలో విజయ్ కలాం బృందం యాత్ర కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా డా.పిన్నమనేని సిద్ధార్థ కళాశాలలో 100 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించారు.
శ్రీకాకుళం: చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధించినట్లు ఎస్సై కె. కృష్ణప్రసాద్ తెలిపారు. 2024లో మందస మకరజోల వద్ద వృద్ధురాలి గొలుసు లాక్కెళ్లగా, వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. సోంపేట కోర్టు తాజాగా ఈ తీర్పు వెల్లడించింది.
సత్యసాయి: కదిరి స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని చాందిని ఇంటర్ రెండవ సంవత్సరం ఫలితాలలో 991 మార్కులతో జిల్లా స్థాయిలో టాపర్గా నిలిచింది. ఈ కళాశాలలో అత్యధిక మంది విద్యార్థినులు 90 శాతానికి పైగా మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. అత్యధిక ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినీయులను కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్ ప్రసాద్ ,అధ్యాపకులు బుధవారం అభినందించారు.
NDL: మంత్రాలయం ఘోర రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాల గురించి సీఐ దస్తగిరి బాబు, ఎస్సై మల్లికార్జునను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు జరిపి, పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. గూడ్స్ వాహనాల్లో ప్రయాణించరాదని ఎన్నిసార్లు అవగాహన కార్యక్రమాలు చేపట్టిన చైతన్యం రావడం లేదన్నారు.
ASR: మారుమూల గ్రామాల్లో రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులు అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనంతగిరి మండలం మల్లిపాడు గ్రామానికి ఇప్పటికీ రహదారి లేదు. గ్రామానికి చెందిన బాబూరావు అనారోగ్యానికి గురికావడంతో స్థానికులు అతడిని ఆరు కిలోమీటర్ల దూరం డోలీమోతతో మోసుకుని ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
VZM: టీడీపీ పార్టీ పోలిట్ బ్యూరో స్థానం దక్కించుకున్న గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన గంట్యాడ శ్రీదేవిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. పార్టీ నాయకులు కార్యకర్తల హర్షద్వానాల మధ్య మంత్రి శ్రీనివాస్ శాలువ కప్పి ఘనంగా సత్కరించారు. నాయకులు కార్యకర్తలు శ్రీదేవికి శుభాకాంక్షలు తెలియజేశారు.
NLR: ఉదయగిరి (M) బండగానిపల్లి పంచాయితీ బీజేపీకి చెందిన గుంటా రాము (30) అనే యువకుడు అనుమానాస్పదంగా బెంగళూరులోని మారతహళ్లి రైల్వే ట్రాక్ వద్ద విగతజీవిగా పడి ఉన్నారు. వచ్చే నెలలో వివాహం నిశ్చయమైంది. ఇంతలోనే ఈ ఘటన జరగడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న తండ్రి గుంటా పిచ్చిరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు తరలివెళ్లారు.