VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి శనివారం డెంకాడ మండలం చిన తాడివాడలో ఇటీవలే తుఫానుకు దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు ఏటువంటి ఇబ్బందులు లేకుండా న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల TDP సీనియర్ నాయకుడు కంది చంద్రశేఖరరావు, మండలం వ్యవసాయ అధికారి నిర్మల పాల్గొన్నారు.
కడప: కొండాపురంలో నాలుగు లైన్ల రహదారి పనులు పూర్తి అవుతున్నాయి. రహదారికి ఇరువైపులా ఎస్ఈడి లైట్లు, ఫూట్ పాత్ పక్కన గ్రిల్, సర్వీస్ రోడ్లు ఏర్పాటుచేశారు. కొండాపురం కొత్త హంగులతో సిటీ తరహాలో కళకళలాడుతోందని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముద్దనూరు – తాడిపత్రి నాలుగులైన్ల రహదారి ఏర్పాటు చేయడంతో ప్రయాణం సులువుగా ఉంటుందన్నారు.
PPM: పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ శనివారం కలెక్టరేట్లో ప్రగతిలో ఉన్న JJM పనులపై RWS ఇంజనీర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా కావాలని ఆదేశించారు. JJM పనులు వీలైనంత త్వరగా పూర్తిచేయాలని, ఇందుకోసం దగ్గరలో ఉన్న నీటి వనరుల సౌలభ్యాన్ని చూసుకోవాలని అధికారులకు సూచించారు.
KKD: సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం డిసెంబర్ 31న నిర్వహించనున్నట్లు కమిషనర్ శ్రీవిద్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి అధ్యక్షతన 31న అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రధాన అంశాలపై సమావేశంలో సమీక్ష చేసి, కౌన్సిల్ సభ్యుల నిర్ణయం మేరకు తీర్మానాల నిర్వహణ జరుగుతుందన్నారు.
W.G: నరసాపురం ఆర్టీసీ డిపో వద్ద శనివారం నూతనంగా మంజారైన మూడు కొత్త బస్సుల సర్వీసులను ప్రభుత్వ చీఫ్ విప్ బొమ్మిడి నాయకర్, నరసాపురం బీజేపీ నియోజవర్గం కన్వీనర్ మేకల సతీష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పొత్తూరి రామరాజు, పట్టణ అధ్యక్షులు మునుగోటి వెంకటేశ్వరరావు, జిల్లా లీగల్ కన్వీనర్ కొప్పర్తి వెంకట్ తదితరులు ఉన్నారు.
VZM: ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే శనివారం గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండలో కందికొత్తల పండగలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె గిరిజన మహిళలతో కలిసి కాసేపు సాంప్రదాయ దింసా నృత్యాలు చేశారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కందికొత్తల పండగలో గొడ్డలమ్మ తల్లిని దర్శించుకుని వచ్చాక పూజలు చేస్తామని, అలాగే ఈ సంవత్సరం కూడా పూజలు చేసి నృత్యాలు చేయడం జరిగిందని అన్నారు.
కోనసీమ: విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ YCP రాష్ట్రవ్యాప్తంగా పోరుబాట ప్రకటించడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోన సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం మండపేటలో మాట్లాడుతూ.. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎన్నిసార్లు విద్యుత్ బిల్లుల్లు పెంచారో తెలుసుకోకుండా రోడ్డెక్కడం సిగ్గుచేటని అన్నారు. 8 సార్లు పెంచిన ఘనత వైసీపీదేనని కోన అన్నారు.
TPT: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారిని ఒడిశా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీపీ రౌత్రే శనివారం సాయంత్రం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు వాసు, బాలాజీ నాయుడు పాల్గొన్నారు.
TPT: శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (SVU) పరిధిలో ఈనెల 30వ తేదీ నుంచి జరగవలసిన పీజీ(PG) మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. జనవరి 3వ తేదీ నుంచి పరీక్షలు జరుగుతాయని తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
బాపట్ల: చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై అనిల్ ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఓటీపీలు, డెబిట్ కార్డుల నెంబర్లు చెప్పవద్దన్నారు. యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, క్రమ శిక్షణతో చదువుకోవాలని సూచించారు.
ELR: రోడ్డు ప్రమాదంలో తన రెండు గేదెలను కోల్పోయిన మహిళ కుటుంబానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అండగా నిలిచారు. . ఏలూరు రూరల్ మండలం గురకల పేటకి చెందిన నర్ని వెంకటేశ్వరమ్మ అనే మహిళ రెండు గేదెలను పెంచుతూ వాటి పాలను అమ్ముతూ జీవనాధారాన్ని సాగిస్తోంది. అయితే రోడ్డు ప్రమాదంలో రెండు గేదెల కోల్పోవడంతో ఎమ్మెల్యే తన సొంత గేదెను అందించి, ఉపాధి అవకాశాన్ని కల్పించారు.
E.G: ప్రభుత్వ లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. శనివారం కొవ్వూరు ఫేక్ లేఅవుట్లలో ప్రభుత్వం పంపిణీ చేసిన అన్ని స్థలాల్లో గృహనిర్మాణ పనులను, మౌలిక సదుపాయాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు.
CTR: కుప్పం నియోజకవర్గంలో శనివారం రాత్రి ఫారెస్ట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా కలపను అక్రమంగా తరలిస్తున్న పది వాహనాలను ఫారెస్ట్ అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. కుప్పం నియోజకవర్గంలో ఇటీవల కలప అక్రమ రవాణా జోరుగా సాగుతున్న నేపథ్యంలో శనివారం రాత్రి ఫారెస్ట్ అధికారులు నియోజకవర్గ వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
W.G: నరసాపురం పీచుపాలెం కళ్యాణ మానసిక కేంద్రంలో శనివారం దివ్యాంగులకు వీల్ ఛైర్లను నరసాపురం సీనియర్ సివిల్ జడ్జి గంగరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం క్రీడా పోటీల్లో విజయం సాధించిన దివ్యాంగులకు బహుమతులు అందించారు. లయన్స్, రోటరీ క్లబ్ వాళ్లు దివ్యాంగులకు అండగా నిలిచి ముగ్గురు దివ్యాంగులకు వీల్ ఛైర్లు అందించడం అభినందనీయమన్నారు.
కోనసీమ: ఎవరైనా వాహనదారులు మద్యం సేవించి వాహనం ఎక్కితే జరిమానా పడడంతో పాటు జైలుకే అని ఎస్సై ఎం.అశోక్ హెచ్చరించారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలమూరు మండల పరిధిలోని వివిధ కూడళ్లలో ఆయన ఆధ్వర్యంలో వాహన తనిఖీలు శనివారం సాయంత్రం నిర్వహించారు. ప్రధానంగా యువత మద్యం మత్తులో వాహనాలు వేగంగా నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.