యువసమ్రాట్ నాగార్జున చేయబోతున్న 100వ చిత్రం అక్కినేని అభిమానులలో పెద్ద సందడిగా మారింది. కింగ్ 100 టైటిల్ ఫిక్స్ అయినట్టుగా వినిపిస్తున్న ఈ చిత్రం నాగార్జున కెరీర్లోనే అతి పెద్ద ప్రయత్నం అవుతుందని కూడా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి తెలుగులో డబ్ అయిన తమిళ చిత్రం ఆకాశం డైరెక్ట్ చేసిన ఆర్ఎ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
గ్యాంగ్స్టర్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్న కింగ్ 100 చిత్రకథా నేపథ్యం లాటరీ మాఫియాతో తయారవుతోందని అధికారిక భోగట్టా. చెన్నైలో ఉంటున్న మార్టిన్ అనే లాటరీ వ్యాపారవేత్త పాత్ర బేస్తో రూపొందుతోందిట. మార్టిన్ తమిళనాడులో ఓ పెద్ద మాఫియా డాన్లాంటి ఓ వ్యక్తి. ఆయన సంచలనాలు అన్నీఇన్నీ కావు. లాటరీ దగ్గర్నుంచీ, రియల్ ఎస్టేట్ దందాలు అన్నిటిలోనూ మార్టిన్ పేరు ప్రముఖంగా వినిపించడమే కాదు, ఆయనపైన కోర్టుల్లో సవాలక్ష కేసులు, పరిష్కారం కాని వ్యవహారాలు కోకొల్లలు. హైదరాబాద్లో కూడా ఆయన పేరు మీద అనేక విలువైన భూములు న్యాయపరమైన ఉచ్చుల్లో చిక్కుకున్నాయని చెబుతారు. ఆయనకి పెద్ద మొత్తాల్లో డబ్బుని ముట్టచెప్పడానికే ఎందరో ప్రయత్నాలు చేసినా సరే ఆయన మాత్రం ఆయా భూముల మీద పట్టు వదలకుండా నిలబెట్టుకుంటున్నాడని రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్లో పేరుమోసిన రియల్టర్లే చెప్పుకుంటుంటారు. అదీ మార్టిన్ చరిత్ర.
అటువంటి పాత్రని నాగార్జున ట్రై చేయడం విశేషమే. తమిళనాడుకి చెందినవాడు కాబట్టి, ఆర్ఎ కార్తీక్కి మార్టిన్ క్యారెక్టర్ గురించి బాగా తెలిసే అవకాశం ఉంది. మార్టిన్ జీవితంలో ప్రధానమైన లైవ్ క్యారెక్టర్స్ చాలానే ఉన్నాయిట. అందులో ప్రధానంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా ఉండడం ప్రధానమైన విశేషం అని కొందరు చెబుతున్నారు. అయితే ఈ పాత్రని లేడీ అమితాబ్ విజయశాంతిని పోషించమని కోరగా ఆమె కథ పూర్తిగా తయారవలేదు, అపరిపక్వంగా ఉందనే ఆలోచనతో ఇంకా డెవలప్ చేస్తే చూద్ధాం అని సున్నితంగా తిరస్కరించారని ఫిల్మ్నగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
అతి తొందరగా ప్రారంభించాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా కథా చర్చలు, అందులో ప్రధానతారాగణం ఎంపిక ఇటువంటి ఒకటిరెండు అడ్డంకులతో కింగ్ 100 లేటవుతోంది. లేడీ అమితాబ్ విజయశాంతి గనక ఒప్పుకుంటే, అన్నపూర్ణ సంస్థ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1989లొ నిర్మించిన విజయ్ చిత్రం తర్వాత నాగార్జున, విజయశాంతి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయ్యేది ఇప్పుడే.