AKP: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనకాపల్లి జిల్లా పర్యటన ఖరారైంది. 28వ తేదీ ఉదయం విశాఖ నుంచి రోడ్డు మార్గంలో పదిన్నర గంటలకు రాంబిల్లి మండలం లాలం కోడూరు శివారు సీతంపాలెం గ్రామం చేరుకుంటారు. ఉదయం 10:30 నుంచి రెండు గంటల వరకు బ్లూ జెట్ కంపెనీ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గాన తిరిగి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు.
PPM: జిల్లాలోని బాల కార్మికులు పనికి కాదని బడికి వెళ్లాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాల కార్మికుల నిర్ములనపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో బాల కార్మికుల నిర్ములన ఒక ఉద్యమంలా చేపట్టాలని బాల కార్మిక నిర్ములన శాఖ అధికారిని ఆదేశించారు.
ATP: రాప్తాడులోని మాంటిస్సోరి పాఠశాల విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆన్లైన్ భద్రతపై జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు సోషల్ మీడియా దుర్వినియోగం, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళల భద్రత కోసం చట్టాలు, శక్తి యాప్ ప్రాముఖ్యతను వివరించారు.
ATP: నూతనంగా నియమితులైన మండల టీడీపీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సేవా దృక్పథంపై నాయకులకు మార్గనిర్దేశం చేశారు. బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్ఠం చేయాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలు అందించాలని పిలుపునిచ్చారు.
SKLM: పలాస-కాశీబుగ్గ మున్సిపాలికి సుడా నిధుల నుండి రూ.5 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. అధునాతన డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం కొరకు ఈ నిధులు ఉపయోగిస్తామన్నారు. దీంతో మున్సిపాలిటీ రూపు రేఖలు మారనున్నాయన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ASR: రాజవొమ్మంగి మండలంలో కారు అదుపు తప్పింది. గురువారం మధ్యాహ్నం జె.అన్నవరం నుంచి జడ్డంగి వైపుగా వస్తున్న టాటా నెక్సన్ కారు వైకుంటపురం గ్రామ సమీపంలో అదుపుతప్పి జీడి తోటలోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న మహిళ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ అప్రమత్తతో కారు బోల్తా పడలేదని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TPT: శ్రీసిటీలో 55వ జాతీయ భద్రతా వారోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారం రోజుల పాటు భద్రత అవగాహన కార్యక్రమాలు, వ్యాసరచన, డ్రాయింగ్, ప్రసంగ పోటీలు నిర్వహించనున్నారు. మార్చి 4న ముగింపు ఉత్సవం జరగనుంది.
AKP: నాతవరం శ్రీగంగాదేవి, నూకాలమ్మ తల్లి ఆలయాల 13 ఎకరాల వ్యవసాయ భూముల పంట కౌలకు గురువారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వేలం జరిగింది. 11 మంది పాటదారులు పాల్గొన్న ఈ వేలంలో గవిరెడ్డి సత్యనారాయణ రూ.1.48 లక్షలకు పాటను పొందారు. ఈ కార్యక్రమంలో ఉమాదేవి, ఈవో సాంబశివరావు పాల్గొన్నారు.
CTR: మార్చి నెలలో పుంగనూరులో ప్రతిష్టాత్మకంగా శ్రీసుగుటూరు గంగమ్మ జాతర జరగనుంది. ఈ నేపథ్యంలోనే జాతరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నారు. భక్తుల సౌకర్యార్థం చర్యలు చేపట్టనున్నారు. గురువారం మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ బాషా, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, సీఐ సుబ్బరాయుడు సంయుక్తంగా కలిసి వాహనాల పార్కింగ్కు స్థలాన్ని పరిశీలించారు.
GNTR: ఎమ్మెల్యే ధూళిపాళ్ల చొరవతో మంజూరైన రూ. 36 లక్షల నిధులతో చేబ్రోలులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. మండల టీడీపీ అధ్యక్షుడు మైలా వెంకట రామ రాజు, ఎంపీటీసీ పఠాన్ ఇర్ఫాన్ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఆర్ డీఈ ఉమా శ్రీనివాసరావు, డాక్టర్ ప్రియాంక, కూటమి నాయకులు పాల్గొన్నారు.
కృష్ణా: న్యూఢిల్లీ నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ రాకేష్ లఖన్ నీట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ బాలాజీ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మే నెల 3వ తేదీన జరగనున్న నీట్ పరీక్షకు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
BPT: ఇసుకపల్లిలో వెలసిన శ్రీ భ్రమరాంబ సమేత చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధికి దేవాదాయ శాఖ నుంచి రూ. 40 లక్షలు మంజూరయ్యాయి. మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రత్యేక చొరవతో ఈ నిధులు కేటాయించినట్లు టీడీపీ నేత శివప్రసాద్ తెలిపారు. ఈ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన గురువారం భూమి పూజ నిర్వహించారు.
బాపట్ల జిల్లా రిజిస్ట్రార్గా పదోన్నతి పొందిన పంగులూరి శ్రీనివాసరావు గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు మంచి పేరు వచ్చేలా నిబద్ధతతో పనిచేయాలని ఈ సందర్భంగా శ్రీనివాసరావుకు కలెక్టర్ సూచించారు.
NDL: చాగలమర్రి మండలంలో పెద్దవంగలిలో శ్రీ హజరత్ సయ్యద్ షా దస్తగిరి స్వామి ఉరుసు ఉత్సవాలు మార్చి 1, 2న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గురువారం తెలిపారు. మార్చి 1న గంధం, 2న ఉరుసు నిర్వహించనున్నట్లు మత పెద్దలు పేర్కొన్నారు. ఉత్సవాల నిమిత్తం దర్గాను నిర్వాహకులు సుందరంగా అలంకరిస్తున్నారు.
W.G: వీరంపాలెం, పట్టింపాలెం ఎంపీటీసీ సభ్యురాలు జంపల్లి సత్యవతి గురువారం వైసీపీలో చేరారు. నియోజకవర్గ ఇంఛార్జ్ వడ్డే రఘురామ్ సమక్షంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రఘురామ్ మాట్లాడుతూ.. గతంలో పార్టీని వీడిన వారు తిరిగి వస్తున్నారని, రానున్న రోజుల్లో కూటమి పార్టీల నుంచి భారీగా చేరికలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు.