VZM: రాజాం పట్టణంలో గురువారం నుంచి యథావిధిగా కుళాయిల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నట్లు మునిసిపల్ కమిషనర్ రామచంద్రరావు బుధవారం తెలిపారు.ఆయన మాట్లాడుతూ.. రేగిడి మండలం మజ్జి రాముడు పేట వద్ద ప్రధాన పైపులైను మరమ్మతు పనులు పూర్తై నేపథ్యంలో యథావిధిగా నీటిని పునరుద్ధరణ చేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని గ్రహించవలసిందిగా ప్రజలను కోరారు.
TPT: నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాసపురం సోషల్ ఫారెస్ట్ భూముల్లో నీలగిరి తైలం చెట్లను కొందరు వ్యక్తులు అక్రమంగా నరికి తరలిస్తున్నారు. టన్నుల పరిమాణంలో కలపను తరలిస్తున్నప్పటికీ, రెవెన్యూ, ఫారెస్ట్, మున్సిపాలిటీ అధికారులు ఈ అక్రమాన్ని పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
EG: బాల విజ్ఞాన్ మందిర్ పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం పరిశీలించారు. సీసీ కెమెరాల నిఘా, అధికారులకు అందుతున్న వసతులపై డీఈవో వాసుదేవరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్పాట్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ATP: పుట్లూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక అధికారుల సమావేశంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ స్థానిక సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సూచించారు. వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.
CTR: వేసవి ప్రారంభమవ్వడంతో పల్లెల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. పలమనేరు రూరల్ జరావారి పల్లి, పకీరుపల్లి, పి. వడ్డూరులో బోరు మోటార్లు పనిచేయక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరం నుంచి నీరు తెచ్చుకుంటున్నామన్నారు. ఆరు నెలల నుంచి చెబుతున్నా ఏ నాయకుడు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు: మంగళగిరి ఖాజా టోల్ ప్లాజా వద్ద మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బస్సుల ఫిట్నెస్, భద్రతా ప్రమాణాలు, డ్రైవర్ల లైసెన్సులను పరిశీలించారు. 20కి పైగా బస్సులు చెక్ చేసి, నిబంధనలు పాటించని ఒక బస్సును సీజ్ చేశారు. 15 బస్సులపై జరిమానాలు విధించారు. ప్రయాణికుల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రకాశం: తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలోని గోదాంలో అక్రమంగా నిలువ ఉంచిన 21 సిలిండర్ లను ఒంగోలు ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. రాబడి సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించిన అధికారులు డొమెస్టిక్ సిలిండర్లు 15, కమర్షియల్ సిలిండర్లు 6 స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిలువ ఉంచిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
KRNL: కర్నూలులోని వాణిజ్య సముదాయాలపై అధికారులు బుధవారం దాడులు చేశారు. నగరవ్యాప్తంగా 156 వాణిజ్య సంస్థలను తనిఖీ చేసిన అధికారులు.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపట్టారు. అక్రమంగా ఉపయోగిస్తున్న 115 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వ్యాపారులపై 103 సెక్షన్ 6ఏ కింద కేసులు నమోదు చేశారు.
KRNL: రాజమండ్రిలో మే 30, 31న జరగనున్న అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ పోటీలలో ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని బుధవారం ఏపీ డ్రాగన్ బోట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవినాష్ ఆరోపించారు. అసోసియేషన్కు సమాచారం ఇవ్వకుండా పోటీలు నిర్వహించడం సరికాదన్నారు. అధికారిక గుర్తింపు ఉన్న ఫెడరేషన్లను సంప్రదించి పోటీలు నిర్వహించాలన్నారు.
NDL: డోన్ మండలం కొత్తబురుజులో గురువారం నూతన తాగునీటి పైప్ లైన్ శంకుస్థాపనకు ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి హాజరవుతున్నారని ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఈ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.
NDL: కల్లూరు అర్బన్లోని లక్ష్మీపురంలో బుధవారం ప్రమాదవశాత్తు గడ్డివాములు దగ్ధం అయ్యాయి. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఘటనా ప్రదేశానికి సంబంధిత అధికారులతో వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనలో రైతులు కురువ గోవింద్, చిన్న సుంకన్న, కురువ పెద్ద సుంకన్నకు కలిపి మొత్తం దాదాపు రూ.2 లక్షల నష్టం జరిగినట్లు ఎమ్మెల్యేకు వివరించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు.
KRNL: కౌమార దశలో గర్భధారణ బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుకు ప్రమాదకరమని కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. స్త్రీ శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన పోస్టర్ను బుధవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. బాల్య వివాహాల నివారణ, బాలికల విద్య ప్రోత్సాహం ద్వారా సమస్యను అరికట్టాలని ఆమె సూచించారు. ICDS పీడీ విజయ, DMHO డా.కామేష్ పాల్గొన్నారు.
CTR: జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రత, ఐపీఎల్ బెట్టింగ్ నియంత్రణపై అవగాహన పెంచాలని అధికారుల సూచించారు. గ్రామ స్థాయిలో మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచేలా కార్యదర్శులు వారధిలా పనిచేయాలని సూచించారు.
W.G: కాళ్ల మండలం కోలనపల్లికి చెందిన చెల్లెం ఐజక్(19) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మంగళవారం సోదరుడిని బస్సు ఎక్కించి తిరిగి వస్తుండగా, కాళ్లలోని దత్తాత్రేయ గుడి వద్ద బైక్ స్తంభాన్ని ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన అతడిని భీమవరం ఆసుపత్రికి తరలించగా, బుధవారం చికిత్స పొందుతూ.. ప్రాణాలు విడిచాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
NTR: నందిగామలో సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ వైవిఎల్ నాయుడు ఆధ్వర్యంలో ఎస్ఐ మహతి, గాంధీ సెంటర్ వద్ద వాహనదారులకు అవగాహన కల్పించారు. సైబర్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పారు. హెల్మెట్ ధరించడం, అతివేగం నివారించడం, వాహన పత్రాలు వెంట ఉంచుకోవడం తప్పనిసరి అన్నారు.