KRNL: మద్దికేర మండల పరిధిలోని బురుజుల గ్రామం వద్ద బైక్ అదుపుతప్పి వీఆర్వో శ్రీనివాసులు మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. శ్రీనివాసులు తుగ్గలి మండలం రామ్ కొండ వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య కళావతితో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మద్దికేర ఎస్సై విజయ్ కుమార్ నాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
VZM: గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో స్థానిక చంపావతి నదిలో కొండ చిలువ సోమవారం సాయంత్రం జాలర్ల వలలో చిక్కుకుంది. భారీ పైథాన్ చంపావతి నది పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండటంతో సరాబుల కాలనీవాసులు భయాందోళనలకు గురయ్యారు. తరచూ చంపావతి పరివాహక ప్రాంతంలో కొండ చిలువలు వస్తున్నాయని కాలనీ వాసులు తెలిపారు. కొండ చిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచినట్లు తెలిపారు.
ప్రకాశం: చంద్రశేఖరపురం మండలం మిట్టపాలెం నారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల ద్వారా రూ. 1, 23, 032 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు సోమవారం తెలిపారు. టికెట్లు అమ్మకం ద్వారా రూ. 53,450 లడ్డు ప్రసాదం అమ్మకం ద్వారా రూ. 18,820 శాశ్వత అన్నదాన విరాళం ద్వారా రూ. 48,242 ఇతర విరాళాల ద్వారా రూ. 2,520 ఆదాయం రావటం జరిగిందన్నారు.
KRNL: కర్నూలులోని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫీసులో శిక్షణను జిల్లా ఇంఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు పాండురంగారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. హైకోర్టు అన్ని జిల్లా కోర్టుల్లో మధ్యవర్తిత్వం ప్రవేశపెట్టాలని తీర్మానించిందని, ఈనెల 16 నుంచి 20 వరకు మధ్యవర్తిత్వంను ఏ విధంగా చేయాలని న్యాయవాదులకు అవగాహన కల్పించనున్నారు.
SKLM: పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష వైసీపీ జగన్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. పోలవరం నిర్వాసితులకు ఎన్నో హామీలు ఇచ్చిన జగన్ ఒకటీ నెరవేర్చలేదని టీడీపీ హాయంలో నిర్వహితులకు కాలనీల కోసం రూ.4,144 కోట్లు ఖర్చు చేశారని అలాగే పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు కూడా కేటాయించలేదని కానీ కూటమి ప్రభుత్వం రూ.12,500 కోట్ల నిధులు కేటాయించిందన్నారు.
కృష్ణా: విజయవాడలో సోమవారం మధ్యాహ్నం కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో బాలిక షేక్ రేనా కీలక వివరాలు తెలిపింది. రీనాను బాలిక తల్లి నాగూర్బి హాస్టల్లో చేర్పిస్తానని ఇటీవల హెచ్చరించింది. ఈ క్రమంలో బాలిక భయపడి గుంటూరు నుంచి కారులో లిఫ్ట్ ద్వారా విజయవాడ చేరుకొని తల్లికి సమాచారం అందించింది. కాగా కిడ్నాప్ కాకపోవడంతో కథ సుఖాంతం అయింది.
ATP: కళ్యాణదుర్గం మండలం బాల వెంకటాపురం గ్రామంలో దాసరి లక్ష్మమ్మ(100) అనే శతాధిక వృద్ధురాలు సోమవారం మృతి చెందింది. మృతురాలు దాసరి లక్ష్మమ్మకు ఆరుగురు కుమారులు ఒక కూతురు ఉన్నది. లక్ష్మమ్మ అనారోగ్య సమస్యతో మృతి చెందింది. ఆమె మృతికి స్నేహితులు, బంధువులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. దాదాపు నాలుగు తరాలు చూసినట్లుగా పేర్కొన్నారు.
NLR: జలదంకి మండలం తిమ్మసముద్రం గ్రామంలో సోమవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా దారా శ్రీహరి అనే వ్యక్తి వద్ద పది మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
KRNL: ప్రాథమిక పాఠశాలల్లో పునాదులు బలంగా ఉంటేనే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని కర్నూలు డీఈవో శ్యామ్యూల్ పాల్ అన్నారు. కర్నూలు మండలం బి. తాండ్రపాడులో ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడాతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన పద్ధతులు, టెక్నాలజీని ఉపయోగించాలని తెలిపారు. విద్యార్థులకు స్నేహపూర్వక వాతావరణంలో అభ్యాసం జరిగేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు.
ATP: నగర పాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో మంగళవారం ఉదయం10:30 గంటలకు కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు నగర మేయర్ మహమ్మద్ వసీం సలీం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. నగరంలోని కార్పొరేటర్లు తమ డివిజన్ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు పాల్గొంటారని చెప్పారు.
ప్రకాశం: రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కోరారు. ఢిల్లీలోని పార్లమెంట్లో ఆయన సుదీర్ఘంగా ప్రస్తావించారు. రాష్ట్రాలకు జీఎస్టీ వాట 50 శాతం నుండి 70 శాతానికి పెంచాలని, రూ. 1.50 లక్షల కోట్లు నిధులు గృహనిర్మాణాలకు ఇవ్వాలని, కనిగిరి నిమ్జ్, బకింగ్ హాం కాలువ వునరుద్ధరణకు వెంటనే నిధులు ఇవ్వాలని కోరారు.
KRNL: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రేపు కర్నూలుకు రానున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు విమానాశ్రయానికి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి కర్నూలుకు చేరుకుని జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో వైసీపీ నేత తెర్నెకల్ సురేంద్ర రెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్కు హాజరవుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లికి వెళ్తారు.
W.G: తణుకులో లయన్స్ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్న డయాలసిస్ సెంటర్ ఎంతో విశిష్టంగా పని చేస్తోందని, స్వయంగా సెంటర్ కార్యకలాపాలు లాభాపేక్ష లేకుండా అర్హులైన వారికి ఉచితంగా చేయడం అభినందనీయమని లయన్స్ ఇంటర్నేషనల్, అమెరికా నుంచి వచ్చిన తాషా హెడర్నిక్ అన్నారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్ను వంక రవీంద్రనాథ్, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు.
NDL: ఆత్మకూరు పట్టణంలో శునకాలు ప్రజల్ని భయపెడుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. పట్టణంలోని కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై పదుల సంఖ్యలో శునకాలు చేరడంతో ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ సమస్యపై అనేకమార్లు పట్టణవాసులు మున్సిపల్ అధికారులు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు.
KRNL: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు సోమవారం రాత్రి వెండి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సర్కారీ సేవలో భాగంగా దేవస్థానం ప్రతినిధులు ముందుగా సహస్రదీపాలంకరణ పూజల అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లకు వెండి రథోత్సవ సేవను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చక స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.