తమిళ, మళయాల దర్శకులతో మన పెద్ద హీరోలు తరువాయి ప్రాజెక్టులకి చేతులు కలుపుతున్నారు. పైగా ఒక్కొక్క హీరో సినిమా రెండు మూడేళ్ళకు పైగానే తీసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడున్న దర్శకులకు దాదాపుగా డిమాండ్ పడిపోయిందనే లెక్కలేస్తున్నారు కొందరు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన అనుకున్న దర్శకులను మన తెలుగు హీరోలు పూర్తిగా పక్కన పెడుతున్నారు. ఇప్పుడున్న దర్శకులలో ఏ రాజమౌళియో, ఏ అనిల్ రావిపూడో లేదా ఏ సుకుమారో, కల్కి సినిమాతో ప్రపంచానికే షాక్ ఇచ్చిన ఒక నాగ అశ్విన్ తప్పితే మరో డైరెక్టర్ పేరే వినిపించడం లేదు. అటూఇటూ చూసి తమిళ, మళయాల దర్శకులతో మన పెద్ద హీరోలు తరువాయి ప్రాజెక్టులకి చేతులు కలుపుతున్నారు. పైగా ఒక్కొక్క హీరో సినిమా రెండు మూడేళ్ళకు పైగానే తీసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడున్న దర్శకులకు దాదాపుగా డిమాండ్ పడిపోయిందనే లెక్కలేస్తున్నారు కొందరు.
యువసమ్రాట్ నాగార్జున ఆర్ఎ కార్తీక్తో తన 100వ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. రేపోమాపో అది సెట్కి వెళ్ళబోతోంది. ఆల్రెడీ అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో చేస్తున్న చిత్రం ముంబైలో సెట్స్ మీదకొచ్చేసింది. సరే మన తెలుగులో బాలచందర్ గారి దగ్గర్నుంచీ తమిళ దర్శకులు తెలుగులో చేయడం పెద్ద కొత్తేం కాదు అని సరిపెట్టుకోవచ్చు. ఈ పాన్ ఇండియా యుగంలో ఒక భాషదర్శకులు మరో భాషలో చేయడం కూడా పెద్దగా విచిత్రం అనిపించకపోవచ్చు. ఎందుకంటే మన అనుకున్న సందీప్ వంగా యానిమల్ సినిమాతో ఆలిండియా లెవెల్లో చితక్కొట్టేశాడు. ఇప్పుడు రాజమౌళి తర్వాత సందీప్ వంగా, సుకుమార్ పేర్లే వీరగా స్వైరవిహారం చేస్తున్నాయి ఇండియాలో. అది కూడా ఓకే.
ఇప్పుడు కొత్తగా మళ్ళీ త్రివిక్రమ్ పేరు జూనియర్ ఎన్టీఆర్తో కలసి ఊరేగుతోంది అనుకోండి. కార్తికేయుడి పాత్రలో జూనియర్ కనిపించబోతున్న మైథలాజికల్ కథా చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించబోతున్నట్టుగా వస్తున్న వార్త ఈ మధ్యలో బాగానే సంచలనం రేపింది. త్రివిక్రమ్ కూడా ఈ మధ్యలో ఏమంత గొప్పగా పెరఫార్మ్ చేసిన దాఖలాలు లేవు.
కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఆ పెద్ద దర్శకుల పేర్లు ఒకటి రెండు తప్పితే మధ్యస్థాయి నుంచి పైకి ఎదిగి హీరోల దృష్టిని ఆకట్టుకున్న యంగ్ డైరెక్టరే కరువైపోయాడన్నదే ఇప్పుడు పరిశ్రమలో పెద్ద చర్చగా మారిపోయింది. ఎందుకంటే దానికి కారణం ఒక్కటే. ఈ మధ్య వరస ఫ్లాపులైన చిత్రాలను చూస్తుంటే ఈ యంగ్ డైరెక్టర్లలో ఏ ఒక్కరూ ఓ గొప్ప విజన్ గానీ, క్రియేటివ్ ఎబిలిటీని గానీ ప్రదర్శించలేక బాక్సాఫీసు దగ్గర బొక్కబోర్లా పడిపోతున్నారు. మన నిర్మాతలా ఇంకా ఏజ్ ఓల్డ్ ఫార్ములా గుప్పిట నుంచి బైటకు రాలేక కొత్త తరహా కథలు అర్థం చేసుకోలేక మూస చిత్రాలతో మగ్గిపోతున్నారు. ఆ మేరకు నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు పూర్తిగా నష్టపోయి ధియేటర్లు మూసుకుంటామని మూకమ్మడిగా ఎగ్జిబిటర్లు బైఠాయించిన సంగతి మనందరికీ తెలిసిందే.
దానాదీనా మేజికల్గా సినిమాలు తీసి పెద్ద హీరోలను పట్టుకోగలిగే యంగ్ డైరెక్టర్లు ఎక్కడా లేనట్టుగానే తయారైంది పరిస్థితి. ఒక రేంజ్ డైరెక్టర్లకి పెద్ద హీరోలకి కథ చెప్పే అవకాశం కూడా లేకుండా పోయింది. మళయాళ దర్శకుడు బేసిల్ జాకబ్తో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నాడంటే జాకబ్ వెనుక మిన్నాల్ మురళిలాంటి ఓ గొప్ప సినిమా కనబడుతోంది. అలా చెప్పుకోగలిగే సినిమా ఉన్న దర్శకుడు ఒక్కడు మచ్చుకంటే మచ్చుకి కూడా భూతద్దం పెట్టి వెతికినా సరే లేడు గాక లేడన్నది అందరూ ఒప్పుకుంటున్న వాస్తవం.
వైజయంతీ మూవీస్ లాంటి బ్యానర్ ఒక్కటి తప్పితే సీతారామం లాంటి సినిమా తీసే టేస్ట్ ఉన్న మరో బ్యానర్ పేరు కూడా వినిపించకపోవడం కూడా విచిత్రమే. ఇటువంటి పరిస్థితుల మధ్యలో పెద్ద హీరోలనిపించుకుంటున్న మన రేంజ్ ఉన్న హీరోలు తెలుగువాళ్ళని వద్దనుకుని పరాయిభాషా దర్శకుల పంచన చేరక తప్పడం లేదు.