SRCL: దిల్ రాజు ప్రొడక్షన్లో రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాలో ఓ సీన్న్ను రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కస్బేకట్కూర్ గ్రామంలో చిత్రీకరించారు. ఒకరోజు షూట్ చేసిన ఈ సీన్లో మానేరు అందాలు వెండితెరపై కనువిందు చేశాయి. సుమారు రెండు నిమిషాల నిడివిగల ఈ సినిమాలో గ్రామస్థులు కూడా బ్యాక్ గ్రాండ్లో కనిపిస్తారు.
KNR: భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి ఆలయం విద్యుత్ కాంతులతో సుందర దృశ్యంగా కనిపిస్తోంది బ్రహ్మోత్సవాలకు చుట్టుపక్కల జిల్లాలే కాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని దర్శించుకుంటున్నారు. భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు తరలివస్తున్నారు.
KMM: ఐదు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ గురువారం రోజున తిరిగి ప్రారంభం కానుంది. శని, ఆదివారం వారాంతపు యార్డు బంద్, సోమ, మంగళ, బుధవారం సంక్రాంతి సందర్భంగా మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు వెల్లడించారు.
NGKL: పదర మండలం ఉడి మిళ్లలో రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన ఎద్దుల బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే వంశీ కృష్ణ ప్రారంభించారు. మొదటి బహుమతి రూ.50 వేలు, రెండవ బహుమతి రూ.30 వేలు, 3వ బహుమతి రూ.20వేలుగా నిర్వాహకులు ప్రకటించారు. సంక్రాతి పండుగ బండలాగుడు పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు.
MHBD: ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో ఆయన ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీఓలు, మున్సిపల్ కమిషనర్స్, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కలెక్టర్ పలు సూచనలు చేశారు.
WGL: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈరోజు అన్నారం షరీఫ్ దర్గాకు గిలాఫ్ సమర్పించారు. ఈనెల 16, 17న అన్నారం షరీఫ్లో దర్గా ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ముస్లిం మత పెద్దల సమక్షంలో ఈరోజు ఉదయం ఆయన గిలాఫ్ సమర్పించారు. మాజీ MLA, ప్రజలంతా అల్లా దీవెనలతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వారు దీవించారు.
NRML: నిర్మల్లోని ఇస్లాంపుర కమల్ పౌష్ మసీద్ కమిటీ బుధవారం జిల్లా కేంద్రంలోని డీసీసీ క్యాంపు కార్యాలయంలో శ్రీహరి రావును మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మసీద్ సమస్యలను పరిష్కరించాలని అభివృద్ధికి సహకరించాలని కోరారు. అందుకు డీసీసీ అధ్యక్షులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మసీద్ కమిటీ అధ్యక్షులు మినాజ్, సభ్యులు పాల్గొన్నారు.
ADB: ఉట్నూరు పట్టణంలోని కేబీ కాంప్లెక్స్లో ఉన్న ఎస్బీఐ ఆర్ఎస్ఈటీఐ ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ కోర్సులలో ఉచిత శిక్షణకు యువకులు దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ డైరెక్టర్ మహమ్మద్ గౌస్ తెలిపారు. టూ వీలర్ మెకానిక్, హౌస్ వైరింగ్ కోర్సులలో నెలరోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తామని తెలిపారు. ఆసక్తి గలవారు నిజ ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
WGL: వరంగల్ నగరంలో పోలీసులు రెండు రోజులుగా విస్తృత తనిఖీలను చేపట్టారు. ప్రజలు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వ గ్రామాలకు వెళ్లిన నేపథ్యంలో చోరీలకు అవకాశం ఉండడంతో గస్తీని ముమ్మరం చేశారు. వరంగల్ ఏసీపీ నందిరం నాయక్ నేతృత్వంలో సీఐలు ఎస్సై లతోపాటు పోలీసు సిబ్బంది లాడ్జీలు, హోటల్స్తో పాటు రహదారులను దిగ్భందించి వాహనాలను తనిఖీ చేశారు.
NRPT: సీపీఐ జిల్లా కార్యదర్శి కొండన్న మృతి కార్మిక లోకానికి తీరని లోటు అని ఎమ్మెల్యే శ్రీహరి అన్నారు. మక్తల్ మండలం దాసరి పల్లి గ్రామానికి చెందిన కొండన్న అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గ్రామానికి చేరుకొని పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
MDK: జిల్లా పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల దేవాలయంలో బుధవారం వన దుర్గమ్మకు ప్రత్యేక అలంకరణతో పూజలు చేశారు. అనంతరం మంగళహారతి నీరాజనం చేశారు. జిల్లాలోని నలుమూలల నుండి భక్తులు తెల్లవారి నుంచి ఆలయానికి తరలివస్తున్నారు. స్థానిక నది పాయలో పుణ్యస్నానం చేసి వన దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేస్తున్నారు.
MBNR: ఉమ్మడి జిల్లాలో మొత్తం 6,054 చెరువులు ఉన్నాయి. 2014లో ఏర్పడిన అప్పటి ప్రభుత్వం నీటి తీరువా పన్ను చెల్లింపుతో పాటు సాగునీటి సంఘాలను రద్దు చేసింది. దీంతో చెరువులు, కాలువల మరమ్మత్తులకు నిధులు కరువయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం సాగునీటి సంఘాలను పునరుద్ధరణ చేయనుంది. విధి విధానాలను ఖరారు చేసేందుకు కసరత్తు జరుగుతోందని జిల్లా అధికారులు తెలిపారు.
MDK: ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డిని మంగళవారం రామాయంపేటలోని పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారు ఆయనకు స్వామివారి బ్రహోత్సవాలకు ముఖ్యఅతిథిగా రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఫిబ్రవరి 2వ వారంలో నిర్వహిస్తున్న పుష్కర వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని కోరారు.
PDPL: సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామం నుంచి కనుకుల టర్నింగ్ రోడ్డు అధ్వానంగా మారింది. తారు పోయి గుంతలు పడడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు, గ్రామస్తులు వాపోతున్నారు. ఈ దారి గుండా వెళ్లడంతో బైకులు రిపేర్కి గురవుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు రోడ్డుకి మరమ్మతు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
SRCL: జిల్లా వేములవాడలో అయ్యప్ప స్వామి అభరణాలను ఊరేగించారు. మకర సంక్రాంతి సందర్భంగా గత 27 సంవత్సరాల నుంచి వేములవాడ అయ్యప్ప దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం నుంచి అయ్యప్ప ఆలయం వరకు అభరణాలతో ఊరేగింపుగా వెళ్లారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.