KNR: జమ్మికుంట పట్టణంలోని వినాయక ఫంక్షన్ హాల్లో గురువారం ఉదయం 9:30 గంటలకు త్రీ వీలర్, ఫోర్ వీలర్ డ్రైవర్లకు ఉచితంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సైదాపూర్ ఎస్సై కొప్పుల స్వాతి తెలిపారు. ఈ అవకాశాన్ని డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కంటి పరీక్షల అనంతరం అవసరమైన వారికి అద్దాలను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
NLG: చిట్యాల మండలం వనిపాకల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మేకలను మేత మేసేందుకు గ్రామ శివారులోకి తోలుకుపోయిన కట్టంగూరి అంజయ్య (70) ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో జారిపడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై.. అంజయ్య మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు.
ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలను కలెక్టర్ హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసిఫాబాద్ పట్టణంలోని TGTWRJC బాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న గదులను సందర్శించి, వారికి కల్పించిన వసతులపై ఆరా తీశారు.
MNCL: లక్షెట్టిపేట పట్టణంలోని ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని స్థానిక ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. బుధవారం ఉదయం ఆయన లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రం వద్ద పరిస్థితిని అధికారులు, పోలీసుల నుంచి అడిగి తెలుసుకున్నారు.
KMR: బిక్కనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఎస్సై ఆంజనేయులు సందర్శించి భద్రతను పర్యవేక్షించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున అపరిచితులకు అనుమతి లేదన్నారు. పరీక్షల సమయంలో జిరాక్స్ దుకాణాలు తెరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
RR: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 14వ వార్డు రజక నగర్, అంబేద్కర్ నగర్లలో బోరు మోటర్ పాడైపోయింది. ఈ విషయాన్ని స్థానికులు వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కౌన్సిలర్ బోరు మోటార్లను బాగు చేయించారు. నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మండల వైద్యాధికారి డాక్టర్ మౌనిక ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మౌనిక పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం డాక్టర్ మౌనిక మాట్లాడుతూ.. ప్రస్తుత నెలలో 182 మందికి ఓపీ సేవలు, 117 మందికి రక్త పరీక్షలు, 1404 మందికి వివిధ టెస్టులు నిర్వహించినట్లు వివరించారు. వైద్య సిబ్బంది ఉన్నారు.
MDK: నార్సింగి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న వార్షిక పరీక్షలను తహశీల్దార్ గ్రేసి బాయ్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరుగుతున్నాయని ఆమె తెలిపారు. అవసరమైన భద్రతా చర్యలు తీసుకున్నామని పేర్కొంటూ, విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు.
KMM: పశువులకు జనరిక్ మందులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పశు ఔషధ విక్రయ కేంద్రాల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తోందని జిల్లా పశువైద్య అధికారి బి. పురంధర్ తెలిపారు. జిల్లాకు ఒకటి, మండలానికి ఒక కేంద్రం చొప్పున సహకార సంఘాల ద్వారా వీటిని స్థాపించవచ్చు. 120 గజాల స్థలం, ఫార్మసిస్ట్ రిజిస్ట్రేషన్ కలిగిన వారు రూ.5 వేల ఫీజుతో ఆన్ లైన్ల లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
HYD: నాంపల్లి ఎగ్జిబిషన్లో 264 మంది పోకిరీలను షీ టీమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో 242 మంది మేజర్లు, 22 మంది మైనర్లు ఉన్నట్లు గుర్తించారు. 56 మందిపై కేసులు నమోదు చేయగా.. 52 మందికి రూ.1,050ను కోర్టు జరిమానా విధించింది. నలుగురికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించగా..188 మందికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు.
నల్లగొండ: జిల్లా దేవరకొండ పట్టణంలో బుధవారం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని 4 కేంద్రాలలో మొత్తం 1,210 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు తాగునీరు, వెలుతురు వంటి సౌకర్యాలు కల్పించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
PDPL: పెద్దపల్లి సర్కిల్లో రైతులకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు, వ్యవసాయ కనెక్షన్లు వేగంగా మంజూరు చేస్తున్నట్లు ఎస్ఈ వి.గంగాధర్ తెలిపారు. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 344 సర్వీసులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. పంటల కోత అనంతరం రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లాలో రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా వ్యవసాయ విద్యుత్ సర్వీసులను గరిష్ఠ స్థాయిలో మంజూరు చేసినట్లు SE బి. సుదర్శనం తెలిపారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు మొత్తం 656 వ్యవసాయ సర్వీసులు మంజూరు చేశామన్నారు.
GDWL: గట్టు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు వర్షపు నీరు నిలిచి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కురిసిన స్వల్ప వర్షంతో మురుగు నీరు, వర్షపు నీరు కలిసి రోడ్డు కుంటలా మారింది. ప్రధాన రహదారిపై వాహనాలు ప్రయాణించలేక అవస్థలు పడుతున్నారని, అధికారులు తక్షణమే నీటిని తొలగించి శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు.
HNK: ఉద్యమకారుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండ సుబేదారిలోని క్యాంప్ ఆఫీస్లో పలువురు ఉద్యమకారులు ఎమ్మెల్యేతో భేటీ అయి ఉద్యమకారులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఉద్యమకారులకు అండగా ఉంటూ వారి సమస్యలు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే అన్నారు.