AKP: మునగపాకలో కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ ఎస్.రాము తెలిపారు. ఈ మేరకు గురువారం ఆలయంలో పెళ్లిరాట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు కళ్యాణం, మధ్యాహ్నం అన్న సమారాధన, సాయంత్రం ఊరేగింపు ఉంటుందన్నారు.
SS: కదిరి సబ్ డివిజన్ వ్యాప్తంగా పేకాట కేంద్రాలపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. గురువారం తలుపుల మండలంలోని గుండువారిపల్లి సమీపంలో పేకాట ఆడుతున్న స్థావరంపై ఎస్సై చెన్నయ్య సిబ్బందితో కలిసి దాడులు చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 12,650 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
E.G: తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని కడియంకు చెందిన రాష్ట్ర వైసీపీ కార్యదర్శి గిరజాల బాబు గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనకు అప్ప చెప్పిన పార్టీ యొక్క బాధ్యతలు, పరిస్థితులు జగన్తో చర్చించారు. ప్రజా సమస్యల కొరకు పోరాడుతూ, కార్యకర్తలకు అండదండలు అందించాలని సూచించారు.
VZM: దేశపాత్రునిపాలెం వద్ద ఈనెల 2న రాత్రి గోకాడ పద్మ మృతికి కారణమైన కారును సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించామని కొత్తవలస సీఐ షణ్ముఖరావు గురువారం తెలిపారు. రాత్రి 10 గంటల సమయంలో పాలకేంద్రం మూసేసి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె ఘటనా స్థలంలో మృతి చెందారు. ఏ.ఎస్.ఆర్. జిల్లాకు చెందిన కారు యాజమానిపై కేసు నమోదు చేశామన్నారు.
ELR: జిల్లా కామవరపుకోట గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణంలో స్టాక్ నిల్వలను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన ఇతరులకు మద్యాన్ని విక్రయించాలని సూచించారు. అధిక ధరలకు మద్యాన్ని విక్రయించకూడదని పేర్కొన్నారు.
కృష్ణా: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడం, అక్రమ రవాణా,అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గుడివాడలో వన్ టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ నిన్న వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అన్ని వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్.సీ (RC), పొల్యూషన్, ఇన్షూరెన్స్ వంటి కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హెల్మెట్ ధరించని వాహనదారులపై చలాన్లు విధించారు.
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత నవంబర్లో జరిగిన బీ.ఆర్కిటెక్చర్ (5/5, 2వ సెమిస్టర్) సప్లమెంటరీ పరీక్షల ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఫలితాలను గురువారం పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు వెల్లడించారు. విద్యార్థులు తమ ఫలితాలను వర్సిటీ వెబ్సైట్లో చూసుకోవచ్చని, రీవాల్యుయేషన్ కోసం ఈ నెల 27వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ASR: రాజవొమ్మంగి మండలం జడ్డంగి మడేరు ఆనకట్ట వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నవరంలో వివాహానికి హాజరై కొండపల్లికి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను జడ్డంగి పోలీసులు వెంటనే స్థానిక పీహెచ్సీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KKD: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ‘గ్రీవెన్స్’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. కలెక్టరేట్ ప్రజావాణి హాలులో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయి అధికారులు 3:45 గంటలకే హాజరు కావాలని సూచించారు. ఉద్యోగులు తమ సర్వీసుపై సమస్యలపై వినతులు సమర్పించాలన్నారు
అన్నమయ్య: పీలేరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. రామచంద్రారెడ్డి కాలనీలో ఐదేళ్ల బాలికపై అఘాయిత్యం జరిగినట్లు సమాచారం. ఘటనపై ఆగ్రహించిన స్థానికులు నిందితుడిగా భావిస్తున్న 15 ఏళ్ల బాలుడికి దేహశుద్ధి చేశారు.అనంతరం అతడు సమీప బంధువుల ఇంట్లో తలదాచుకోగా, పీలేరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
E.G: నిడదవోలు మండలంలోని రావిమెట్ల గ్రామ శివారులో అక్రమంగా కోడిపందాలు నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులను సమిశ్రగూడెం పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1,000 నగదుతో పాటు ఒక కోడిపుంజును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడైనా జూదం, కోడిపందాల వంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వెంటనే సమాచారం అందించాలన్నారు.
KRNL: AP మోడల్ స్కూల్లో 2026-27 విద్యాసంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశపరీక్షకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోడుమూరు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఆశాజ్యోతి ఇవాళ తెలిపారు. ఈనెల23 నుంచి ఆన్లైన్లో ఆప్లికేషన్ ప్రారంభమవుతుందని, మార్చి 31లోగా విద్యార్థులంతా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న ఆన్లైన్ ఆప్లికేషన్లను సమర్పించాలన్నారు.
W.G: ఆకివీడు మండలం పెదకాపవరంలో గ్రామంలో గురువారం ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు పర్యటించారు. గ్రామంలోని మంచినీటి చెరువు, ఫిల్టర్ బెడ్లు, సంపులు, మైక్రో యూనిట్ల నిర్వహణ తీరును పరిశీలించారు. ఆర్డబ్ల్యూఎస్ రాష్ట్ర సలహాదారుడు ప్రభాకర్ రావు, బ్రౌసు సంస్థ సభ్యులు డాక్టర్ సుధాకర్ శ్రీధర్, డీఎల్పీవో దోసిరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.
VSP: మధురవాడ జోన్లో శుక్రవారం తాగునీటి సరఫరా అంతరాయం ఉంటుందని జీవీఎంసీ అధికారులు తెలిపారు. గంభీరం వద్ద 700 మి.మీ ప్రధాన పైప్లైన్ లీకేజీ మరమ్మతుల కారణంగా వార్డు 6, 7లోని సాయిరాం కాలనీ, కొమ్మాది, బక్కన్నపాలెం, మిధిలాపురి వుడా కాలనీ, పాత మధురవాడ ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోతుందని చెప్పారు. అవసరమైతే ట్యాంకర్ కోసం సంబంధిత ఏఈలను సంప్రదించాలని సూచించారు.
ASR: జీకేవీధి మండలం మంగళపాలెం నుంచి గుణయలంక వరకూ జరుగుతున్న రోడ్డు నిర్మాణంలో కాఫీ మొక్కలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. పలువురు గిరిజన రైతులకు చెందిన కాఫీ మొక్కలు పోతున్నాయన్నారు. అధికారులు కాఫీ మొక్కలు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించాలని బాధితులు కోరుతున్నారు.